ఉచితం తర్వాత ఆర్టీసీ పరిస్ధితేంటో తెలుసా ?
x

ఉచితం తర్వాత ఆర్టీసీ పరిస్ధితేంటో తెలుసా ?

ఆర్టీసీ ఉద్యోగులకు జీత, బత్యాలు ఇవ్వటానికి సంస్ధ దగ్గర డబ్బులు లేవు. ఉచిత పథకంకు ముందు ప్రతిరోజు ఆర్టీసీకి సుమారు 17 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది.


పూర్తిగా ఉచితం, అది ఉచితం, ఇది ఉచితం అంటు రాజకీయపార్టీలు జనాలను ఊదరగొడుతుంటాయి. ఎన్నికల్లో జనాలను మాయచేసి ఓట్లేయించుకుని అధికారంలోకి రావటంకోసం పార్టీలు ఉచితాలంటు చాలా హామీలిస్తాయి. వాటిని నమ్మి జనాలు ఓట్లేసి గెలిపిస్తే పరిస్ధితి దారుణంగా తయారవుతుంది. ఇపుడిదంతా ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం ఉచితమనే హామీ ఇచ్చింది. దాంతో మహిళల్లో ఎక్కువమంది కాంగ్రెస్ కు ఓట్లేశారు. ఇలాంటిదే మరికొన్ని హామీల కారణంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ప్రభుత్వం వెంటనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చింది.

ఇపుడేమైందంటే ఆర్టీసీ ఉద్యోగులకు జీత, బత్యాలు ఇవ్వటానికి సంస్ధ దగ్గర డబ్బులు లేవు. ఉచిత పథకంకు ముందు ప్రతిరోజు ఆర్టీసీకి సుమారు 17 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అంటే నెల ఆదాయం రు. 510 కోట్లు. ఇందులో రోజువారి డీజల్ ఖర్చులకు సుమారు 7 కోట్ల రూపాయలు పోయేది. నెలకు డీజల్ కు సంస్ధ రు. 210 కోట్లు ఖర్చచేసేది. ఖర్చులుపోను నెలవారి సంస్ధకు రు. 300 కోట్లు మిగిలేది. విద్యార్ధులు, వృద్ధులు, వికలాంగులకు ఉచిత ప్రయాణం రాయితీని ప్రభుత్వం ఆర్టీసీకి రీ ఎంబర్స్ చేసేది. చేసేదంటే ఎప్పుడో ప్రభుత్వం ఇష్టంవచ్చినపుడు చేసేది. ప్రతినెలా మిగిలే రు. 300 కోట్లతో సిబ్బంది జీత, బత్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండేదికాదు.

ఇపుడు ఉచిత ప్రయాణం అనేటప్పటికి ఏమైందంటే రోజువారి సంస్ధకు వచ్చే రు. 17 కోట్ల ఆదాయంలో సుమారు రు. 11 కోట్లకు గండిపడింది. కేవలం మగవాళ్ళు మాత్రమే టికెట్లు తీసుకుంటున్నారు. వీళ్ళవల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే బస్సులు ఆడవాళ్ళతో నిండిపోతుండటంతో మగవాళ్ళకు బస్సుల్లో చోటు ఉండటంలేదు. అందుకని మగాళ్ళు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. దీనివల్ల ఏమైందంటే రోజుకు 5-6 కోట్ల మధ్య ఆదాయం రావటమే కష్టంగా ఉంది. ఈరోజు పరిస్ధితి ప్రకారం ఆర్టీసీకి నెలకు సుమారు రు. 150 కోట్లు మాత్రమే వస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రతినెలా రీఎంబర్స్ కూడా చేయటంలేదు. వచ్చే ఆదాయం ఆగిపోయినా, ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ చేయకపోయినా బస్సులు తిరగటానికి డీజల్ అయితే తప్పదుకదా. అందుకనే ప్రతినెలా డీజల్ కు రు.210 కోట్ల తప్పటంలేదు.

దీంతో ఏమైందంటే ఖర్చులను తట్టుకోలేక సంస్ధ చేతులెత్తేసింది. డీజల్ సంస్ధకు ఆర్టీసీకి 48 గంటలు మాత్రమే డబ్బులు చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నాయి. ఇపుడా ఖర్చులను చెల్లించలేక సుమారు 20 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. ప్రతినెలా సంస్ధలోని ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం జీత, బత్యాల రూపంలో రు. 225 కోట్ల చెల్లిస్తుంది. ఇపుడంత సొమ్ము సంస్ధ దగ్గర లేదు. అందుకనే వస్తున్న కొద్దిపాటి ఆదయంలో నుండే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రమే జీతాలు చెల్లిస్తోంది.

వీళ్ళకి మాత్రమే ఎందుకు చెల్లిస్తొందంటే బస్సులు తిరగాలి కాబట్టి. వీళ్ళకి కూడా జీతాలు చెల్లించకపోతే బస్సులు తిరగవు. ఉచిత హామీల ద్వారా పార్టీ అధికారంలోకి వచ్చింది. మహిళలు హ్యాపీగా బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు. నష్టపోతోంది, నాశనమైపోతోంది ఆర్టీసీ సంస్ధ మాత్రమే. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్ధిక పరిస్దితి మీద ఉచిత హామీ అమలు కారణంగా మరింత దయనీయంగా తయారవుతోంది. ఐదేళ్ళ తర్వాత ఆర్టీసీ పరిస్ధితి ఎలాగుంటుందో చూడాల్సిందే.

Read More
Next Story