
కేసీఆర్ని బతిమిలాడుకుంటున్న రేవంత్..!
పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి.
కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మని అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎన్నో సార్లు కోరారు. ఆయన సభకు వచ్చి తన అనుభవంతో సూచనలు చేయాలని అడిగారు. ఇదే మాట సీఎం రేవంత్ కూడా అన్నారు. తాజాగా జహీరాబాద్లో పర్యటించిన సీఎం రేవంత్.. కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మంటూ బతిమిలాడిన తరహాలో అడగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుల అండ ఉంటే అద్భుతాలు సృష్టిస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో కీలకంగా మారాయి. కేసీఆర్ నుంచి పాలనను నేర్చుకోవడానికి రేవంత్ రెడీ అయ్యారా అన్న కోణంలో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ వాళ్లు ఆరోపిస్తున్నట్లు రేవంత్ది అసమర్థ పాలనే అని ఈ మాటలు తేటతెల్లం చేస్తున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
అసలు రేవంత్ ఏమన్నారంటే.. ‘‘ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండి. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి. ఏ రోజు నేను సీఎంగా అహంకారానికి పోలేదు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతా’’ అని అన్నారు. దీంతో ఆయన కేసీఆర్నే ఉద్దేశించి మాట్లాడారని స్పష్టం అవుతోంది. కేసీఆర్ లాంటి వ్యక్తి అండగా ఉంటే తెలంగాణను ప్రపంచస్థాయికి తీసుకెళ్తానన్న ఆయన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. అసలు రేవంత్ చేసిన వ్యాఖ్యల మర్మం ఏంటని అంతా చర్చిస్తున్నారు.
రేవంత్ అసలు ప్లాన్ ఏంటి..!
ఇదే సమయంలో రేవంత్ వ్యాఖ్యల సారాంశం బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నట్లు.. కేసీఆర్ అద్భుత నాయకుడు అని కాదని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఖజానా ఖాళీ అయిందని, బయట చిల్లగవ్వ అప్పు కూడా పుట్టడం లేదని, అప్పు అడగడానికి వెళ్తే అదోలా చూస్తున్నారని కూడా సీఎం రేవంత్ పలు సందర్భాల్లో చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం.. ఆ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించింది మేము కాదు.. ఈ పెద్ద మనిషే అని కేసీఆర్ను చూపించడమే రేవంత్ మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెప్తున్నారు. దాంతో పాటుగా తాము ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ ఏ రేంజ్లో ఆడుకున్నారో.. ఇప్పుడు దానికి రివేంజ్ తీర్చుకోవడానికి కూడా రేవంత్ అండ్ పార్టీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు.
అసెంబ్లీకి రెండే రెండు సార్లు..
2023 డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం మారింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కేసీఆర్కు తొంటి ఆపరేషన్ జరగడంతో రెండు నెలల తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2024 బడ్జెట్ సమావేశాలప్పుడు తొలిసారి ఆయన అసెంబ్లీ గడప తొక్కారు. అంతే ఆ తర్వాత అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. మళ్లీ 2025 రాష్ట్ర బడ్జెట్ సమావేశాలప్పుడు ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. అసెంబ్లీకి రావడమే కాదు.. ప్రజల్లో కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అధికారం పోయినప్పటి నుంచి కేసీఆర్ ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్హౌస్కే పరిమితమయ్యారు.