క్యాస్ట్ సర్టిఫికెట్‌ల జారీకి కొత్త విధానం..
x

క్యాస్ట్ సర్టిఫికెట్‌ల జారీకి కొత్త విధానం..

ప్రజలకు తప్పిన ఎదురుచూపుల ఇబ్బందులు.


కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఈ సర్టిఫికెట్‌లు అందుకోవడం కోసం ఇన్నాళ్లూ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలకడం కోసం ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ తరహాలో అమలు చేస్తోంది. ఇది విజయవంతం అయిందని భావించిన వెంటనే పాత పద్దతిని పూర్తిగా తొలగించిన ఈ కొత్త విధానాన్నే అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి.. క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సి ఉండేది. ఇప్పుడు ఈ కొత్త విధానంతో ఆ ఎదురుచూపులకు తెరపడుతుందని అధికారులు అంటున్నారు.

ఇప్పటి వరకు ఇలా..

ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతి ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందడం కోసం వారాల తరబడి వేచి చూడాలి. ముందుగా దరఖాస్తు చేసుకుని దానికి ఎమ్మెరో ఆమోదం కోసం ఎదురుచూడాలి. ఎమ్మార్వో అందుబాటులో లేకపోయినా, ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా ఇక అది వారాలు కొన్నికొన్ని సందర్భాల్లో నెలపైగా సమయం తీసుకుంటుంది. దీనిని గమనించిన ప్రభుత్వం.. ప్రజలకు ఈ జాప్యం సమస్యను దూరం చేయాలని భావించింది. ప్రజలకు తక్షణ సౌకర్యం కల్పిస్తూ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంతో కుల ధ్రువీకరణ పత్రాన్ని ఎవరైనా 15 రోజుల్లోగా పొందుతారు. ఇకపై బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు నేరుగా తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల నుంచే కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలరు.

సర్టిఫికెట్ జారీ విధానంపై మంత్రి ఫోకస్

కుల ధ్రువీకరణ పత్రాల జారీ అంశంపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దృష్టి పెట్టారు. మీ సేవ విభాగం, సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా పరిపాలనాధికారులు, తహసీల్దార్లుతో కలిసి పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు మంత్రి. ఈ సమావేశాల్లో సర్టిఫికెట్‌ల జారీకి ఆలస్యం జరుగుతున్న అంశాన్ని ప్రధానంగా చర్చించారు. అనంతరం కొత్త పద్ధతికి రూపం ఇవ్వబడింది. అధికారులు తెలిపిన ప్రకారం.. గత 15 రోజులలోనే 17,571 మంది పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని వెల్లడించారు.

కొత్త విధానంలో సర్టిఫికెట్ ఎలా పొందాలంటే..

  • మీ దగ్గర పాత కుల ధ్రువీకరణ పత్రం నెంబర్ ఉంటే, ఆ నెంబర్‌ను మీ సేవ కేంద్రంలో చెప్పగానే కొత్త ప్రింటవుట్‌ను వెంటనే పొందవచ్చు.
  • ఒకవేళ ఆ నెంబర్ గుర్తు లేకపోతే, మీ జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా సిబ్బంది రికార్డుల్లో శోధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.
  • మరిన్ని వివరాల కోసం అధికారిక మీ సేవ వెబ్‌సైట్ లేదా సమీపంలోని మీ సేవ కేంద్రంను సంప్రదించవచ్చు.
  • ఈ కొత్త విధానం వల్ల పౌరులు ఇక జాప్యం లేకుండా తక్షణమే తమ కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలుగుతున్నారు. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
Read More
Next Story