బనకచర్లపై ఎంపీలతో భేటీ కానున్న ఉత్తమ్
x

బనకచర్లపై ఎంపీలతో భేటీ కానున్న ఉత్తమ్

ఏపీ జలదోపిడీని అడ్డుకోవడమే ప్రధాని అంశంగా సాగనున్న సమావేశం.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ ఈ వివాదాన్ని మరింత పెంచింది. తెలంగాణకు రావాల్సిన నీటిని లాక్కోవడం కోసం ఏపీ సర్కార్ అన్ని రకాల అడ్డదారులు తొక్కుతోందని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు ఈ అంశంపై మంగళవారం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తెలంగాణ ఎంపీలందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్‌లను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు కూడా వెల్లడించారు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు లేఖలు రాయడమే కాకుండా తాను స్వయంగా ఫోన్ చేసిన మరీ సమావేశం గురించిన సమాచారం అందించానని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

‘‘‘ట్రిబ్యునల్‌, చట్టాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపాం. సీఎం రేవంత్‌రెడ్డి, నేను లేఖలు రాశాం. జల శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కూడా కలిశాం. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న గోదావరి-బనకచర్ల ప్రీఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కోరాం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి కార్యాచరణ తీసుకోవడానికి గురువారం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story