తెలంగాణపై మోడీ వివక్షకు ఇదే ఉదాహరణా ?
x
Mamanuru airport and Modi

తెలంగాణపై మోడీ వివక్షకు ఇదే ఉదాహరణా ?

నాన్ బీజేపీ పాలితరాష్ట్రాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాల రాష్ట్రాల విషయంలో మోదీ(Narendra Modi) ఉండటంలేదన్నది ప్రధాన ఆరోపణ


తెలంగాణ విషయంలో నరేంద్రమోదీ వివక్ష చూపుతున్నారనే ఆరోపణలకు కొదవలేదు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వటంలో, నిధులు కేటాయించటంలో బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో ఉన్నంత ఉదారంగా నాన్ బీజేపీ పాలితరాష్ట్రాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాల రాష్ట్రాల విషయంలో మోదీ(Narendra Modi) ఉండటంలేదన్నది ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ ఔటర్ పరిధిలో ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్మించదలచుకున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కావాలని అడిగితే కేంద్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణకు అవసరమైన నిధులు కావాలని ప్రతిపాదనలు పంపితే సానుకూలంగా స్పందించలేదు. మూసీనది సుందీరకరణకు నిధులు కావాలంటే కేంద్రం పట్టించుకోలేదని స్వయంగా రేవంతే చెప్పారు.

ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణ అభివృద్ధి విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారనేందుకు తాజాగా మరో ఉదాహరణ కనబడుతోంది. అదేమిటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామనూరు విమానాశ్రయం ఏర్పాటుకు నిధులు కావాలని కేంద్రాన్ని రేవంత్ అడిగితే సాధ్యంకాదని తేల్చిచెప్పేసింది. ఇదేసమయంలో ఏపీలోని తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ నిధులను మంజూరుచేసింది. ఈ విషయాన్ని తాడేపల్లిగూడెం జనసేన ఎంఎల్ఏ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. భూసేకరణకు అవసరమైన నిధులు మొత్తాన్ని కేంద్రం మంజూరుచేసినట్లు బొలిశెట్టి తెలిపారు. మామనూరు విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు నిధులు ఇవ్వటం సాధ్యంకాదని తేల్చిచెప్పిన కేంద్రప్రభుత్వం తాడేపల్లిగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు మాత్రం నిధులు మంజూరుచేయటం కుదరదని చెప్పటంలోనే మోదీ వివక్ష స్పష్టంగా కనబడుతోంది.

తెలంగాణ(Telangana) మొత్తంమీద పౌరవిమానాల రాకపోకలకు ఉన్నది శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే. బేగంపేటలో మరో విమానాశ్రయంఉన్నా పౌరవిమానాల రాకపోకలు ఎప్పుడో నిలిచిపోయాయి. ఎప్పుడైనా ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి అత్యంత ప్రముఖులు వచ్చినపుడు మాత్రమే బేగంపేటలో విమానాలు దిగుతున్నాయి. ఈనేపధ్యంలోనే మరికొన్ని విమానాశ్రయాలను రెడీచేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే 45 ఏళ్ళక్రితమే మూతపడిన వరంగల్(Warangal) జిల్లాలోని మామనూరు విమానాశ్రయాన్ని మరమత్తులు చేయించి, ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా విస్తరిస్తే దేశీయ విమానాలు ఇక్కడ దిగటానికి అన్నీ విధాలుగా అనువుగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అనుకున్నది. ఈ ఎయిర్ పోర్టును పున: ప్రారంభించాలంటే 949 ఎకరాలు అవసరం. ఎందుకంటే భవనాల నిర్మాణంతో పాటు పెద్ద రన్ వేను కూడా ఏర్పాటుచేయాలి. అందుకనే 949 ఎకరాలు అవసరమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసింది.

