బలిపశువులవుతున్న తెలంగాణ పోలీసులు, ఉద్యోగులు..
x

బలిపశువులవుతున్న తెలంగాణ పోలీసులు, ఉద్యోగులు..

ప్రభుత్వ ఉద్యోగులు వ్యవస్థకు విరుద్ధంగా పనిచేస్తే ఎలాంటి పరిస్థితిని ఎదురుకోవాల్సి వస్తుందో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అవగతమవుతుంది.


తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం సంపాదించాలంటే నిద్రహారాలు మాని పుస్తకాలతో కుస్తీ పట్టాలి. నెలల తరబడి కోచింగ్ తీసుకోవాలి. లైబ్రరీల్లో గంటలుగంటలు పుస్తకాలతో శ్రమించాలి. ఇంత కష్టపడినా ఒక్కోసారి కొలువు దక్కుతుందో లేదో.. ఇంత ప్రయాస పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే.. ప్రజాప్రతినిదులకు ఊడిగం చెయ్యల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఇక కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే మూడు దశల్లో అర్హతలు సాధించాలి. ఓ ఎస్ఐ ఉద్యోగం పొందాలంటే మూడు దశల్లో కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి.. ఓ గ్రూప్ -1, గ్రూప్ -2 స్థాయి ఉద్యోగాలు దక్కించుకోవాలంటే అహోరాత్రులు శ్రమించాలి.

కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే.. చివరికి పోస్టింగ్ కోసం ప్రజా ప్రతినిధుల రికమండేషన్.. కోరుకున్నచోట పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేకో, ఎంపీకో డొనేషన్.. తీరా పోస్టింగ్ దక్కించుకున్న తర్వాత.. ఇచ్చిన డబ్బులను మళ్లీ సంపాదించుకునేందుకు జనం మీద పడటం.. ఇదే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుతం పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు బలవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ భాద్యతలు విస్మరించి ప్రజాప్రతినిధులకు ఊడిగం చేస్తే.. వ్యవస్థకు విరుద్ధంగా పనిచేస్తే ఎలాంటి పరిస్థితిని ఎదురుకోవాల్సి వస్తుందో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అవగతమవుతుంది.

గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకి ఒక జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం వుంది. కలెక్టర్ గా విధుల్లో వున్నప్పుడే, ఏకంగా ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి చర్చనీయాంశంగా మారాడు. ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న పార్లమెట్ పరిధిలోని 106 మంది ఉద్యోగులతో రహస్యంగా సమావేశం నిర్వహించి, తన గెలుపునకు ఏవిధంగా పనిచెయ్యాలోనని తన ప్లాన్ వివరించాడు. ఈ విషయం కాస్త ఎన్నికల కమీషన్ దృష్టికి వెళ్ళడం, వారిని సస్పెండ్ చెయ్యడం జరిగిపోయింది.

ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అప్పట్లో ప్రజాభవన్ ఎదుట రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. మద్యం మత్తులో ఖరీదైన వాహనంలో విపరీతమైన వేగంతో దూసుకు వస్తూ ప్రజాభవన్ ఎదుట డివైడర్ ను ఢీ కొట్టాడు. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు అతడిని తప్పించేందుకు.. చిత్ర విచిత్రమైన ప్రణాళికలు అమలు చేశారు. రహీల్ ను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే రహీల్ ను వేరే కారులో పంపించారు. సంఘటన స్థలానికి రహీల్ డ్రైవర్ ను రప్పించారు. అతడే ప్రమాదం చేసినట్టు చిత్రీకరించారు.

సీసీ కెమెరా ఫుటేజ్ లో షకీల్ కుమారుడే ప్రమాదానికి కారణమని తెలియడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం విడిచి వెళ్లిపోయాడు. అతడిని కాపాడేందుకు 15 మంది పోలీసులు తెరవెనక ప్రయత్నం చేశారు. ఇద్దరు సీఐలతో పాటు 13 మంది తాము ఖాకీ ఉద్యోగం చేస్తున్నామని మర్చిపోయి మాజీ ఎమ్మెల్యే కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నం చేసి, చివరికి దొరికిపోయి జైలుకు వెళ్ళక తప్పలేదు.

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ శాఖనే కుదుపివేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారని అభియోగాలు ఎదుర్కొంటూ కీలక పోలీస్ అధికారులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఉన్నత అధికారులుగా ప్రజల మన్ననలు పొందాల్సిన వారు.. ఖైదీలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ ఉదంతాలను బట్టి అర్ధమవ్వుతున్న విషయం ఏమిటంటే.. అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ప్రభుత్వ పెద్దలకు సాగిల పడితే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తే సరిపోతుంది. అంతేగాని ప్రజాప్రతినిధులకు సాగిలపడితే.. ఇదిగో ఇలానే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి.

Read More
Next Story