లిక్కర్ స్కాం.. ‘కేసీఆర్‌కు కూతురు కన్నా కేజ్రీవాలే ఎక్కువా?’
x
Source: Twitter

లిక్కర్ స్కాం.. ‘కేసీఆర్‌కు కూతురు కన్నా కేజ్రీవాలే ఎక్కువా?’

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కేసీఆర్‌పై ప్రశ్నలు గుప్పించారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు..


ఢిల్లీ లిక్కర్ స్కాం కొన్ని రోజులుగా దేశమంతా హాట్‌టాపిక్‌గా మారింది. రోజుల వ్యవధిలోనే ఒక రాష్ట్ర సీఎం, మరో రాష్ట్ర మాజీ సీఎం కూతురు ఈ కేసులో అరెస్ట్ కావడంతో ఈ మద్యం కుంభకోణం దేశంలో సంచలనంగా మారింది. తాజాగా ఈ లిక్కర్ స్కాంకు సంబంధించిన అంశాలపై కేసీఆర్‌తో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక మరేం చేస్తారో కేసీఆర్ చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తప్పు చేస్తే ఎవరినైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయని, చట్టం దృష్టిలో అందరూ సమానులేనంటూ హితవు పలికారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినా తమను కాదన్నట్టు బదులివ్వకుండా కూర్చున్నారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు వాళ్ల పద్దతులను అనుసరించారని విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం విషయంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు.

‘‘లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కుటుంబానికి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మధ్య ఎటువంటి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? ఈ స్కామ్‌లో సాక్ష్యాలు ఉన్నాయి. మద్యం పాలసీ విషయంలో ఆప్ ప్రభుత్వం తీవ్ర అవకతవకలు చేసింది. కేజ్రీవాల్, కవిత అరెస్ట్ కొంతమంది తప్ప మిగిలిన దేశమంతా సమర్ధిస్తుంది. తప్పు చేయని వారు ఎందుకు భయపడాలని, ఈడీ తప్పు చేసి ఉంటే అరెస్ట్ అయిన వాళ్లు కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్‌తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఈ కుంభకోణంలో జరిగిన అక్రమాలను సాక్షాలతో సహా నిరూపిస్తా. మరి కేజ్రీవాల్ తప్పులేదని కేసీఆర్ నిరూపిస్తారా?’’అని ప్రశ్నలు గుప్పించారు.
అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేయడానికి తెలంగాణ రాజకీయాలకు, ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన కేసీఆర్.. కవిత అరెస్ట్ అంశంలో ఎందుకు మౌనం పాటించారు? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కన్న కూతురు కన్నా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్‌కు ముఖ్యడు అయ్యారా అని విమర్శించారు.
Read More
Next Story