
‘గేమ్ ఛేంజర్’ పథకానికి ఎందుకు బ్రేక్ పడింది?
ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తేదీన అమలు చేయాలని గతంలో డిసైడ్ చేశారు
రాజీవ్ యువ వికాసం (Rajeev Yuva Vikasam) పథకాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ గా భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి సామాజికవర్గాల్లోని లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధిచూపించే ఈపథకం సక్రమంగా అమలైతే నిజంగా గేమ్ ఛేంజర్ (Game Changer) అనే అనుకోవాలి. వేలాదికోట్ల రూపాయలు ఖర్చుతో పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది కాబట్టి నిజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)కి బాగా కలిసివస్తుందని రేవంత్ (Revanth Reddy) అనుకున్నారు. అందుకనే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తేదీన అమలు చేయాలని గతంలో డిసైడ్ చేశారు. అయితే అనూహ్యంగా పథకం గ్రౌండింగ్ నిరవధికంగా వాయిదాపడింది. ఎందుకు వాయిదాపడిందన్నది చాలామందికి అర్ధంకావటంలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వంతో పాటు పార్టీవర్గాలను ఆరాతీస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
పథకం ఉద్దేశ్యం ఏమిటి?
పథకం గ్రౌండింగ్ ఎందుకు వాయిదాపడిందో తెలుసుకోవాలంటే ముందు దీని ఉద్దేశ్యం తెలియాలి. పథకం ఉద్దేశ్యం ఏమిటంటే రాష్ట్రంలోని నిరుద్యోగయువతలో కనీసం 5 లక్షలమందికి ఆర్ధికంగా సాయంచేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని. ఆర్ధికసాయం కోసం ప్రభుత్వం నాలుగు శ్లాబులను ఫిక్స్ చేసింది. అవేమిటంటే మొదటిది రు. 50 వేలు విలువ చేసే యూనిట్లు. అంటే చిన్న కిరాణాకొట్లు, పాన్ షాపులు, స్నాక్స్ తయారుచేసి అమ్మే బండ్లు పెట్టుకోవటం లాంటివి వస్తాయి. రెండో శ్లాబు రు. 50 నుండి లక్ష రూపాయల రుణం అందించటం. దీనిలో పెద్దసైజు కిరాణాకొట్టు, టిఫిన్ వ్యాపారాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కోళ్ళ పెంపకం లాంటివి వస్తాయి. మూడో శ్లాబు లక్ష రూపాయల నుండి రు. 2 లక్షల వరకు. ఇందులో చిన్నసైజు సూపర్ బజార్, ఒకమాదిరి హోటల్, స్నాక్స్ తయారీ యూనిట్లు, కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం లాంటివి వస్తాయి. నాలుగో శ్లాబు రు. 2 లక్షల నుండి 4 లక్షలరూపాయల రుణాలు. దీని పరిధిలో పైన చెప్పుకున్నవే పెద్ద సైజులో ఏర్పాటు చేసుకునేవి.
మొదటిరెండు శ్లాబులు అంటే రు. 50 వేల లోపు, లక్ష రూపాయల రుణాల పరిధిలో ఎక్కువ దరఖాస్తులు వస్తాయని ఆశించారు. 5 లక్షలమంది యువతకు రుణాల మంజూరు కోసం ప్రభుత్వం సుమారు రు. 6,250 కోట్లను కేటాయించింది. మొదటి దశ జూన్ నెలలో 85 వేలమందికి రు. 650 కోట్ల సబ్సిడితో బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుచేయించాలని ప్రభుత్వం అనుకున్నది. ఈ రుణాలకు 100 శాతం సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. లక్ష రూపాయల రుణాలపై 90 శాతం, రు. 2 లక్షల రుణాలపై 80 శాతం, రు. 4 లక్షల రుణాలపై 70 శాతం సబ్సిడి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నూరుశాతం సబ్సిడీ, 90 శాతం సబ్సిడీ అందించే రు. 50 వేలు, లక్ష రూపాయల రుణాలకు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనావేసింది. అయితే ప్రభుత్వ ఆలోచన తల్లకిందులైపోయింది.
