మళ్ళీ రాజుకున్న ‘ఇథనాల్’ మంటలు
x

మళ్ళీ రాజుకున్న ‘ఇథనాల్’ మంటలు

ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు మొర్రో అని 12 గ్రామాల ప్రజలు ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం మాత్రం వారి గోడును పట్టించుకోవట్లేదు.


తెలంగాణలో మరోసారి ఇథనాల్ మంటలు చెలరేగాయి. ప్రభుత్వం, అధికారులు ఎంత ప్రయత్నించినా ఈ ‘ఇథనాల్ ఫ్యాక్టరీ’ వివాదం రాజుకుంటూనే ఉంది. గతంలో దిలావర్‌పూర్ ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఈ ‘ఇథనాల్ ఫ్యాక్టరీ’ వివాదం అంటుకుంది. ప్రజలంగా ఏకమైనా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన, ఉద్రిక్తతకు దిగారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు మొర్రో అని 12 గ్రామాల ప్రజలు ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం మాత్రం వారి గోడును పట్టించుకోవట్లేదు. ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తున్నాం అని అధికారులు చెప్పిన మాటలు నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి. తాజాగా మంగళవారం రాత్రి కంపెనీ వాళ్లు పరిశ్రమ ఏర్పాటుకు కూలీలను తీసుకుని వచ్చారు. ఇప్పటికే పరిశ్రమను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులకు కూలీలను చూడటంతోనే ఆగ్రహం తన్నుకొచ్చింది. బుధవారం పొద్దున్నే తాడోపేడో తేల్చుకోవాలన్నంత ఆగ్రహంతో పరిశ్రమ నిర్మించే ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అయినా గ్రామస్తులు ఆగలేదు. పోలీసులను తోసుకుంటూ వెళ్లి.. పరిశ్రమ వాళ్లు వేసుకున్న టెంట్లను తొలగించారు, సామాగ్రిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగలేదు.. వారికి అడ్డుపడిన పోలీసులపై కూడా దాడి చేశారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూడు నెలల కిందట కంపెనీ ఉండదని చెప్పిన యాజమాన్యం.. మళ్లీ పనులు మొదలుపెట్టేందుకు ఉపక్రమించడంతో పది గ్రామాల రైతుల ఆందోళన చేపట్టారు.

గతలంలో కూడా ఇదే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిలావర్ పూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాడు వాళ్లు చేసిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులకు వ్యతిరేకంగా దిలావర్పూర్ ప్రజలు నిరసనలను ఉధృతంగా సాగించారు. రాత్రి సమయంలో రోడ్లపైనే మంటలు వేసుకుని నిరసన తెలిపారు. పలువురు మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు కొందరిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉధ్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు వాహనాలపైకి గ్రామస్తులు రాళ్లురువ్వారు. దీంతో కలెక్టర్ అక్కడకు చేరుకుని నిరసనలకారులను హామీ ఇచ్చి, వారి కోరిక మేరకు అధికారిక నోటీసులు జారీ చేసి నిరసనలను విరమించుకునేలా చేశారు. ‘‘ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వానికి ముఖ్యం. పరిశ్రమలు కూడా ముఖ్యమైనా ప్రజలకు ఇబ్బంది పెట్టే మూల్యానికి కాదు’’ అని ప్రభుత్వ వర్గాలు స్పస్టం చేశాయి. ఇదే విషయాన్ని కలెక్టర్ అభినవ్ కూడా ప్రజలకు తెలిపారు.

Read More
Next Story