తుఫాను నేపధ్యంలో పత్తి తేమ శాతం పైన కేంద్రానికి తుమ్మల లేఖ
x

తుఫాను నేపధ్యంలో పత్తి తేమ శాతం పైన కేంద్రానికి తుమ్మల లేఖ

మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు CCI అంగీకరించాలని విజ్ఞప్తి


మొoథా తుఫాన్ కారణంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో ఖమ్మం మంచిర్యాల కామారెడ్డి నల్గొండ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ రైతులతో మంత్రి తుమ్మల మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “తుఫాన్ ప్రభావంతో చేతి కందిన పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని కోరారు. మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికి పత్తి కొనుగోళ్లు జరపాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఈ వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్లు సీసీఐ ప్రారంభించింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 72 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంబించారు. 784 మంది రైతులకు చెందిన 1,623 క్వింటాళ్ల పత్తి తొలిరోజు కొనుగోలు చేశారు. పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనాలున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడులు తగ్గడం, మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం విషయంలో 12 శాతం పైగా ఉన్న పత్తినీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు.

రైతులు కపాస్ కిసాన్ యాప్ సద్వినియగం చేసుకోవాలి. తేమ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి లేక పోతే మద్దతు ధర దక్కక రైతులు నష్ట పోతారని మంత్రి తుమ్మల తెలిపారు.

టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

పత్తి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 కి కాల్ చేయొచ్చని మంత్రి తుమ్మల ప్రకటించారు. పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేలా ప్రజా ప్రభుత్వం లో అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి రైతులు పత్తి అమ్ముకునేలా సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

నేటి నుంచి సోయాబీన్ కొనుగోళ్లు

నేటి నుంచి రాష్ట్రం లో సోయాబీన్ కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నాయి అని ఆయన తెలిపారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లో మొక్కజొన్న జొన్నలు చేర్చాలని సోయా పై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Read More
Next Story