ఎంఎల్ఏల సిఫారసుతోనే దరఖాస్తులు
పథకంలో భాగంగా మొత్తం రు. 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రు. 4 లక్షల రుణాల కోసమే సుమారు 13 లక్షల దరఖాస్తులు అందినట్లు సమాచారం. తక్కువ మొత్తాన్ని రుణంగా ఇచ్చి ఎక్కువమందిని కవర్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యం పూర్తిగా తల్లకిందులైపోయింది. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని ప్రభుత్వం పథకం అమలును నిరవధికంగా వాయిదావేసింది. పథకం అమలును వాయిదావేస్తున్నట్లు ప్రభుత్వం నుండి అన్నీ జిల్లాల కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు సమాచారం. ఎందుకంటే వచ్చిన దరఖాస్తులపై ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఆరోపణలు ఏమిటంటే రాజకీయజోక్యంతోనే యువత రు. 4 లక్షల రుణాలకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేశారని. చాలానియోజకవర్గాల్లో అధికారపార్టీ లేదా ఎంఎల్ఏలు సిఫారసుతోనే అధికారులు దరఖాస్తులను ఎంపిక చేశారనే ఆరోపణలు పెరిగిపోయాయి. అందుకనే ముందుగా దరఖాస్తులను ఒకటికి రెండుసార్లు స్క్రూటినిచేసి వడపోయాలని ప్రభుత్వం నుండి కలెక్టర్లు, జిల్లాల ఇన్చార్జి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అందుకనే పథకం గ్రౌండింగ్ ను వాయిదావేసింది ప్రభుత్వం.
బీసీల్లో 1.55 లక్షలమంది యువతకు యూనిట్లు మంజూరుచేయాలని అనుకుంటే వచ్చిన దరఖాస్తులు 8 లక్షలు. ఎస్సీలకు 1.44 లక్షల యూనిట్లు మంజూరుచేయాలని టార్గెట్ పెట్టుకుంటే వచ్చిన దరఖాస్తులు సుమారు 4 లక్షలు. ఎస్టీలకు 90 వేల యూనిట్లు మంజూరు చేయాలని అనుకుంటే 1.85 లక్షల దరఖాస్తులు అందాయి. ఈబీసీలకు 50 వేల యూనిట్లు మంజూరుచేయాలని అనుకుంటే వచ్చిన దరఖాస్తులు 37 వేలు మాత్రమే. క్రిస్తియన్లకు 5 వేల యూనిట్లను టార్గెట్ గా పెట్టుకుంటే 4600 దరఖాస్తులు వచ్చాయి. మొదటి రెండు శ్లాబుల్లో సుమారు 3 లక్షల మంది యువతకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం అనుకుంటే వచ్చిన దరఖాస్తులు సుమారు 1.33 లక్షలు మాత్రమే. 50 వేలలోపు రుణాలకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీని ప్రకటించినా అందిన దరఖాస్తులు సుమారు 40 వేలు మాత్రమే. లక్ష రూపాయల రుణాలకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందిన దరఖాస్తులు 93 వేలు మాత్రమే.
