రెండు బోయింగ్  విమానాలు మళ్లింపు, తిరుపతి విమానం ఇంజన్ నుంచి పొగ
x
సాంకేతిక లోపంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిలచిన స్పైస్ జెట్ విమానం

రెండు బోయింగ్ విమానాలు మళ్లింపు, తిరుపతి విమానం ఇంజన్ నుంచి పొగ

అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం అనంతరం ఒకే రోజు మూడు విమానాలు మళ్లించడంతో గగనతల భద్రతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన సంఘటన తర్వాత విమానాలు ఎక్కాలంటేనే ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.ఈ ఘటన తర్వాత ఆదివారం ఒక్క రోజే రెండు విమాన సర్వీసుల్లో సాంకేతిక లోపాలు వెలువడ్డాయి. ఒకే రోజు రెండు బోయింగ్ విమానాలు టేకాఫ్ అయిన వెంటనే తిరిగి వచ్చాయి.ఓ విమానం బాంబు బెదిరింపు కారణంగా రద్దు అయింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానంలో నుంచి పొగ రావడంతో విమానాన్ని నిలిపివేసి రిపేర్లు చేశాక పంపించారు. కొందరైతే భయంతో వారి ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు.అహ్మదాబాద్ ఘటన తర్వాత మొత్తం మీద విమాన ప్రయాణాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు.



తిరుపతి స్పైస్ జెట్ విమాన ఇంజన్ నుంచి పొగ

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్ జీ 2138 విమానం టేకాఫ్ కోసం కదిలిన సమయంలో ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి.వాస్తవానికి ఈ విమానం తిరుపతికి ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు తిరుపతికి టేకాఫ్ కావాలి. కానీ విమానం శంషాబాద్ కు గంట ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆదివారం రాత్రి 8.30 గంటలకు 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలు దేరేందుకు రన్ వే పైకి వచ్చింది. అంతే ఇంజన్ నుంచి పొగ రావడాన్ని పైలట్ గమనించి ఏటీసీకి సమాచారం ఇచ్చి విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక నిపుణులు విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించారు. దీంతో మూడున్నర గంటలు ఆలస్యంగా స్పైస్ జెట్ విమానం ఆదివారం రాత్రి 10.54 గంటలకు తిరుపతికి వెళ్లింది.



హైదరాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా విమానం తిరిగి మళ్లింపు

జర్మనీ దేశంలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు బయలుదేరి హైదరాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 787 -9 డ్రీమ్ లైనర్ ఎల్ హెచ్ 752 విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత తిరిగి ఫ్రాంక్ ఫర్ట్ కు మళ్లించారు. ఈ విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన బెదిరింపు కారణంగా ఈ విమానాన్ని తిరిగి మళ్లించారు. వాస్తవానికి ఈ విమానం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్దరాత్రి దాటాక చేరుకోవాలి.

విమానంలో బాంబు పెట్టారనే బెదిరింపు కారణంగా...
విమానంలో బాంబు పెట్టారనే బెదిరింపు కారణంగా హైదరాబాద్ లో విమానం ల్యాండింగుకు అనుమతి ఇవ్వక పోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారని శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వెనక్కి తిరిగి వచ్చిన లుఫ్తాన్సా ప్రయాణికులకు ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలోనే వసతి కల్పించినట్లు విమాన ప్రయాణికులు చెప్పారు. ఈ విమానాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేసి సోమవారం ఉదయం బయలుదేరుతుందని లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు.



తిరిగి వచ్చిన బ్రిటీష్ ఎయిర్ వేస్ బోయింగ్ విమానం

లండన్ నగరంలోని హిత్రో విమానాశ్రయం నుంచి చెన్నైకు రావాల్సిన బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో తిరిగి వెనక్కి వెళ్లింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ బోయింగ్ విమానంలో సాంకేతిక కారణాలతో హిత్రో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానాన్ని పరీక్షించి, మరమ్మతులు చేశాక తిరిగి విమానాన్ని చెన్నైకు పంపిస్తామని బ్రిటీష్ ఎయిర్ వేస్ తెలిపింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వ్యక్తమవుతున్న ఆందోళన
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన ఘటనలో 274 మంది మరణించిన ఘటన విమాన ప్రయాణికులను వణికిస్తోంది. ఈ విమానం బ్లాక్ బాక్స్ దొరికినా,దీనిపై ప్రత్యేక కమిటీని నియమించినా అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తేలలేదు. దీంతో గగనతల భద్రత ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.


Read More
Next Story