
హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేసిన టీజీపీఎస్సీ
న్యాయస్థానం తీర్పుపై కీలక సమావేశం.
గ్రూప్-1 మెయిన్స్ అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో విడుదల చేసిన మార్కులు, ర్యాంకులను రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇచ్చారు. కాగా ఈ తీర్పును ఛాలెంజ్ చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్కమిషన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ తీర్పుపై మంగళవారం కమిషన్ కీలక సమావేశం నిర్వహించిందని, ఇందులో తీర్పుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను చర్చించిందని తెలుస్తోంది. ఈ కమిషన్లోనే హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేయాలని, అవసరం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కమిషన్ డిసైడ్ అయినట్లు సమాచారం.
హైకోర్టు తీర్పు ఏంటంటే..
మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల లిస్ట్ను రద్దు చేసింది. అంతేకాకుండా పునఃమాల్యాంకనం చేయాలంటూ అధికారులకు ఆదేశించింది. సంజయ్ వర్సెస్ యూపీఏస్సీ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అంతేకాకుండా ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
అసలేంటీ వివాదం..
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనాల్లో భారీ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గించారని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ రాజేశ్వరరావు.. ‘‘తెలుగులో గ్రూప్-1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. మెయిన్స్ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి’’ అని టీజీపీఎస్సీని ఆదేశించారు.