ఇక్కడ ఇంకో సమస్య కూడా ప్రభుత్వానికి ఎదురైంది. అదేమిటంటే వచ్చిన దరఖాస్తుల్లో చాలామంది తాము ఇప్పటికే చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రుణాలు కోరుతున్నట్లు దరఖాస్తులో చెప్పుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా ఉపాధిమార్గాలు ఎంచుకునే వారికి మాత్రమే రుణాలు ఇవ్వాలి. ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారికి వర్కింగ్ క్యాపిటల్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంకాదు. పథకంలో రుణాలు కోరుకునేవారి వయసు 21-55 మధ్యే ఉండాలని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటుచేసుకునే వారికి మాత్రం మరో 5 ఏళ్ళు అంటే 60 ఏళ్ళ వరకు వయసులో రిలాక్సేషన్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్దేశ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలంటే గేదెలు, ఆవుల పాల వ్యాపారం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం యూనిట్లు పెట్టుకోవాలని. అయితే చాలామంది వ్యాపారవిస్తరణకే రుణాలు అడుగుతుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
సిబిల్ స్కోరే అసలు సమస్య : నాగరాజు
రాజీవ్ యువ వికాస పథకం అమలుకు బ్యాంకర్లు పెట్టిన సిబిల్ స్కోర్ నిబంధనే పెద్ద అడ్డంకిగా మారినట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఉపాధ్యక్షుడు పట్ల నాగరాజు అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు నిరుద్యోగ యువతకు సిబిల్ స్కోర్ మంచిగా ఎందుకుంటుందని నాగరాజు ప్రశ్నించారు. రు. 50 వేలు, లక్ష రూపాయల లోపు రుణాలకు సిబిల్ స్కోర్ అవసరం లేకపోయినా రు. 2, 4 లక్షల రూపాయల రుణాలకు బ్యాంకులు సిబిల్ స్కోర్ ను తప్పనిసరిగా చేసిందన్నారు. అలాగే చాలాచోట్ల ఎంఎల్ఏల అనుచరులే ఎక్కువమంది దరఖాస్తు చేసినట్లు వినిపిస్తున్న ఆరోపణలను నాగరాజు గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయంలో ఉద్యోగాల భర్తీ సరిగా లేకపోవటం కూడా ఇపుడు లక్షలమంది దరఖాస్తులు చేయటానికి కారణమని నాగరాజు చెప్పారు.
దరఖాస్తులను స్క్రూటిని చేస్తోంది : నరేష్ గౌడ్
ప్రభుత్వం ఊహించినదానికన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని తెళ్ళపెల్లి నరేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చేయటంతో ఇపుడు వాటిని స్ర్కూటిని చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రు. 2, రు. 4 లక్షలు రుణలు మంజూరైన వారికి మంచి సిబిల్ స్కోర్ ఉండాలన్న బ్యాంకుల నిబంధన కూడా ఇబ్బందిగా మారిందన్నారు. నిరుద్యోగులు లక్షల్లో ఉండటం కూడా 16 లక్షల దరఖాస్తులు రావటానికి కారణమన్నారు. సిబిల్ స్కోర్ విషయంలో ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి సర్దుబాటు చేస్తే కాని రాజీవ్ యువ వికాసం పథకం అమలుకాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో దళితబంధు పథకం అమలు సరిగా జరగకపోవటం కూడా ఇపుడు రాజీవ్ యువ వికాస పథకం అమలులో బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకున్నట్లు నరేష్ అభిప్రాయపడ్డారు.
బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు : మానవతా రాయ్
రాజీవ్ యువ వికాస పథకం తొందరలోనే అమల్లోకి వస్తుందని విద్యార్ధి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కోటూరి మానవతారాయ్ చెప్పారు. సిబిల్ స్కోర్ సమస్య పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లతో మాట్లాడుతున్నట్లు కోటూరి తెలిపారు. బ్యాంకర్లతో సాంకేతిక సమస్యలు పరిష్కారం కాగానే పథకం అమల్లోకి వస్తుందన్నారు. పథకం కోసం ప్రభుత్వం రు. 6 వేల కోట్లను కేటాయించినట్లు మానవతా రాయ్ చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, అవకతవకలను ఉన్నతాధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే వచ్చిన దరఖాస్తుల వివరాలను, రాజకీయ జోక్యాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అందుకనే పథకం అమలును నిరవధికంగా వాయిదావేసి రాజకీయ జోక్యం లేకుండా, పథకం అమలులో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూడాలని ఉన్నతాధికారులను రేవంత్ ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను స్క్రూటిని చేసి రాజకీయ జోక్యంలేకుండా చూసి పకడ్బందీగా దరఖాస్తుల ఎంపిక సిద్ధమైన తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చించి పథకం గ్రౌండింగ్ చేయాలన్నది రేవంత్ ఆలోచన. పథకంఅమలులో రాజకీయజోక్యం లేకుండా చూడటం సాధ్యంకాదని రేవంత్ కు తెలీకుండానే ఉంటుందా ? మరిదంతా అయ్యేటప్పటికి ఎంతకాలం పడుతుందో చెప్పలేకున్నారు కాబట్టే పథకం అమలును నిరవధికంగా ప్రభుత్వం వాయిదావేసింది.