అధికారం ఉంటేనే ఉంటారా?  రాలిపోతున్న గులాబీ రేకులు!
x
రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు (ఫైల్ ఫోటో)

అధికారం ఉంటేనే ఉంటారా? రాలిపోతున్న గులాబీ రేకులు!

అధికారం ఉంటేనే ఉంటారా.. లేకుంటే ఉండరా? రాజకీయాల్లో ఇదే ఇప్పటి ట్రెండా.. పాపం కేటీఆర్‌, హరీశ్‌రావ్‌, కవిత ఎంతగా కట్టడి చేయాలని చూస్తున్నా కుదరదా?


తెలంగాణలో 'కారు' దిగేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గెలిచిన వాళ్లు, గెలవని వాళ్లు, ఇప్పటికే పదవుల్లో ఉన్న వాళ్లు, అవిశ్వాసం తీర్మానాలతో వైదొలిగే వాళ్లు.. ఇలా రకరకాలుగా.. వేర్వేరు సాకులతో అనేక మంది గులాబీ నేతలు బీఆర్‌ఎస్‌ నుంచి తప్పుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచి కట్టుదాటకుండా, కారు దిగకుండా మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, టి.హరీశ్‌ రావు రోజుకో సభ పెడుతున్నా గులాబీ దళాలు రాలిపోతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారుతోంది. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎంను కలువగా.. తాజాగా రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల వరుసల భేటీలు గులాబీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

శరవేగంగా మారిపోతున్న పరిణామాలు...

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు దఫాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే.. 2014, 2018 ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ అనుసరించిన విధానాలనే.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కూడా అనుసరిస్తారా అన్న చర్చ సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఫోకస్‌ పెట్టిందన్న ప్రచారం నడుస్తోంది. గులాబీ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే... నియోజకవర్గాల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి స్వయంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఇవన్నీ దేనికి సంకేతాలు...

కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అయితే.. వారంతా కాంగ్రెస్‌లో చేరుతారన్న చర్చ జోరందుకోవడంతో.. కేవలం నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించేందుకే కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. అంతకుముందే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌.. స్వామిగౌడ్‌తో పాటు ప్రకాశ్‌గౌడ్‌ ఇంటికి కూడా వెళ్లి భేటీ అయ్యారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది.

అదే దారిలో తీగల కూడా...

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినా.. అది సాధ్యం కాలేదు. తాజా భేటీతో కృష్ణారెడ్డి హస్తం పార్టీలో చేరిపోనున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీపై ప్రకాశ్‌గౌడ్‌ క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మాత్రమే సీఎంను కలిశానని.. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అవిశ్వాసాలతో మున్సిపాలిటీలు హస్తగతం కావడం.. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతల వరుస భేటీలతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

Read More
Next Story