
కవితకు ఐదు ప్రశ్నలు
విలీన ప్రయత్నాలు తెలియటంతోనే తాను కుట్రను అడ్డుకున్నట్లు చెప్పారు.
కల్వకుంట్ల కవిత వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గడచిన వారంరోజులుగా పేరు ఎత్తకుండా సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. కేసీఆర్(KCR) నాయకత్వం తప్ప కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేదిలేదని స్పష్టంగా తెగేసిచెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ లోపాలు, కేటీఆర్ వైఖరిని తప్పుపడుతు లేఖలు రాయటం, ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం వరకు ఓకేనే. కాని ఈ జోరులోనే కవిత ఒక ఆరోపణ చేశారు. అదేమిటంటే తాను జైలులో ఉన్నపుడు బీఆర్ఎస్(BRS) ను బీజేపీ(BJP)లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని. విలీన ప్రయత్నాలు తెలియటంతోనే తాను కుట్రను అడ్డుకున్నట్లు చెప్పారు.
సరిగ్గా ఈ పాయింటు మీదే బీజేపీ నుండి కవితపైకి వరుసగా కౌంటర్లు పెరిగిపోతున్నాయి. బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కవిత తప్పించుకుంటున్నారు. విలీనం ప్రతిపాదనలు, కుట్రలపై ప్రశ్నలు వేసిన మీడియాకు సమాధానాలు చెప్పకుండా కవిత తప్పించుకుంటున్నారు. కవిత సమాధానాలు చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆప్రశ్నలు ఏమిటంటే బీఆర్ఎస్-బీజేపీ విలీనం ప్రయత్నాలు నిజమే అని అనుకుందాం.
1. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలన్న ప్రయత్నాలు చేసిన కారుపార్టీ నేత ఎవరు ?
2. పార్టీ అధినేత కేసీఆర్ కు తెలీకుండానే బీజేపీలో విలీనం ప్రయత్నాలు చేయగలిగిన అధికారం, అవకాశం ఎవరికుంది ?
3. బీఆర్ఎస్ విలీనం గురించి బీజేపీ తరపున మాట్లాడిన నేత ఎవరు ?
4. అప్పటికే ఢిల్లీలిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైలులో ఉంటున్న కవిత(Kavitha) విలీనం కుట్రను ఎలా ఎదుర్కోగలిగారు ?
5. రెండుపార్టీల మధ్యా విలీనం ప్రతిపాదన చర్చలు లేదా కుట్ర జరుగుతోందని కవితకు చెప్పిన నేత ఎవరు ?
6. ఎవరిసాయంతో విలీనం కుట్రను కవిత ఎదుర్కొన్నారు ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు(BJP MP Raghunandan Rao)తో పాటు మీడియా కూడా కవితను పదేపదే ప్రశ్నిస్తున్నది. అయితే ఈప్రశ్నలకు సమాధానం చెప్పటానికి మాత్రం కవిత నిరాకరిస్తున్నారు. తాను చేసిన విలీనం చర్చలు నిజమే అయితే సమాధానం చెప్పటానికి కవిత ఎందుకు ఇష్టపడటంలేదన్న అనుమానం పెరిగిపోతోంది.