మొబైల్‌పై మాట మార్చిన కేటీఆర్
x

మొబైల్‌పై మాట మార్చిన కేటీఆర్

ఈ సడెన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో అని అంతా చర్చిస్తున్నారు.


ఇప్పటికే మొబైల్, ల్యాప్‌టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కాబట్టి తాను ఇవ్వనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. కాగా ఇంతలోనే మరో మాట కూడా చెప్పారు కేటీఆర్. ‘‘2024 మొదటి త్రైమాసికంలో నేను మొబైల్ ఫోన్ మార్చాను. అప్పుడు వాడిన ఫోన్ నా దగ్గర లేదు. అదే విధంగా నేను ఫోన్ మినహా మరే ఇతర గ్యాడ్జెట్స్‌ను వాడలేదు’’ అని కేటీఆర్ చెప్పారు. తాను ఫోన్, ల్యాప్‌టాప్ ఇవ్వను అన్న కేటీఆర్.. అసలు తన దగ్గర అవేమీ లేవని ఒక్కసారిగా మాట మార్చేయడం కీలకంగా మారింది. ఆయన ఈ సడెన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో అని అంతా చర్చిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ వల్లే కేటీఆర్ మాట మారిందా..?

అయితే ఫార్ములా కార్ రేసు కేసులో కేటీఆర్ ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా మరోవైపు అంతే హాట్‌హాట్‌గా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్ పేరు వినిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు ఆనాటి అధికారులు ఫోన్లను ట్యాప్ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. అది కూడా ఎన్నికలకు ముందే జరిగింది. ఇప్పుడు గనుకు ఏసీబీ అధికారులకు తన ఫోన్, ల్యాప్‌టాప్ ఇస్తే.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు బహిర్గతం అవుతాయని కేటీఆర్ కంగారు పడుతున్నారని, అందుకే ఆయన అసలు తన దగ్గర ఫోన్ లేదని, మరే గ్యాడ్జెట్ వాడలేదంటూ మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే గనుక జరిగితే కేటీఆర్ పరిస్థితి పులి పోయి భూతం పట్టుకున్నట్లు మారుతుందని, అలా జరగకూడదనే ఆయన ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతోనే తన దగ్గర ఏమీ లేదని కేటీఆర్ అంటున్నారని కూడా విశ్లేషకులు అంటున్నారు.

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు ప్రస్తుతం కేటీఆర్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌పై ఫోకస్ పెట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి వాటిలో ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు 2023 ఎన్నికలకు ముందు కేటీఆర్ వాడిన ఫోన్, ల్యాప్‌టాప్ అప్పగించాలని ఆదేశించారు. ఆ సమయంలో కేటీఆర్ చేసిన ఫోన్ కాల్స్, మెసేజెస్ ఇలా అన్ని వివారాలు సేకరించడం కోసమే ఏసీబీ అధికారులు ఫోన్లు అడుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి ఆయన ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎప్పుడు చేశారు, ఏమని ఆదేశాలిచ్చారు వంటి విషయాలు తెలుసుకోవడనికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫోన్లు, ల్యాప్‌టాప్ అడిగారు. కాగా ఈ పరిణామం కేటీఆర్‌ను ఫుల్ డిఫెన్స్‌లోకి నెట్టేసింది. ఏసీబీకి ఎలాగైనా ఫోన్లు ఇవ్వకూడదని కేటీఆర్ ఫిక్స్ అయ్యారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

న్యాయవాదులతో భేటీ

ఏసీబీ అధికారులకు ఫోన్, ల్యాప్‌టాప్ ఇవ్వాలా? అలా ఏమైనా రూల్స్ ఉన్నాయా? లేక అది మన పర్సనల్ చాయిస్ అవుతుందా? ఇలా అనేక అంశాలపై న్యాయవాదులతో కేటీఆర్ చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ అంశంపైనే న్యాయవాదులతో కేటీఆర్ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కాగా న్యాయనిపుణులు చేసిన సూచనల మేరకు ఏసీబీకి ఫోన్ ఇవ్వకూడదని కేటీఆర్ ఫిక్స్ అయ్యారు. ఇదే విషయంపై ఆయన ఏసీబీ అధికారులకు లేఖ కూడా రాశారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Read More
Next Story