TGSRTC లోగో రచ్చపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్
x

TGSRTC లోగో రచ్చపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)కి కొత్త లోగో గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోన్న వార్తలపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు.


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)కి కొత్త లోగో గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోన్న వార్తలపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇప్పటివరకు అధికారికంగా కొత్త లోగోను విడుదల చేయలేదని గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

చార్మినార్, కాకతీయ కళా తోరణాలతో కొత్తగా రూపొందించబడిన టీజీఎస్‌ఆర్‌టీసీ లోగో అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది. దీనిపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ స్పందిస్తూ... "టీజీఎస్‌ఆర్‌టీసీ కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు" అని సజ్జనార్ స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చారు. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలైన ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ ఎండిల ఖాతాల పేర్లను కూడా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలోనే పాత లోగోని కూడా మార్చారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Read More
Next Story