
రెడ్ల ఆధిపత్యానికి అధిష్ఠానం బ్రేక్ ?
రేవంత్(Revanth) ఎంత పట్టుబట్టినా కోరుకున్న రెడ్డి ఎంఎల్ఏలను మంత్రులుగా తీసుకోలేకపోయారు
ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పదవుల నియామకాల్లో ఒక అంశం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రభుత్వంలో రెడ్ల ఆధిపత్యానికి పార్టీ అధిష్ఠానం బ్రేక్ వేసినట్లు. మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వలేదన్న విషయం కన్నా హోలు మొత్తంమీద రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించటమే లక్ష్యంగా అధిష్ఠానం పావులు కదిపినట్లు అర్ధమవుతోంది. ఈకారణంగానే రేవంత్(Revanth) ఎంత పట్టుబట్టినా కోరుకున్న రెడ్డి ఎంఎల్ఏలను మంత్రులుగా తీసుకోలేకపోయారు. మామూలుగా ఏప్రభుత్వంలో అయినా రెడ్లు కీలకపాత్ర పోషిస్తారన్న విషయం తెలిసిందే. జనాభా దామాషాతో సంబంధంలేకుండా ఎంఎల్ఏ టికెట్లు పొందటంలో, గెలిచిన తర్వాత మంత్రివర్గంలో రెడ్లకు మంచి ప్రాధాన్యత దక్కుతోంది. సమైక్య రాష్ట్రాన్ని పక్కనపెట్టి తెలంగాణలో కేసీఆర్(KCR) మంత్రివర్గంలో తీసుకున్నా ఈవిషయం స్పష్టంగ కనబడుతుంది. కేసీఆర్ మంత్రివర్గంలో 6 మంది రెడ్లు మంత్రులుగా పనిచేశారు.
2014-23 మధ్యకాలంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో నాయిని నర్సింహారెడ్డి, గుంటకళ్ళ జగదీశ్వరరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చర్లకోల లక్ష్మారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా పనిచేశారు. పోచారంను మంత్రిపదవినుండి తప్పించినా కీలకమైన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. 18 మంది ఉండే క్యాబినెట్లో కేసీఆర్ కూడా ఆరుమంది రెడ్లకు అవకాశం ఇచ్చారంటేనే రెడ్ల హవా ఏ స్ధాయిలో నడిచిందో అర్ధంచేసుకోవచ్చు. తాను లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదని అనుకునే కేసీఆర్ కూడా ఆరుగురు రెడ్లను మంత్రులుగా తీసుకున్నారు. అలాంటిది ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్లసంఖ్య రేవంత్ తో కలుపుకుని నాలుగుకు మాత్రమే పరిమితమైందంటే అర్ధమేంటి ? ఉద్దేశ్యపూర్వకంగానే అధిష్ఠానం రెడ్ల ఆధిపత్యానికి బ్రేకులు వేసినట్లు అర్ధమవుతోంది.
తాజా విస్తరణలో రేవంత్ మార్క్ కన్నా అధిష్ఠానం ఛాయిసే ఎక్కువగా కనబడుతోంది. విస్తరణలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంఎల్ఏ సుదర్శనరెడ్డి కోసం రేవంత్ చాలా పట్టుబట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే అధిష్ఠానం మాత్రం రేవంత్ ఒత్తిడికి తలొంచలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఒత్తిడికి తలొంచకపోగా ఎస్సీల్లో ఇద్దరిని(మాల+మాదిగ)తో పాటు బీసీ(ముదిరాజ్)ను తీసుకోవాలని స్పష్టంగ చెప్పినట్లు తెలుస్తోంది. విస్తరణలో ఎవరిని తీసుకోవాలో కూడా రేవంత్ కు అధిష్ఠానమే సూచించినట్లు తెలిసింది. ఒకవిధంగా చెప్పాలంటే తాజా విస్తరణపై రేవంత్ ముద్రకన్నా అధిష్ఠానం ముద్రే ఎక్కువగా ఉంది. అందుకనే విస్తరణ సందర్భంగా రేవంత్ మొహంలో సంతోషం కన్నా నిరాసక్తతే ఎక్కువగా కనబడింది.
స్ధానికమే కీలకమా ?
