తెలంగాణలో  పెరిగిన పాస్ ఛార్జీలు... ఫ్రీబస్ ఎఫెక్టేనా....
x

తెలంగాణలో పెరిగిన పాస్ ఛార్జీలు... ఫ్రీబస్ ఎఫెక్టేనా....

గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది.


తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. బస్ పాస్ రేట్లను పెంచుతున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. కొత్త పాస్ తీసుకునే వారికి కొత్త రేట్లే వర్తించనున్నాయి. ఇవి జూన్ 9 నుంచే అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు. పాస్‌లపై ఇదివరకు ఉన్న ధరలను 20శాతానికి పైగా పెంచినట్లు తెలుస్తోంది. పెరిగిన ఛార్జీల ప్రకారం గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్, ఇప్పుడు రూ.1,800గా అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్టు అధికారిక సమాచారం. ఈ పెంపు వల్ల సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తప్పవు. వారిపై పాస్‌లు భారమయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి ఆర్‌టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. అప్పటికే కొద్దోకొప్పో నష్టాల్లోనే ఉన్నా లాక్కొస్తున్న ఆర్‌టీసీకి ఉచిత ప్రయాణ పథకం నెత్తిన పడిన పిడుగులా మారింది. ప్రతి నెలా భారీ మొత్తంలో ఖర్చు అవుతుండటంతో రేట్లను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. రేట్లు పెరిగిన నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులు తీవ్ర అసహనం, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేసి.. వాటికి నిధులు కావాలని మా నడ్లు ఎందుకు విరుస్తున్నారనంటూ ప్రజలు మండిపడుతున్నారు.

అయితే రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైన కొన్ని రోజులకే ఈ పథకంపై అనేక మంది నెగిటివ్‌గా స్పందించారు. వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. ఆర్టీసీ నిర్వహణఫై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రైవేటు బస్సుల కన్నా ఆర్టీసీ బస్సులు చవక, రక్షణ అన్న భావన ఉండేదని, కానీ ఇప్పుడు ఆర్టీసి బస్సును చూస్తే యమధర్మరాజు వాహనం వస్తున్నట్లు కనిపిస్తోందని విసుర్లు విసిరారు. టికెట్లు తీసుకున్నా నిలబడే వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. తమకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కావాలని ఏ మహిళా కోరలేదని, అడగని పథకం తీసుకున్ని అందరినీ ఆపసోపాలు పెడుతున్నారని బాధితులు విమర్శలు గుప్పిస్తారు. బస్సులు కూడా చాలా స్టాప్‌ల దగ్గర ఆగడం లేదని, ఒకవేళ ఆగిన కిక్కిరిసిన బస్సులో గేటు దగ్గరకు రావడం ఓ యుద్ధంలా ఉంటే.. అక్కడకు వచ్చేసరికి బస్సు తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తోందని బాధితులు అనేక మంది చెప్తున్నారు.

వికలాంగుల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. కిక్కిరిసన బస్సుల్లో అత్యంత సాహోసోపేతంగా ఎక్కినా.. కూర్చోవడానికి ఎక్కడా సీటు ఉండటం లేదని వికలాంగులు చెప్తున్నారు. ఉచిత బస్సు సరే మరి వికలాంగుల సంగతి ఏంటని ప్రభుత్వం ఆలోచించడం లేదని వికలాంగుల సంఘం మెదక్‌ జిల్లా ఉపాద్యక్షుడు గంగాపురం సంజీవులు అన్నారు. కాళ్లు, చేతులు లేని వారు, పక్షవాతం వచ్చిన వారు కూర్చొవడానికి కూడా సీట్లు ఉండటం లేదు. మహాలక్ష్మి పథకం నిజంగా ప్రయాణం చేసేవారికంటే కాలక్షేప ప్రయాణాలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. సర్కారు నిర్ణయమే పెద్ద తప్పు. తాము మహిళలకు వ్యతిరేకం కాదు. కానీ మహిళల పేరుతో ఉచిత బస్సు పథకం పెట్టి వృద్ధులు, వికలాంగులకు అన్యాయం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీట్లు దొరకకపోవడంతో నిలబడే ఓపిక లేక బ్రతిమిలాడి సీటు అడగాల్సిన దుస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు.

ఉచిత బస్సు పథకం తర్వాత వచ్చిన సమస్యలు..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసిన రోజుల వ్యవధిలోనే తీవ్రంగా కష్టాలను ఎదుర్కున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది ఆటో రిక్షా కార్మికులే. అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ పథకం వల్ల తమ ఆదాయం తీవ్రంగా పడిపోయిందని, కుటుంబాన్ని కూడా పోషించుకునే పరిస్థితి లేక చావే మార్గంగా ఎంచుకున్నామని సూసైడ్ నోట్స్ రాసి మరీ కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే సమయంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని కూడా ఆటో యూనియన్‌లు డిమాండ్ చేశాయి. నిరసనలు చేశాయి. లేనిపక్షంలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. తమకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వకపోగా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి కూడా ప్రభుత్వం గండి కొడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర రవాణా మార్గాలకు తగ్గిన ఆదాయం..

ఉచిత బస్సు ప్రయాణం ఎంట్రీ ఇవ్వడంతోనే మిగిలిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మార్గాల ఆదాయం గణనీయంగా తగ్గింది. మహిళలంతా కూడా బస్సు ప్రయాణికే ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ ప్రభావం మెట్రోపైన కూడా పడింది. అదే సమయంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ఆర్టీసీపైన కూడా పెనుభారంగా మారింది. అప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కాస్త ఈ పథకం అమలు తర్వాత పూర్తిగా నష్టాల్లో మునిగిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. బస్సు కండక్టర్లు, డ్రైవర్లపై కూడా పనిభారం పెరిగింది.

పథకం అమలుతో బస్సు ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ బస్సుల సంఖ్య మాత్రం అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా తగ్గింది. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టడంతో సరిపడా బస్సులు లేక మహిళలు సైతం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త బస్సులను కొనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నా.. మరోవైపు ఖాళీగా ఉన్న ఖజానా వారిని వెక్కిరిస్తోంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ కారణంగానే ఆర్టీసీ నిధులను పెంచడం కోసం ఇప్పుడు పాస్‌ల రేట్లు పెంచినట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

Read More
Next Story