
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో కాంగ్రెస్ నిజాలు దాస్తుందా?
ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కమీషన్లకు కక్కుర్తి పడే కాంగ్రెస్ ప్రభుత్వం పనులను కొనసాగించింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్ఎల్బీసీ) ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదని, ప్రమాదం గురించి ముందుగానే సమాచారం ఉందని ఆయన అన్నారు. ప్రమాదం గురించి తెలిసినా కాంగ్రెస్ కావాలనే నిజాలను దాచిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణంపై ఇచ్చిన రెండు నివేదికలు ఈ ప్రమాదాన్ని హెచ్చరించాయని, అయినా కాంగ్రెస్ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి, నిర్లక్ష్య ధోరణితో కాంగ్రెస్ ముందుకు సాగిందని, అందువల్లే ఇప్పుడు ప్రమాదం జరగడమే కాకుండా అందులో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
‘‘టన్నెల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. కానీ కమీషన్లకు కక్కుర్తి పడే కాంగ్రెస్ ప్రభుత్వం పనులను కొనసాగించింది. ఆ నివేదికల్లో చెప్పినట్లే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కూలీ పనులు చేస్తున్న ఎనిమిది మంది కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నం అయ్యాయి. వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఈ ప్రమాదానికి సీఎం రేవంత్తో పాటు, మంత్రులంతా బాధ్యత వహించాలి. రెండు నివేదికల అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్రమాదం జరుగుతుందని నివేదికలు హెచ్చరించినా.. కాంగ్రెస్ ఎందుకు పనులను కొనసాగించింది? నివేదికలను ఎందుకు నిర్లక్ష్యం చేసింది? అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ బదులివ్వాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలని, ప్రమాదం, సహాయక చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను కాంగ్రెస్ విడుదల చేయాలని కోరారు.