‘నేననుకుని ఉంటే  కేటీఆర్ ఈ పాటికే జైలు లో ఉండేవారు’
x

‘నేననుకుని ఉంటే కేటీఆర్ ఈ పాటికే జైలు లో ఉండేవారు’

వాడివేడి చర్చలు, వ్యక్తిగత విమర్శలు ప్రతి విమర్శల మధ్య సాగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.


అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య చివరిరోజు సవాళ్లు జోరందుకున్నాయి.11 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో కీలకాంశాలపై చర్చసాగింది. చివరిరోజు కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు 2025 తో పాటు , అవయవదానం విషయంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్తబిల్లుకు ఆమోదం తెలిపారు. దానితోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం కలిగించే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. అద్యంతం ఆసక్తికరంగా నువ్వా నేనా అన్నట్లు సాగిన చర్చలు, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, రాష్ట్ర అప్పులు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల చుట్టూ తిరిగాయి. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అప్పులపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ చివరలో బీఆర్ఎస్ సభ్యులు ప్రొటెస్ట్ మినహా సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ద్రవ్యవినిమయ బిల్లుతో పాటు మూడు తీర్మానాలను సభ ఆమోదించిన తరువాత స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తో తీవ్ర అన్యాయం

డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్​పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని ఈసభ ఖండిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన పిలుపు మేరకు జనాభా తగ్గించిన రాష్ట్రాలు ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల నష్టపోకూడదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సూచించిన సీఎం ప్రస్తుతం ఉన్న లోక్​సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని అన్నారు.. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని కోరారు..

1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ను 25 ఏళ్లు నిలిపివేశారు. డీలిమిటేషన్‌పై గందరగోళం నెలకొంది. ఇటీవల తమిళనాడు సీఎం డీలిమిటేషన్‌పై సమావేశం ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను వాజపేయి కూడా వ్యతిరేకించారని రేవంత్​ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ తో లోక్​సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుందన్నారు. డీలిమిటేషన్​పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొందరు అంటున్నారని సీఎం చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించ కుండా కేంద్ర ఆదేశాలను పెడచెవిన పెడితే ఇప్పుడు వాటికే లబ్థి చేకూరుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్​సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందని , డీలిమిటేషన్​ జరిగితే లోక్​సభలో ఆ ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.. డీలిమిటేషన్​ అనేది దక్షిణాది రాష్ట్రాలను లిమిట్​లో పెట్టడానికే అని వ్యాఖ్యానించిన సీఎం, దీనిపై అందరూ ఒకే మాటపై ఉండాలని సూచించారు.

ఏపీ, తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలను పెంచాలని పునర్విభజన చట్టంలో ఉన్నా. ఇప్పటివరకు శాసనసభ నియోజకవర్గాలను పెంచలేదన్నారు.

24 శాతం ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36 శాతం పన్నులు కడుతున్నాయి. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయని, యూపీ, బిహార్​, మధ్యప్రదేశ్​కు కేంద్రం పన్నుల్లో ఎక్కువ వాటాను ఇస్తోందని ఆరోపించారు. ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా రాజకీయ ప్రయోజనాలను వదులుకోబోమని తేల్చి చెప్పిన రేవంత్ డీలిమిటేషన్​పై ఆనాడు వాజపేయి చేసిన తీర్మానానికి బీజేపీ కట్టుబడి ఉందా?' అని ప్రశ్నించారు.

అవయవదానం బిల్లుకు ఆమోదం

అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని పార్టీల సభ్యులు అవయవదాన బిల్లును స్వాగతించారు. పలువురు ఎమ్మెల్యేలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు. అవయవదానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు. ప్రజా ప్రతినిధులం.. అందరికీ ఆదర్శంగా నిలవాలి. నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై చైతన్యం తేవాలని కేటీఆర్‌ అన్నారు. సభ్యులు ముందుకు వస్తేనే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని, అవయవదానంపై తొలి సంతకం తానే చేస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. అవయవదానం అనేది గొప్ప మానవీయ చర్య అని, అవయవదానం మరింత మందికి జీవితాన్ని ఇస్తుందన్నారు.అవయవదానం విషయంలో రాష్ట్ర విధానాలను రద్దు చేస్తూ, కేంద్ర విధానాలకు అమలు చేసేలా తీసుకొచ్చిన కొత్త అవయవదానం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

