
ఈ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయల్సిందే
ఎంత ఫీజలైనా సరే అప్పులు చేసి మరీ పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళల్లో తల్లి, దండ్రులు చేర్పిస్తున్నారు
పిల్లలకు అయినా, తల్లి, దండ్రులకు అయినా చదువు అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రైవేటు స్కూళ్ళు లేదా కార్పొరేట్ స్కూళ్ళు మాత్రమే. ఎంత ఫీజలైనా సరే అప్పులు చేసి మరీ పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళల్లో తల్లి, దండ్రులు చేర్పిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలు చదువుతున్నారని చెప్పుకోవటం తల్లి, దండ్రులకు ప్రిస్టేజిగా మారిపోయింది. అందుకనే పిల్లల చదువులు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ ధాటికి తట్టుకోలేక చాలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలో కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ళని అధిగమించి క్రేజు సంపాదించుకున్న ప్రభుత్వ స్కూలు ఒకటుందంటే ఎవరైనా నమ్ముతారా ?
ఈప్రభుత్వ స్కూలులో చేరటానికి పిల్లలు, చేర్చటానికి తల్లి, దండ్రులు ఎంతో గొప్పగా ఫీలవుతారని చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. నమ్మలేని నిజంలాంటిదే సిద్ధిపేట(Siddhipet)లోని ఇందిరానగర్ లో ఉన్న ‘పీఎంశ్రీ నాట్కో జిల్లా పరిషత్ హై స్కూల్’. ఈ స్కూలులో చేరటానికి విద్యార్ధులు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే తప్ప నేరుగా అడ్మిషన్ తీసుకునేందుకు లేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. విషయం ఏమిటంటే సిద్దిపేటలో పీఎంశ్రీ నాట్కో జిల్లా పరిషత్ హై స్కూలుంది. ఇందులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉంది. 7-10 తరగతుల్లో ఎవరైనా చేరాలంటే అప్పటికే చదువుతున్న విద్యార్ధులు ఏ కారణం వల్లయినా మధ్యలో స్కూలునుండి వెళ్ళిపోతే ఆ సీటులో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. అదే 6వ తరగతిలో చేరాలంటే మాత్రం కష్టమే.
ఎందుకంటే 6వ తరగతిలో చేరిన పిల్లలు ఎలాగూ 10వ తరగతి వరకు కంటిన్యు అవుతారు. అందుకని 6వ తరగతిలో పిల్లలు చేరాలంటే చాలా కష్టమనే చెప్పాలి. 6వ తరగతిలో నాలుగుసెక్షన్లలో కలిపి 180 సీట్లున్నాయి. ఇందులో బయట ప్రభుత్వ స్కూళ్ళల్లో 5వ తరగతి వరకు చదివిన పిల్లలు సిద్ధిపేట ఇందిరానగర్ స్కూల్లో చేరాలంటే ప్రయారిటి ఇచ్చి చేర్చుకుంటారు. అదే కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ళ నుండి వచ్చి ఇందులో చేరాలంటే మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే తప్ప వేరేదారిలేదు. 180 సీట్లలో సుమారు 100కి పైగా సీట్లలో ప్రభుత్వ స్కూళ్ళల్లో 5వ తరగతి చదివిన పిల్లలే చేరుతారు. ఏకారణం వల్ల ఎవరైనా సిద్ధిపేటకు వచ్చి పిల్లలను స్కూల్లో చేర్చాలంటే వాళ్ళకు ముందుగా కనబడేది పీఎంశ్రీ నాట్కో జిల్లా పరిషత్ స్కూలు మాత్రమే.
పట్టణంలోని జనాల్లో ఈస్కూలంటే అంత క్రేజుంది మరి. పట్టణంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు ఈప్రభుత్వ స్కూలుముందు ఎందుకు పనికిరావని జనాలు గట్టిగా చెబుతారు. తాజాగా ముగిసిన అడ్మిషన్లలో కూడా ఇదే జరిగింది. 6వ తరగతిలో ఉన్న అవకాశం ఉన్న 60 సీట్లలో చేరటానికి ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయంటేనే ఈ స్కూలుకున్న డిమండ్ ఏమిటో అర్ధమైపోతోంది. వచ్చిన దరఖాస్తులను వడపోసి అందులో నుండి 350 దరఖాస్తులను ఎంపికచేసిన స్కూలు యాజమాన్యం ఎంట్రన్స్ టెస్టు నిర్వహించి 60 మందిని ఎంపికచేసి అడ్మిషన్ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో 60 సీట్లు మాత్రమే ఖాళీ వుండటంతో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ స్కూలులో అడ్మిషన్ కోసమని ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల పేషీలు, ఎంఎల్ఏలు, పట్టణంలోని ప్రముఖులతో కూడా తల్లి, దండ్రులు చెప్పించుకుంటారు. అయితే ఎవరెంత స్ధాయిలో ఒత్తిడిపెట్టినా ఈస్కూల్లో 6వ తరగతిలో చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు రాయాల్సిందే, ర్యాంకు తెచ్చుకుని మిగిలిన వాళ్ళకన్నా మిన్న అని నిరూపించుకుంటే కాని సీటు దొరకదు.
ఈస్కూలుకే ఎందుకింత డిమాండ్ ?