ఇపుడు విమానాశ్రయం ఆధీనంలో 696 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరో 300 ఎకరాలను సేకరిస్తే సరిపోతుంది. అవసరమైన 300 ఎకరాల్లో కూడా విమానాశ్రయం చుట్టూ సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూముంది. ప్రభుత్వ భూమిని పక్కనపెట్టేస్తే 220 ఎకరాల వ్యవసాయ భూములు, 33 ఎకరాల ప్రైవేటు భూములున్నాయి. ఈ ప్రైవేటు భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసున్నారు. భూసేకరణకు అవసరమైన నిధులు మంజూరుచేయాలని రేవంత్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై కేంద్రప్రభుత్వం మెలికపెట్టింది. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అవసరమైన 300 ఎకరాలనూ రాష్ట్రప్రభుత్వమే సొంతంగా సేకరించుకోవాలని స్పష్టంగా చెప్పేసింది. దీంతో భూసేకరణకు అవసరమైన నిధుల్లో రు. 205 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే సిద్ధంచేసుకున్నది.

అయితే 220 ఎకరాల వ్యవసాయ భూసేకరణకు 309 మంది రైతులతోను, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని 61,134 గజాల కమర్షియల్ భూమికి సంబంధించి 50 మందికి పరిహరం చెల్లించాలి. రైతులు, కమర్షియల్ ప్లాట్లున్న వాళ్ళు భూమిని ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నా తాము అడిగినంత పరిహారం ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు. వాళ్ళడిగిన పరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వం సిద్ధంచేసుకున్న రు. 205 కోట్లకు అదనంగా రు. 200 కోట్లు అవసరం. అదనంగా అవసరమైన రు. 200 కోట్లన్నా ఇవ్వాలని కేంద్రాన్ని రేవంత్ ప్రభుత్వం అడిగితే సాధ్యంకాదు పొమ్మన్నది.

ఏపీ విషయంలో ఇలా

ఇక ఏపీలోని తాడేపల్లిగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ నిధులు మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది. ఏపీలో ఇప్పటికే ఏడు విమానాశ్రయాలున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఇవికాకుండా దేశీయ విమానాల రాకపోకలకు కర్నూలు, కడప, పుట్టపర్తి, రాజమండ్రి విమానాశ్రయాలున్నాయి. ఉడాన్ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో గ్రీన్ పీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాకుండా ఉంగుటూరు మండలంలో సేకరించాల్సిన 1,123 ఎకరాల భూమికి పరిహారంగా రు. 1,570 కోట్లను మంజూరు కూడా చేసింది. ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటులో భూసేకరణకు అవసరమైన నిధులను మంజూరుచేసిన మోదీ ప్రభుత్వం తెలంగాణలో మామనూరు విమానాశ్రయం భూసేకరణ విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపుతోందో అర్ధంకావటంలేదు.

మామనూరు విమానాశ్రయం కోసం ప్రభుత్వం అడిగిన రు. 200 కోట్లు ఇవ్వటం సాధ్యంకాదని చెప్పిన కేంద్రం తాడేపల్లిగూడెం విమానాశ్రయం భూసేకరణకు మాత్రం రు. 1570 కోట్లను ఏ పద్దతిలో మంజూరుచేసిందో అర్ధంకావటంలేదు. తాడేపల్లిగూడెంలో మాత్రమే కాదు వినుకొండ, దగదర్తి, ఓర్వకల్లు, కూప్పంతో పాటు భోగాపురంలో నిర్మించాలని అనుకుంటున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో కూడా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

రామ్మోహన్ పాత్ర ఎంత ?

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు(Kinjarapu) రామ్మోహన్ నాయుడున్నారు. ఏపీలోని శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన కింజరాపు కేంద్రంలో మంత్రిగా ఉండటం ఏపీకి బాగా కలిసొస్తున్నట్లుంది. ఏపీకి అవసరమైన నిధులను తన శాఖ ద్వారా కేటాయించుకుంటున్నందుకు ఎలాంటి అభ్యంతరంలేదు. కాకపోతే తెలంగాణ అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతుండటమే సమస్యగా మారింది. తెలంగాణ నుండి కేంద్రమంత్రులుగా ఉన్న బీజేపీ ఎంపీలు జీ కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) మరి ఏమిచేస్తున్నారో అర్ధంకావటంలేదు. మామనూరు విమానాశ్రయం ఏర్పాటుతో పాటు నిజామాబాద్, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు మద్దతుగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదేపదే కోరుతున్నది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story