అధిష్ఠానం ఆలోచనల ప్రకారం రెండు అంశాలు కీలకంగా అర్ధమవుతోంది. అవేమిటంటే ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా రెడ్ల ఆధిపత్యాన్ని వీలైనంతగా తగ్గించటం. రెండోది ఏమిటంటే తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీగెలుపు లక్ష్యంగా వీలైనంతలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు పెద్దపీట వేయటం. మంత్రివర్గంలో రెడ్లు నలుగురుంటే ఎస్సీల్లో స్పీకర్ తో కలుపుకుని ఐదుగురు, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరున్నారు. తాజాగా ప్రకటించిన పార్టీపదవుల్లో కూడా బడుగు, బలహీనవర్గాలకే అధిక ప్రధాన్యత దక్కటం ఇందులో భాగమనే అనుకోవాలి. పీసీసీకి 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధన కార్యదర్శులను అధిష్ఠానం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షుల్లో 8 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలకు చోటు దక్కింది. అంటే 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలే 15 మందున్నారు. అలాగే 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో 26 మంది బీసీలు, ఎస్సీలు తొమ్మిదిమంది, ఎస్టీనేతలు నలుగురికి అవకాశం దక్కింది. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలే 39 మంది ఉన్నారు.
జిల్లాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలతో తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) అనేకసార్లు చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు ప్రాధాతన్య ఇవ్వటంతో పాటు సీనియరిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని మీనాక్షి అగ్రనేతలకు రిపోర్టు ఇచ్చినట్లు పార్టీవర్గాల టాక్. చూడబోతే రేవంత్ సిఫారసుల కన్నా మీనాక్షి రిపోర్టునే అధిష్ఠానం పరిగణలోకి తీసుకున్నట్లు కనబడుతోంది. స్ధానికసంస్ధల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న అధిష్ఠానం బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
బీసీలకు పెద్దపీఠ
బీఆర్ఎస్, బీజేపీల్లో సామాజికవర్గాల సమతూకం లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీఠ వేసేంత సీన్ లేదని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకుంటోంది. అందుకనే ఆ పనేదో తానే చేస్తే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాకపోయినా పై వర్గాలకు సర్దిచెప్పుకోవచ్చన్నది అధిష్ఠానం ఆలోచనగా కనబడుతోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో ఒక బీసీకి, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో ఎక్కువమంది బీసీ, ఎస్సీలను నియమించింది. ఏదేమైనా ప్రభుత్వంతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రెడ్ల ఆధిపత్యానికి అధిష్ఠానం బ్రేకులు వేసినట్లు అర్ధమైపోతోంది. నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాతో పాటు పోల్చితే రెడ్డి సామాజికవర్గం జనాభా తక్కువే.
జనాభాలో తక్కువే అయినా రాజకీయంగా మాత్రం రెడ్లు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఈమధ్య రేవంత్ పదేపదే రెడ్ల ఆధిపత్యం గురించి మాట్లాడటాన్ని అధిష్ఠానం సహించలేకపోయినట్లు సమాచారం. ఏపార్టీ అధిష్ఠానమైనా తమచెప్పుచేతల్లో ఉండే నాయకులను, నాయకత్వాన్నే ఇష్టపడుతుంది. అధిష్ఠానంతో సంబంధంలేకుండా తమిష్టం వచ్చినట్లు చేసుకునిపోయే నేతల పోకడలను ఎక్కువ కాలం సహించదు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) రూపంలో అధిష్ఠానికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇపుడు రేవంత్ కూడా వైఎస్సార్ స్టైల్లోనే నడుస్తున్నారనే అనుమానం అధిష్ఠానంలో మొదలైనట్లు అనుమానంగా ఉంది. గెలిచిన 64 మంది ఎంఎల్ఏల్లో సుమారు 43 మంది ముఖ్యమంత్రిగా రేవంత్ కే ఓట్లేశారు. అప్పట్లో అనివార్య పరిస్ధితుల్లో రేవంత్ ను అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపికచేసినా రానురాను రేవంత్ లో రెడ్డి ఆధిపత్యం పెరిగిపోతున్నట్లు గుర్తించినట్లుంది. అందుకనే కట్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే మంత్రివర్గంతో పాటు పార్టీలో రెడ్ల ప్రాధాన్యతను తగ్గించేసింది. భవిష్యత్తుల్లో దీని ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.