రేవంత్ కు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్ధుల విన్నపం
x
revanth reddy

రేవంత్ కు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్ధుల విన్నపం

తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమీషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్ధులు రేవంత్ రెడ్డికి ఒక విన్నపంచేసుకున్నారు.


తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమీషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్ధులు రేవంత్ రెడ్డికి ఒక విన్నపంచేసుకున్నారు. అదేమిటంటే మెయిన్స్ పరీక్షల్లో పాస్ అవబోయే అభ్యర్ధుల నిష్పత్తిని పెంచాలని. ఈ మేరకు రేవంత్ కు గ్రూప్ 1 రాసిన అభ్యర్ధులు లేఖ కూడా రాశారు. అందులో ఏముందుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రోజు ఉదయమే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు రేవంత్ కు ధన్యవాదాలు చెప్పారు.

ముచ్చటగా మూడోసారి గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు అభ్యర్ధులు చెప్పారు. మొదటి రెండుసార్లు బాగా రాసిన వాళ్ళలో కొందరు అనేక కారణాల వల్ల మూడోసారి సరిగా రాయలేదట. అలాగే మొదటిరెండుసార్లు సరిగా రాయనివాళ్ళు మూడోసారికి బాగా ప్రిపేరై ప్రిలిమ్స్ పరీక్షను బాగా రాసినట్లు చెప్పారు. 2011 తర్వాత నోటిఫికేషన్ వచ్చి జరిగిన ప్రిలిమనరీ పరీక్షగా లేఖలో అభ్యర్ధులు గుర్తుచేశారు. ఇపుడు ప్రిలిమనరీ రిజల్ట్సు ప్రకటించి, ఇంటర్వ్వూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్ధులకు పోస్టింగులు ఇచ్చేస్తే మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో అన్న సందేహాన్ని లేఖలో అభ్యర్ధులు వ్యక్తంచేశారు. ఇపుడు పాయింట్ ఏమిటంటే పరీక్షలో పాసై మెయిన్స్ కు హాజరయ్యే వాళ్ళ నిష్పత్తిని పెంచాలని రేవంత్ ను రిక్వెస్ట్ చేసుకున్నారు. 560 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకుని చివరకు 3.02 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 21-27 మధ్య మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి.

మామూలుగా అయితే ఒక పోస్టుకు 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ పరీక్షల్లో పాస్ చేస్తారు. ఇపుడు వీళ్ళ రిక్వెస్టు ఏమిటంటే 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపికచేయమని అడుగుతున్నారు. దీనివల్ల ఎక్కువమందికి మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం దొరకుతుందని వీళ్ళంటున్నారు. 1:50 నిష్పత్తి అయితే ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యేందుకు అర్హత మార్కులు 70 అవసరం అవుతాయి. అదే 1:100 నిష్పత్తి అయితే అర్హత మార్కులు 65 సరిపోతాయి. నిజానికి ప్రిలిమ్స్ పరీక్ష పాసై మెయిన్స్ కు అర్హత సాధించేందుకు అభ్యర్ధులకు 70 మార్కులు అయినా ఒకటే 65 అయినా ఒకటే. 5 మార్కుల తేడాలో అభ్యర్ధుల కెపాసిటీలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాకపోతే అర్హత మార్కులు 70 నుండి 65కి తగ్గిస్తే అంటే 5 మార్కుల తేడాలో వేలమంది విద్యార్ధులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించే అవకాశముంది.

కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్ష రాసిన వారిలో చాలామందికి వయసు రీత్యా ఇదే చివరి అవకాశం కాబట్టి పెద్దమనసు చేసుకుని అర్హత మార్కుల నిష్పత్తిని 1:50 నుండి 1:100కి పెంచాలని అభ్యర్ధులు రేవంత్ ను లేఖ ద్వారా రిక్వెస్టు చేసుకున్నారు. తమ రిక్వెస్టును పరిగణలోకి తీసుకుంటే ఎంపికయ్యే అభ్యర్ధులందరు జీవితకాలం రుణపడి ఉంటామని కూడా చెప్పారు. ఈమధ్యనే ఏపీలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి అభ్యర్ధులను ఎంపికచేసి పోస్టింగులు కూడా ఇచ్చారు. అప్పుడు కూడా ప్రిలిమనరీ పరీక్ష పేపర్ బాగా టఫ్ గా వచ్చిందని అభ్యర్ధులు గోలపెట్టారు. అలాగే అర్హతను 1:50 కాకుండా 1:100 గా తీసుకోమని అభ్యర్ధులు రిక్వెస్టుచేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని గుర్తుచేశారు. కాబట్టి తెలంగాణాలో కూడా అదేపద్దతిలో నిర్ణయం తీసుకుంటే వేలాదిమంది నిరుద్యోగులకు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందని గ్రూప్ 1 అభ్యర్ధులు రేవంత్ ను అభ్యర్ధించారు. మరి రేవంత్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read More
Next Story