ఈస్కూలులో అన్నీతరగతుల్లో కలుపుకుని 1220 మంది పిల్లలు చదువుతున్నారు. ఈస్కూలు ఎందుకింత పాపులర్ అయ్యింది, ఇందులో చదువుకోవటం ఎందుకు ప్రిస్టేజిగా మారింది ? ఎందుకంటే స్కూలు హెడ్ మాస్టర్, టీచర్లు క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చదువు, ఆట, పాటలు తదితరాలకు కూడా అంతే ప్రాధాన్యతిస్తారు. చదువును మొక్కుబడిగా కాకుండా పిల్లల మనసులకు హత్తుకునేలా టీచర్లు పాఠాలు చెబుతారు. పాఠం అర్ధంకాలేదని పిల్లల్లో ఎవరైనా చెబితే ఒకటి రెండుసార్లు అర్ధమయ్యేట్లుగా వివరిస్తారు. దీనివల్ల ఏమవుతోందంటే పిల్లలకు పాఠాలు వినటమే రివిజన్ లాగ అయిపోయింది. మామూలుగా ప్రభుత్వ స్కూలంటే వసతులు లేకుండా చివరకు కనీససౌకర్యాలకు కూడా నోచుకోకుండా ఉంటాయి. కాని ఈస్కూలుకు మాత్రం అలాంటి సమస్యలు ఏమీలేవు.
బీఆర్ఎస్(BRS) హయాంలో ఇక్కడ ఎంఎల్ఏ, మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు(Harish Rao) ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాట్కో ఫార్మా కంపెనీతో మాట్లాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సుబులిటి(సీఎస్ఆర్) పద్దతిలో టైఅప్ చేయించారు. ఇంకేముంది రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా నిధులు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేట్ కంపెనీ తలచుకుంటే సౌకర్యాలు, వసతులు పరుగెత్తుకుని రావా. సీఎస్ఆర్ పద్దతిలో నాట్కో కంపెనీ స్కూలులో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, మంచినీటి సౌకర్యాలు, బాత్ రూములు, తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, బల్లలు అదీ ఇది అని కాకుండా సమస్త ఏర్పాట్లు, సౌకర్యాలను రు. 2 కోట్లతో ఏర్పాటుచేసింది. దాంతో టీచర్లు శ్రద్ధగా చదువుచెబుతుంటే పిల్లలు బుద్ధిగా నేర్చుకుంటున్నారు. దీంతో స్కూలు ఆటలు, పాటల్లోనే కాదు చదువులో కూడా సంవత్సరాల తరబడి నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఈస్కూలు గురించి తెలుసుకోవటంతోనే తల్లి, దండ్రులు తమ పిల్లలను ఇక్కడే చదివించాలని గట్టిగా పట్టుబడుతున్నారు.
98శాతం ఉత్తీర్ణత
హెడ్ మాస్టర్ ఎ. రాజా ప్రభాకరరెడ్డి ‘తెలంగాణ ఫెడరల్’ తో పాఠశాల ఎందుకు విజయవంతమయిందో వివరించారు.
"2023-24 పదవ తరగతి పరీక్షల్లో మా స్కూలు 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. అలాగే 204-25 పరీక్షల్లో 96 శాతం ఉత్తీర్ణత సాధించింది. సిద్ధిపేట నియోజకవర్గంలో 70 ప్రభుత్వ హైస్కూళ్ళున్నామా స్కూలే నెంబర్ 1గా నిలుస్తున్నది.పట్టణంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు సుమారుగా 50 ఉన్నామా స్కూలులో 6వ తరగతిలో అడ్మిషన్ కోసమే తల్లి, దండ్రులు ప్రయారిటి ఇస్తారు," అని తెలిపారు.
పాఠశాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా తరగతి గదులు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
"డిమాండ్ కు తగ్గట్టు అదనపు సెక్షన్లు పెంచాలంటే గదులు అదనంగా కట్టాలి. టీచర్లను నియమించుకోవాల్సుంటుంది. ఇవి మాచేతిలో లేని విషయాలు. దీనివల్ల అడ్మిషన్లను పరిమితంగా మాత్రమే తీసుకుంటున్నాం," అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఇపుడు తమ స్కూలులో 40 మంది టీచర్లు ఉన్నట్లు చెబుతూ అందరు పిల్లలకు ఒకటికి రెండుసార్లు అర్ధమయ్యేట్లుగా పాఠాలు చెప్పటం తమ పాఠశాల ప్రత్యేక అని ఆయన అన్నారు.
"10వ తరగతి పరీక్షలకు అక్టోబర్ నుండి రెగ్యులర్ క్లాసులు అయిపోయిన తర్వాత టీచర్లు అదనపు క్లాసులు తీసుకుంటారు. పిల్లలు బాగా చదివి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలన్న తపన టీచర్లలోను, మంచి మార్కులు తెచ్చుకోవాలన్న పట్టుదల పిల్లల్లో కూడా ఉంది,ష అని ఆయన అన్నారు.
2023-24 10వ తరగతి పరీక్షలను 239 మంది రాస్తే 237 మంది పాసైనట్లు ఆయన చెప్పారు. అలాగే 2024-25 పరీక్షలు రాసిన 231 మందిలో 5 మందికి 10కి 10 మార్కులు వచ్చాయని 70 మందికి 500కి పైగా మార్కులు, 50 మందికి 550 మార్కు వచ్చాయని హెడ్ మాస్టర్ చెప్పారు.
గడచిన రెండు సంవత్సరాల్లో 49 మందికి బాసర(Basara) ‘ట్రిపుల్ ఐటీ’లో అడ్మిషన్లు సాధించినట్లు హెడ్ మాస్టర్ చెప్పారు. "పోయిన ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా మొత్తంమీద అత్యధిక మార్కులు తెచ్చుకున్న 10 మంది విద్యార్ధుల్లో మా స్కూలు విద్యార్ధులే ఐదుమంది ఉన్నారు," అని చెప్పారు. హరీష్ రావు మంత్రిగా ఉన్నపుడు చూపించిన ప్రత్యేక శ్రద్ధవల్లే ఈ స్కూలుకు అనేక సౌకర్యాలు అమరి నట్లు రాజా ప్రభాకరరెడ్డి చెప్పారు.