
‘కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో కష్టాలు మొదలయ్యాయి’
అన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప అమలుకు నోచుకోలేదన్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్చందర్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు ఘాటు విమర్శలు చేశారు. ప్రకటనలు చేయడం తప్ప అమలు చేయడం చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్దేనంటూ చురకలంటించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన ప్రకటనల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా నిరుద్యోగులకు మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగిన క్రాస్ఓటింగ్తో ఇండి కూటమిలో ఐక్యత కరువైందన్న అంశం తేటతెల్లమైందని అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అనేక మందికి కష్టాలు మొదలయ్యాయని అన్నారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రొఫెసర్లకు జీతాలు రావట్లేదు. యూనివర్సిటీ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో యూనివర్సిటీలను నడుపుతూ భావితరాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి రూ.వెయ్యికోట్లు ఇస్తానని సీఎం రేవంత్ గొప్పలు చెప్పారు. దావోస్కు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? దారి ఖర్చులు కూడా వచ్చినట్లు లేదు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు తప్ప.. అమలు చేయరు. యువత గురించి ప్రభుత్వం ఆలోచించాలి’’ అని ఆయన కోరారు.