ఆ ఆరుగురికి క్యాబినెట్ యోగం దక్కేనా?
x
తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఆ ఆరుగురికి క్యాబినెట్ యోగం దక్కేనా?

క్యాబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 మందితో కొలువు తీరిన ప్రభుత్వం, మరో ఆరుగురిని ఎంపిక చెయ్యాల్సి వుంది.


కేబినేట్ విస్తరణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆ ఆరుగురిని ఎంపిక చేసేందుకు అధిష్టానం వద్దకు వెళ్ళేందుకు సమాయత్తమయ్యారు. ఇవ్వాళో, రేపో ఢిల్లీ వెళ్లి క్యాబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లోకి తీసుకునే నేతలపై కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ పదవులూ భర్తీ చేస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. పదవులు భర్తీ చేయడం ద్వారా నేతలు మరింత సమర్థంగా పనిచేస్తారని సీఎం ఆలోచన.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను కొనసాగించి.. లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రేవంత్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్‌ విస్తరణకు రేవంత్‌ హైకమాండ్‌ అనుమతి కోరారు. తన కేబినెట్‌లోకి టీజేఎస్‌ అధినేత, తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ సారథిగా ఉన్న కోదండరామ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే కేబినెట్‌ విస్తరణ చేపట్టే అవకావం ఉంది.

సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో, పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలను హైకమాండ్‌ అనుమతితో అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్‌ పెట్టారు. అందులో హోం శాఖతోపాటుగా విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్‌ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

తెలంగాణ మంత్రివర్గాన్ని ఈనెలాఖరున విస్తరించే అవకాశం ఉంది. నామినేటెడ్‌ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను తీసుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో కోదండరామ్‌ను మత్రిని చేసి విద్యాశాఖను అప్పగించాలని సీఎం రేవంత్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

జేఏసీ నేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్‌ఎస్‌పై నైతికంగా పైచేయి సాధించవ్చని రేవంత్‌ భావిస్తున్నారు. ఇక, మిగిలిన 5 మంత్రి పదవుల్లో షబ్బీర్‌ అలీకి ఒకటిఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం బ్రదర్స్‌ మధ్యే పోటీ నెలకొంది.

చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్‌ కేబినెట్‌ బెర్త్‌ కోసం సోనియాను కలిశారు. రేవంత్‌ తనకు అవకాశం ఇస్తారని వివేక్‌ నమ్మకంతో ఉన్నారు. ఇక నిజామాబాద్‌ నుంచి బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా కేబినెట్‌ ఛాన్స్‌ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవలేదు. అయినా మైనారిటీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌ను మంత్రిని చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే షబ్బీర్‌ అలీ, ఫిరోజ్‌ఖాన్‌లలో ఒకరికి మాత్రమే మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉంది.

Read More
Next Story