
బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ లో బయోగ్యాస్ ప్లాంట్
రెండు హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్లలో కరెంటు ఉత్పత్తి
ప్రధాని మోదీ ప్రశంసలందుకున్న కూరగాయల కరెంటు మీద ప్రత్యేక కథనం...
హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లలో కూరగాయల వ్యర్థాల నుంచి బయోగ్యాస్, విద్యుత్, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి ఈ నెల 16వతేదీ నుంచి ప్రారంభం కానుంది.హైదరాబాద్ కూరగాయల మార్కెట్లలో కూరగాయల వ్యర్థాల నుంచి బయోగ్యాస్, విద్యుత్, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి కూరగాయల మార్కెట్లలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్లు కొత్త టెండరుదారుల రాకతో పునర్ ప్రారంభం కానున్నాయి.తార్నాకలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కనుగొన్న బయోగ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ లలో ఏర్పాటు చేసింది. ఆహుజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ఈ ప్లాంట్లను నిర్వహించేందుకు తీసుకున్న కాంట్రాక్టు గడవు ముగియడంతో తాము మళ్లీ టెండర్లు పిలిచామని బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ గ్రేడ్ 2 సెక్రటరీ జడల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బయోగ్యాస్ ప్లాంట్లు నడిపిస్తాం
హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లలో వ్యర్థాల నుంచి బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణకు తాము టెండర్లు పిలిచామని మార్కెటింగ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు వెంకన్న గౌడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మూడు సంస్థల నుంచి టెండర్లు దరఖాస్తులు వచ్చాయని జూన్ 16వతేదీ కల్లా వీటిని ఖరారు చేసి బయోగ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. గత ఏడాది ఈ ప్లాంట్ల నిర్వహణ కోసం రూ.33 లక్షలకు కాంట్రాక్టు ఇచ్చామని ఆయన తెలిపారు. కూరగాయల మార్కెట్లలో చెత్త సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో మార్కెట్ కమిటీలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.
ఏటా 3,031.70 మెట్రిక్ టన్నుల కూరగాయల వ్యర్థాలు
బోయిన్ పల్లి హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో రోజుకు 8.42 టన్నుల చొప్పున కూరగాయల వ్యర్థాలు వస్తున్నాయి. నెలకు 252.60 మెట్రిక్ టన్నులు అంటే సంవత్సరానికి 3,031.70 మెట్రిక్ టన్నుల కూరగాయల వ్యర్థాలు వస్తున్నాయి.కూరగాయల వ్యర్థాల తరలించేందుకు రవాణా ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ లో వ్యర్థ కూరగాయల నుంచి 500 యూనిట్ల విద్యుత్, 30 కిలోల బయో ఫ్యూయల్ ను ఉత్పత్తి చేస్తున్నారు.మార్కెట్ కమిటీలో తక్కువ విద్యుత్ బిల్లు రావడంతోపాటు ,మహిళలకు ఉపాధి లభిస్తుందని బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ గ్రేడ్ 2 సెక్రటరీ జడల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బయోగ్యాస్ లిఫ్ట్ రియాక్టర్
హైదరాబాద్ నగరంలోని సీఎస్ ఐఆర్ ఆధీనంలో నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) సేంద్రీయ ఘన వ్యర్థాల నుంచి బయోగ్యాస్,గ్రీన్ ఎనర్జీ, బయో ఎరువుల ఉత్పత్తి చేసేలా అనారోబిక్ బయోగ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ ను రూపొందించారు. ఈ రియాక్టర్ కనుగొన్న ఐఐసీటీకి పేటెంట్ కూడా లభించింది.
బోయిన్ పల్లి మార్కెట్ లో బయోగ్యాస్ ప్లాంట్
ఐఐసీటీ పరిశోధించిన బయోగ్యాస్ ప్లాంట్ ను ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లలో ఏర్పాటుచేశారు. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ ప్లాంట్ యంత్ర పరికరాల కోసం రూ.203లక్షలను వెచ్చించింది. తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం కోసం బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లలో స్థలాలను కేటాయించి సివిల్ పనుల కోసం రూ.78 లక్షలు ఖర్చు చేసింది.
గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ ఉత్పత్తి
బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ లో 2020 నుంచి 2025 మే నెల దాకా 12365.60 టన్నుల కూరగాయల వ్యర్థాలు సేకరించి, బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా 249866.43 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశామని బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ గ్రేడ్ 2 సెక్రటరీ జడల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో సగటు విద్యుత్ బిల్లు గతంలో రూ. 3.00 లక్షలుగా ఉండేది,గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో ఇది ఇప్పుడు రూ.నెలకు 1.50 లక్షలకు తగ్గిందని ఆయన తెలిపారు. 28918.01 కిలోల బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసి దీన్ని మార్కెట్ క్యాంటీన్ లో వినియోగించామని ఆయన చెప్పారు. కూరగాయల వ్యర్థాలతో విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి చేయడంతో చెత్త రవాణ ఖర్చులు ఆదా అవుతుండటంతోపాటు విద్యుత్ బిల్లులు తగ్గాయని కార్యదర్శి సత్యనారాయణ వివరించారు.
సేంద్రీయ ఎరువు తయారీ
కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తితోపాటు సేంద్రీయ ఎరువులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సేంద్రీయ ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారు. ఒకవైపు వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు మార్కెట్ లలో చెత్త సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.
హైదరాబాద్ ఐఐసీటీలో గ్రీన్ ఎనర్జీపై త్వరలో ఎగ్జిబిషన్
కూరగాయల వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసి ఉపయోగించుకునేలా బయోగ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ రూపొందించినట్లు సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పంట వ్యర్థాలను దహనం చేయకుండా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి వినియోగించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇతర సంస్థల్లో కూరగాయలు, పంట వ్యర్థాలతో గ్రీన్ ఎనర్జీ ఏర్పాటుపై త్వరలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.పంట వ్యర్థాలను కంప్రెస్ డ్ బయోగ్యాస్ కేంద్రాలకు విక్రయిస్తే రైతులకు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. కూరగాయల మార్కెట్లలో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను మార్కెటింగ్ శాఖ పరిశీలిస్తుందని మార్కెటింగ్ శాఖ రైతు బజార్ విభాగం జాయింట్ డైరెక్టర్ కె రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
💡Did you know Telangana generates electricity from vegetable waste?
— Telangana Rising 2047 (@TGRising2047) June 9, 2025
At Bowenpally Market, 10 tons of rotten veggies = ⚡500 units power + 🔥30kg biofuel daily!
🌱A model for sustainability: low bills, clean energy, women’s jobs — the world is watching! 🌍✨ #TelanganaRising pic.twitter.com/LRkAICG0ee
బయోగ్యాస్ ప్లాంట్కు ప్రధాని మోదీ ప్రశంస
హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ బయోగ్యాస్ ప్లాంట్లలో కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో అభినందించారు. సబ్జీమండీల్లో కూరగాయలు పలు కారణాల వల్ల కుళ్లిపోయి అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడతాయని తాను గమనించానని, కానీ హైదరాబాద్ కూరగాయల మార్కెట్లలో వ్యర్థ కూరగాయల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని బయోగ్యాస్ ప్లాంట్లను ఇతర రాష్ట్రాల మార్కెటింగ్ శాఖ అధికారులు సందర్శించి, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని చూసి అభినందించారు.
Next Story