
ఆసక్తికరంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం తెలుగుదేశం ట్విస్ట్ ఇస్తుందా?
గులాబీ పార్టీ సిట్టింగ్ సీటు నిలుపుకుంటుందా? హస్తగతం అవుతుందా ?అనూహ్య పరిణామం ఎదురవుతుందా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుంది.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిన ఈ నియోజక వర్గాన్ని తమ లెక్కలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ ఇప్పటినుంచే స్కెచ్ వేస్తోంది.గోపీనాధ్ కుటుంబ సభ్యులనే బరిలో దింపితే సానుభూతితో నైన తిరిగి ఆ సీటును కాపాడుకోవచ్చని బీఆర్ఎస్ చూస్తోంది.మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అనూహ్యపరిణామాలు జరుగుతాయా?ఈ ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ కూడా పోటీలో వుండి ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా? అన్న చర్చ సాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పటికే అన్ని పార్టీలు చర్చలు,లెక్కలు మొదలు పెట్టాయి. ఆరు నెలలలోపే ఉప ఎన్నిక జరగాలి కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ ఉపఎన్నికలో ఎంఐఎం అడుగులు కీలకం కాగా, కంటో న్మెంట్ సీటు తరహాలోనే జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
తెలుగుదేశం పోటీపై ఊహాగానాలెందుకు?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వున్న కీలకమైన నియోజక వర్గాలలో జూబ్లీహిల్స్ ఒకటి.2009 లో ఈ నియోజక వర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు గెలిచారు. 2014 లో టీడీపీ నుంచి గెలచిన గోపీనాధ్ , ఆ తరువాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018,2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు.రాష్ట్రంవిడిపోయిన నేపధ్యంలో టీడీపీ ఏపీకే పరిమితం అయినా,స్వతహాగా తెలుగుదేశం పార్టీని బలపరిచే సామాజిక వర్గ ఓటర్లు, ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే వున్నాయి.గతంలో టీడీపీ గెలిచిన సీటు కావడం తెలంగాణ లోనూ మళ్లీ బలపడాలని తెలుగుదేశం నాయకత్వం భావిస్తుండటంతో , అందివస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సద్వినియోగం చేసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.అందులో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.టీడీపీలో సుహాసిని క్రియాశీలకంగా ఉన్నారు. నందమూరి వారసురాలిగా ఆమెకు సీటు ఇస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.అయితే టీడీపీ పోటీ చేయడానికి బీజేపీ నుంచి ప్రతిబంధకం ఎదురవుతుంది.టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా వుంది.ఏపీలో బీజేపీ,జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది.ఇప్పుడు తెలంగాణలో జరిగే ఉపఎన్నికలో టీడీపీ, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళతాయి. అది తెలంగాణలో బలం పుంజుకుంటున్నామని భావిస్తున్న బీజేపీకి మైనస్ గా మారుతుంది.ఈ పరిణామం కాంగ్రెస్ కు లాభిస్తుంది.అందుకే తెలుగుదేశం విడిగా జూబ్లీహిల్స్ బరిలో దిగే అవకాశాలను రాజకీయ పరిశీలకులు కొట్టిపారేస్తున్నారు. టీడీపీ నిజంగా ఇక్కడి నుంచీ పోటీ చేయాలని భావిస్తే బీజేపీ బరిలో నుంచి తప్పుకొని ఎన్డీఏ తరుపునే టీడీపీ అభ్యర్ధిని రంగంలో దించాల్సి వస్తుంది.దానికి తెలంగాణ బీజేపీ నేతలతో పాటు జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనల పైన మూడు పార్టీల అధినాయకత్వం చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది.అయితే బీజేపీ సైతం ఇక్కడ నుంచి దీపక్ రెడ్డిని పోటీలో దింపాలని భావిస్తోంది.గోపీనాథ్ మరణం సమయంలో మాగంటి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రి లోకేష్ పరామర్శించించడం కూడా అనుమానాలను ఎక్కువ చేశాయి.తెలంగాణలో టీడీపీకి భారీగా మద్దతుదారులు వున్నాఅధిష్టానం మాత్రం సరిగా ఫోకస్ పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
జూబ్లీహిల్స్ సీటుపై కాంగ్రెస్ కన్ను
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరుతామన్నధీమాను అధికార కాంగ్రెస్ కనబరుస్తోంది.కంటోన్మెంట్ ఉపఎన్నిక తరహాలో ఇక్కడ కూడా పాగా వేయడానికి కసరత్తు చేస్తోంది.ఇప్పటికే ఈ స్థానంలో పరిస్థితుల అధ్యయనం,నిర్ణయాల కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ తో సీఎం రేవంత్ ఒక కమిటీ ఏర్పాటు చేసారు.ఈ బైపోల్ లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటింగ్ కీలకం కావడంతో ఎంఐఎంతో అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవటం ఖాయంగా కాంగ్రెస్ భావిస్తోంది.ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఎంఐఎం పోటీకి దూరంగా వుండి కాంగ్రెస్ కు మద్దతిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్తో ఉన్న సఖ్యత,ఈ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్తో కలిసి పనిచేయడం లాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకే మద్దతు ఇవ్వొచ్చన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.
సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు
ఇప్పటికే రెండుసార్లు గెలిచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి గెలుపు తమదే అంటోంది బీఆర్ఎస్ .మాగంటి గోపీనాధ్ కుటుంబం నుంచే ఎవరినైనా పోటీకి దింపితే సానుభూతి ఓట్లు కలిసి వస్తాయని బీఆర్ఎస్ యోచిస్తోంది. నియోజకవర్గంలో గోపీనాధ్ కు వున్న ఫాలోయింగ్ ఆయన కుటుంబసభ్యులకు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు.అయితే రావుల శ్రీధర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు.ఎంఐఎం అభ్యర్థి కూడా బరిలో ఉన్నా మాగంటి గోపీనాథ్ 16 వేల 337 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. ఈ సారి కూడా మూడు పార్టీలకు జూబ్లీహిల్స్ కీలకంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం లో వుంది కాబట్టి ఉప ఎన్నికలో తమకే గెలుపు అవకాశాలు ఎక్కువంటున్నారు హస్తం పార్టీ నేతలు.జూబ్లీహిల్స్ ధనిక ప్రాంతమైనా, మొత్తం నియోజకవర్గ పరంగా చూసుకుంటే బస్తీల ప్రాబల్యం ఎక్కువ. ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా కీలకం. గులాబీ పార్టీ సిట్టింగ్ సీటు నిలుపుకుంటుందా? లేక హస్తగతం అవుతుందా ?అనూహ్య పరిణామం ఎదురవుతుందేమో చూడాలి.
Next Story