మూడు విడతల్లో రుణమాఫీ... ముహూర్తం ఫిక్స్
x

మూడు విడతల్లో రుణమాఫీ... ముహూర్తం ఫిక్స్

రుణమాఫీ మూడు విడతల్లో చేయనున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


రుణమాఫీ మూడు విడతల్లో చేయనున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. బుధవారం ప్రజా భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రుణాలు, నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలు, ఆగస్టు లో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం: రేవంత్

ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు రేవంత్. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు. ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు... ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారన్నారు. "కానీ గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. అందుకే ఇబ్బందులు ఎదురైనా రైతురుణమాఫీ హామీకి కట్టుబడి అమలుచేస్తున్నామని" సీఎం చెప్పారు.

నా జీవితంలో గుర్తుండిపోయే రోజు...

ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి అని సీఎం ఆశించారు. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలన్నారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని రేవంత్ అన్నారు. రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని చెప్పారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది... అందుకే ఏకమొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ అన్నారు.

జాతీయ స్థాయిలో చర్చ జరగాలి...

పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ విమర్శించారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదన్నారు. "దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలి. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి" అని రేవంత్ ఆశించారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని శ్రేణులకు ఆదేశించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని కోరారు. "ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసింది. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి" అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read More
Next Story