మొంథా తుఫాన్ ప్రభావం: ధాన్యం మొక్కజొన్న పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలు
x

మొంథా తుఫాన్ ప్రభావం: ధాన్యం మొక్కజొన్న పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలు

సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల


మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణా రాష్ట్రంలోనూ పడే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

అందులో భాగంగా సోమవారం సాయంత్రం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం గురించి మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “మొంథా తుఫాన్ తో తెలంగాణాలోను అకాల వర్షల ప్రభావం చూపే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద దాని ప్రభావం పడకుండా చూసి ఎట్టి పరిస్థితుల్లో నూ రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుబాటులో ఉన్న టార్బాలిన్ లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాం చెడి పోకుండా చూడాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చెయ్యాలి. ఎందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలి.”

30 నుండి 45 రోజుల వరకు అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించగా ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని మరో 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

యిప్పటికి 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు. కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల పై నిరంతర పర్యవేక్షణ చేయాలని ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి చెప్పారు.

ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించద్దని వారిపైన చర్యలు కఠినంగా వుంటాయని. . ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలని చెప్పారు. ఇది రైతుపక్ష పాత ప్రభుత్వం ఏ కారణం చేతనైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదు, అని మంత్రి హెచ్చరించారు.

ఈ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల శాఖా డైరెక్టర్ హనుమంతు కొండుబా, డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ బాయి పాల్గొన్నారు.

Read More
Next Story