
Bhatti Vikramarka | ‘ప్రపంచానికే ఆదర్శంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం’
ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క తెలిపారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క తెలిపారు. ఈ సిటీని నెట్జీరో సిటీగా నిర్మించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నోవాటెల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో బిల్డర్స్కు హైదరాబాద్ స్వర్గధామం కానుందని చెప్పారు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చడానికి పలు విధాన నిర్ణయాలు తీసుకున్నామని, ఆదాయం కంటే నగర ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని డీజిల్ వాహనాలన్నింటినీ దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని చెప్పారు. అదే విధంగా మూసీ పునరుజ్జీవనం విషయంలో కూడా ముందడుగు వేస్తామని, ఆధునిక దేశాల బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తామని చెప్పారు.
బిల్డర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసి బిల్డర్స్, డెవలపర్స్ ను ఇబ్బంది పెట్టే పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులుగా బిల్డర్ కు సంపూర్ణ సహకారం అందిస్తాం, బిల్డర్స్కు హైదరాబాద్ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఒక యువ రాష్ట్రం, ప్రపంచ పటంలో రైజింగ్ గా కనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని తెలిపారు. హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఢిల్లీ ప్రజలు స్థానికంగా ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు ఒక సీజన్లో అక్కడి నుంచి పౌరులు వలస వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఆ దుస్థితి హైదరాబాద్ కు రాకుండా ఉండేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
ప్రపంచ కేంద్రంగా ఫోర్త్ సిటీని తీర్చి దిద్దుతాం అన్నారు. నెట్ జీరో సిటీ నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. మూసి పునర్జీవనం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి, దశాబ్ద కాలంగా కాలుష్య కాసారంతో ప్రజలు జీవించడానికి ఇబ్బంది పడుతున్నారు.. ఈ నదిలో పరిశుభ్రమైన నీరు పారించి.. మూసి హైదరాబాద్కు ఒక వరంలా మారుస్తాము, హైదరాబాదును అద్భుత నగరంగా తీర్చిదిద్దుదాం అన్నారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఖర్చు అయినా ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు దావోస్లో పర్యటించి 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారని వివరించారు. 2029-30 కి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త విద్యుత్ పాలసీలో స్పష్టం చేశామని, 35 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు తెలిపారు. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపించేందుకు కేవలం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాదు నగరానికి ఒక ఏడాదిలో పదివేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం హైదరాబాదును ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిందని తెలిపారు.