సభలో కాగ్ నివేదిక

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను మంత్రి సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్‌ అంచనా 2,77,690 కోట్లు, చేసిన ఖర్చు 2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్‌ అంచనాలో 79 శాతం ఖర్చు అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్‌ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం వ్యయం అయిందని స్పష్టం చేశారు. అదనంగా 1,11,477 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని కాగ్ నివేదిక తెలిపింది.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా ప్రభుత్వం 10,156 కోట్లు తీసుకుంది.35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌ను 145 రోజుల పాటు వాడుకున్న ప్రభుత్వం,2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్ల వ్యయం చేసింది.

2023-24లో వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేసింది.ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు రాగా

2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం రూ.9 వేల 934 కోట్లుగా కాగ్ రిపోర్ట్ వెల్లడించింది.

రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే ఖర్చు చేశారని,

2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లుగా కాగ్ తెలిపింది.

రెవెన్యూ లోటు 49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.33గా నివేదిక స్పష్టం చేసింది.

ఆర్థిక బిల్లు కు సభ ఆమోదం

ద్రవ్యవినిమయ బిల్లు లో చర్చలో భాగంగా సభలో ఆసక్తికర చర్చ సాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి తో పాటు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రం అప్పుల పై కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము కూడా కేంద్రంతో సఖ్యతగానే ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ తెలంగాణకు ఏమీ రాలేదని ఆయన విమర్శించారు.కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ బాగుండాలన్నదే తమ సంకల్పమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి పనిలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, మరి కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని వ్యాఖ్యానించారు.కక్ష సాధింపునకు కాంగ్రెస్ పాల్పడుతోందని విమర్శించారు.


కేటీఆర్ ఈ పాటికే జైలు లో ఉండేవారు


కేటిఆర్ కక్షపూరిత రాజకీయాల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము కూడా కక్షపూరిత రాజకీయాలను చేస్తే ఇప్పటికే కేటీఆర్ చంచల్ గూడ జైల్లో ఉండేవారని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ. 500 జరిమానా విధిస్తారని... కానీ, అప్పట్లో ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న తనను డ్రోన్ ఎగరవేశానని జైల్లో పెట్టి వేధించారని మండిపడ్డారు.జైలులో తీవ్రవాదులు ఉండేచోట ప్రత్యేకంగా చిన్న గదిలో 16రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని, లెట్లు కూడా వేసి నిద్ర రాకుండా చేశారన్నారు

తన కూతురు పెళ్లికి కూడా తాను బెయిల్ పై వచ్చి మళ్లీ జైలుకు నేరుగా వెళ్లానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కక్ష సాధించాలను కుంటే ముఖ్యమంత్రి కి వున్న అధికారాలతో మిమల్ని ఎప్పుడో జైలు పాలు చేసేవాడినన్నారు.

ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇస్తే, పదేళ్ల తరువాత అప్పుల రాష్ట్రంగా మిగిల్చి ప్రజలు తిరస్కరిస్తే ,తమ చేతిలో అప్పుల రాష్ట్రాన్ని పెట్టారని లెక్కలతో సహా తిప్పికొట్టారు. రైతు రుణమాఫీ హామీని కూడా నాలుగేళ్లు దశల వారీగా సరిగా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 26 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధ్వంసాన్ని లెక్కలతో వివరించారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా కేటీఆర్ సవాల్..

తెలంగాణలో ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. తన సిరిసిల్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాలకు వెళదామని సవాల్ విసిరారు.వంద శాతం రుణ మాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవిని వదులుకుంటాన్నారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమయిన సమావేశం చీకటి పడేదాకా పలు తీర్మానాపై చర్చలతో సాగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల ప్రశ్నలకు ఆర్ధిక మంత్రి భట్టి సమాధానం తరువాత ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించారు.

Read More
Next Story