‘మావోలతో చర్చలా.. అది జరగదు’
x

‘మావోలతో చర్చలా.. అది జరగదు’

మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్ అని చెప్పారు.


కర్రెగుట్టను కారుమబ్బుల్లా భద్రతా బలగాలు కమ్మేశాయి. మావోలను అంతమొందించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఏమాత్రం సమాచారం అందినా.. భారీ సంఖ్యలో బలగాలు చుట్టుముట్టేస్తున్నాయి. మావోలను మట్టుబెట్టేస్తున్నాయి. దీంతో కర్రెగుట్టలో భద్రతా బలగాలు చేస్తున్న ఆపరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మావోలు కోరుతూ ఓ లేఖను కూడా విడుదల చేరశారు. ఈ విషయంలో హైకమాండ్‌తో చర్చిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సహా మరికొందరు కూడా శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించారు. కాగా తాజాగా ఈ చర్చలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. మావోయిస్ట్‌లో చర్చగిర్చల్లాంటివి ఏమీ ఉండవని చెప్పారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కొత్తపల్లిలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు’’ అని తేల్చి చెప్పారు.

‘‘కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం’’ అని అన్నారు.

‘‘రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు. నక్సల్స్ తో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్’’ అని తెగేసి చెప్పారు.

Read More
Next Story