
‘ఈ-కార్ కేస్లో స్కాం లేదు..మన్నూ లేదు’
ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు.
ప్రభుత్వం గుండెలు బాదుకుంటున్న పార్ములా ఈ-కార్ రేస్ కేసులో స్కాం ఏమీ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలేనన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏసీబీ.. కాంగ్రెస్ సర్కార్కు తన నివేదికను అందించింది. ఈ నేపథ్యంలోనే ఈ స్కాంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ కేసే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందంతా కూడా ఒక లొట్టపిట్ట కేసన్నారు. ఈ-కార్ రేసులో స్కాం జరగలేదు కాబట్టే వాళ్లకి నిరూపించడానికి ఇంత సమయం తీసుకొంటున్నారని, సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. “దూద్ కా దూద్, పానీ కా పానీ అవ్వాలి” అని, ఇందులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. “స్కాం లేదు, మన్నూ లేదు” అని ఆయన అన్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా సిద్ధమని సవాల్ విసిరారు.
అసలు మోసాలు చేసింది కాంగ్రెస్
‘‘బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలకు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. అశోక్నగర్ వేదికగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దానిని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్లో 500 పోస్టులు ఉంటే వాటికి 60 పోస్ట్లను కలిపి కాంగ్రెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ఆ పరీక్షనే రద్దు చేశాం. కానీ కాంగ్రెస్ అలా చేయలేదు. పరీక్షను హడావిడిగా పెట్టేసింది. ఇందులో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. వాళ్లకి కోర్టు నుంచి శుభవార్త వచ్చింది. రీ-వాల్యుయేషన్ జరిగినా న్యాయం జరగదు. మళ్లీ పరీక్ష నిర్వహించాలి. నిజం నిగ్గు తేల్చడానికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.