
సొంత పార్టీలనే టార్గెట్ చేస్తున్న నేతలు.. ఎందుకో..!
‘కారెక్కడానికి రెడీగా కమలనాథులు’
తెలంగాణ రాజకీయాలు రంజురంజుగా మారుతున్నాయి. కీలక నేతలు సొంత పార్టీలపైనే విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్పై ఆ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా తాను రిమాండ్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరిగాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపేశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇన్నాళ్లూ బీఆర్ఎస్ అనేది బీజేపీ బీ టీమ్ అంటున్న కాంగ్రెస్ నేతల ఆరోపణలు బలంపుంజుకున్నాయి. ఇన్నాళ్లూ పార్టీనే ప్రాణం అన్నట్లు ఉన్న కవిత.. ఒక్కసారిగా ఎందుకు రెబల్గా మారారు అని అంతా అనుకుంటున్నారు. సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం టాప్ హెడ్లైన్స్గా ఉంటున్నాయి.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అసలు ఒప్పందం ఏమైనా ఉందా? ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయా? బీఆర్ఎస్లోని మచ్చలేని నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? అన్న అంశాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా తన సొంత పార్టీ అయిన బీజేపీపై విమర్శలు గుప్పించారు. మంచి ప్యాకేజీ దొరకాలే కానీ బీజేపీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
‘‘పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు. గతంలో కూడా ఇదే జరిగింది. అందుకే బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ కూడా మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో చేతులు కలిపారు. అందుకే బీజేపీ అధికారంలోకి రాలేకపోతోంది. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో వచ్చి ఉండాలి. కానీ ఇలాంటి నాయకుల వల్లే ఇప్పటి వరకు అది జరగలేదు’’ అని రాజాసింగ్ ఆరోపించారు.
ఆయన వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్లో ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా పక్క పార్టీపై విమర్శలు చేయాల్సిన నేతలు సొంత పార్టీలే టార్గెట్ విమర్శలు ఎందుకు చేస్తున్నారు? అధిష్టానంపై అసంతృప్తా? తమకు పదవులు రాలేదన్న అక్కసా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.