
లవ్ మర్డర్స్ పై వీహెచ్ ఆందోళన
లవ్ మర్డర్స్ పెరిగిపోతున్న నేపధ్యంలో ఇలాంటి వార్తలను సోషల్ మీడియా, మీడియా ప్రాధాన్యత ఇవ్వకూడదని వీహెచ్ విజ్ఞప్తిచేశారు
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు చాలాకాలం తర్వాత నోరిప్పారు. ఈరోజు గాంధీభవన్ కు వచ్చిన వీహెచ్(V Hanumantha Rao) మీడియాతో మాట్లాడుతు ‘లవ్ మర్డర్స్’ పై ఆందోళన వ్యక్తంచేశారు. భర్తలను భార్యలు, తల్లులను కూతుళ్ళు చంపుకోవటం ఏమిటని ఆవేధన వ్యక్తంచేశారు. హైదరాబాదు(Hyderabad)లోని జీడిమెట్లలో తన ప్రేమకు అడ్డువస్తున్నదన్న కోపంతో ప్రియుడితో కలిసి 10వ తరగతి చదువుతున్న కూతురు తల్లిని హత్యచేయటాన్ని వీహెచ్ ప్రస్తావించారు. లవ్ మర్డర్స్ పెరిగిపోతున్న నేపధ్యంలో ఇలాంటి వార్తలను సోషల్ మీడియా, మీడియా ప్రాధాన్యత ఇవ్వకూడదని వీహెచ్ విజ్ఞప్తిచేశారు.
పెరిగిపోతున్న ఇలాంటి ఘటనలను చూస్తుంటే సమాజం ఎటుపోతున్నదో అన్న ఆందోళన తనలో పెరిగిపోతోందన్నారు. నక్సలైట్ల విషయంలో మాట్లాడుతున్న మానవహక్కుల సంఘాల నేతలు లవ్ మర్డర్స్ (Love Murders)విషయంలో ఎందుకు నోరిప్పటంలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి మర్డర్స్ ను హ్యూమన్ రైట్స్ వాళ్ళు టేకప్ చేయాలని, సైకాలజిస్టులు, మేథావులు కూడా వీటికి పరిష్కారం చూపించాలని విజ్ఞప్తిచేశారు. సమాజంలో ఎక్కడో తప్పుజరుగుతున్న కారణంగానే ఇలాంటి వికృత ఘటనలు జరుగుతున్నాయన్నారు.
అలాగే కోలివింగ్ కల్చర్ పైన కూడా మాజీ ఎంపీ విరుచుకుపడ్డారు. హైటెక్ సిటీ(High-tech City)లో కోలివింగ్ కల్చర్ బాగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కో లివింగ్ కల్చర్(Co living culture) వల్ల యువత బుద్ధులు పెడదారి పట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి ఇలాంటి కల్చర్ ను అరికట్టే విషయమై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) దృష్టిపెట్టాలని కోరారు. ఒకే హాస్టల్లో ఆడ, మగ పిల్లలు కలిసుండటం ఏమిటని వాపోయారు. హైదరాబాద్ నెంబర్ 1 సిటీ కావాలంటే ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపైన ఉందన్నారు. ఇలాంటి సంస్కృతికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్(Youth Congress), ఎన్ఎస్ యూఐ విద్యార్ధిసంఘాలు దృష్టిపెట్టాలని చెప్పారు. గతంలో ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవని అవిపోయి ఇపుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని వీహెచ్ తెగ బాధపడిపోయారు.