కేసీఆర్ విచారణకు ముందు కాళేశ్వరం రిపోర్టు ఎందుకు లీకైంది ?
x
KCR

కేసీఆర్ విచారణకు ముందు కాళేశ్వరం రిపోర్టు ఎందుకు లీకైంది ?

ఈఎన్సీ, ఎస్ఈ, సీఈలుగా పనిచేసిన 17 మందిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని సూచించింది


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను పక్కనపెట్టేద్దాం. ఈనెల 11వ తేదీన కాళేశ్వరం అవినీతి, అవకతవకలు జరిగాయన్న విషయమై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నారు. విచారణకు కేసీఆర్ హాజరయ్యే ముందు విజిలెన్స్ రిపోర్టు ఎందుకు లీకైందన్నది కీలకమైన పాయింట్. కాళేశ్వరం ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ రిపోర్టు రెడీచేసి మార్చిలోనే ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటినుండి మొన్నటివరకు విజిలేన్స్ రిపోర్టులో ఏముందన్న విషయం ఎక్కడా బయటపడలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) కాని శాఖలోని ఉన్నతాధికారులు కాని విజిలెన్స్ రిపోర్టుపై ఎక్కడా నోరిప్పలేదు. అలాంటిది హఠాత్తుగా రిపోర్టు మొత్తం లీకులరూపంలో ఒక్కసారిగా ఎలా బయటకుపొక్కింది ?

పార్టీవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్(KCR) పై రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. విజిలెన్స్ రిపోర్టులో 50 మంది మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఉంది. 50 మందిలో ఈఎన్సీ, ఎస్ఈ, సీఈలుగా పనిచేసిన 17 మందిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని సూచించింది. మిగిలిన 33 మందిపైన శాఖాపరమైన యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. 17 మందిలో తొమ్మిదిమంది రిటైర్ అవ్వగా ఎనిమిది మంది సర్వీసులోనే ఉన్నారు. అయినా సరే అందరిమీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అని సిఫారసుచేసింది.

ఎవరెవరిపై చర్యలు ?

మాజీ ఈఎన్సీ బీ నగేంద్రరావు, ప్రస్తుత ఈఎన్సీ టీ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వి. ఫణిభూషణ్ శర్మ, రిటైర్ అయిన మాజీ ఈఎన్సీ సీ మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, మాజీ డిప్యుటి చీఫ్ ఇంజనీర్ గజ్జెల హరిహరచారి, మాజీ చీఫ్ ఇంజనీర్ బీ వెంకటేశ్వర్లు, మాజీ ఎస్ఈ గంగాధర్, మాజీ సీఈ అజయ్ కుమార్, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తదితరులపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పింది.

ఏ సెక్షన్లు వర్తిస్తాయి ?

ఐపీసీ-120(బి) ప్రకారం నేరపూరిత కుట్ర, 6 నెలలు జైలు, ఐపీసీ-336 ప్రకారం మానవతప్పిదం, మూడునెలలు జైలుశిక్ష లేదా జరిమాన. విధించాలి. ఐపీసీ-409 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నమ్మకద్రోహానికి పాల్పడినట్లు తేలితే యవజ్జీవ శిక్ష విధిస్తారు. ఐపీసీ-418 ప్రకారం మోసపూరితంగా ఇతరుల అభిప్రాయాలను ప్రభావితంచేసినందుకు మూడేళ్ళు జైలుశిక్ష. ఐపీసీ 423 ప్రకారం చీకటిఒప్పందంతో హక్కులు ఇస్తే రెండేళ్ళు శిక్ష. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మూడునుండి ఏడేళ్ళు జైలు. ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం జవాబుదారీతనం లేకపోతే రెండేళ్ళు శిక్ష పడాలి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం నివారించే చట్టం1984 ప్రకారం ఐదేళ్ళు జైలుశిక్ష విధించాలన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు పైన చెప్పిన రిటైర్ అయిన, సర్వీసులో ఉన్న ఉన్నతాధికారుల్లో చాలామంది ప్రాజెక్టు, బ్యారేజీలో జరిగిన అవినీతికి, అవకతవకలతో తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ప్రాజెక్టు స్ధలం మార్పు, డిజైన్, రీడిజైనింగ్, నిధుల విడుదల, ఖర్చు, నిర్మాణ పనుల పర్యవేక్షణ అంతా అప్పటి పాలకులు+నిర్మాణసంస్ధ ఉద్యోగులే చూసుకున్నట్లు అఫిడవిట్లు కూడా దాఖలుచేశారు. నాటి పాలకులు అంటే కేసీఆర్, హరీష్ రావని, నిర్మాణ సంస్ధ అంటే ఎల్ అండ్ టీ అని అర్ధం. పైన చెప్పిన అంశాలకు సంబంధించిన ఫైళ్ళు తమ దగ్గరకు పంపించినా వాటిని చదివి, చర్చించే అవకాశాలు తమకు అప్పటి పాలకులు ఇవ్వలేదని చెప్పారు. ఫైళ్ళు తమకు దగ్గరకు పంపగానే వెంటనే హరీష్ పేషీల నుండి అధికారులు తమ దగ్గరకు వచ్చి ఒత్తిడిచేసి సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయేవారని చెప్పారు. కాబట్టి ఆ ఫైళ్ళల్లో ఏముందో కూడా తమను చూడనీయలేదని అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పారు.

అప్పటి ఉన్నతాధికారులు అఫిడవిట్లలో చెప్పిందే నిజమైతే కేసీఆర్, హరీష్(Harish Rao) వాటిని ఎలా కౌంటర్ చేస్తారో చూడాలి. వీళ్ళిద్దరి వాదన కూడా వినాలనే కమిషన్ విచారణకు రమ్మని నోటీసులు జారీచేసింది. ఇప్పటికిప్పుడు విజిలెన్స్ రిపోర్టు లీకవ్వటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే ఉన్నతాధికారులపైనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసుచేస్తే మరి వీరితో తప్పులు చేయించిన పాలకుల మాటేమిటి ? అన్నచర్చ జనాల్లో జరగాలన్నదే ప్రభుత్వ టార్గెట్ గా కనబడుతోంది. తప్పులుచేసిన నాటి పాలకులకు శిక్షలు తప్పవన్న హెచ్చరికలుగా రిపోర్టు ఉపయోగపడుతుందన్న ప్రచారం కూడా పెరిగిపోతోంది. 9వ తేదీన హరీష్, 11న కేసీఆర్ కమిషన్ విచారణకు హాజరైతే మరింత క్లారిటి వచ్చే అవకాశముంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story