
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
‘‘కొత్తగా కులగణన చేయాలని హైకమాండ్ ఆదేశించింది’’
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్
కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటక ప్రభుత్వానికి కొత్త కులగణన నిర్వహించాలని ఆదేశించిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం తెలిపారు.
‘‘కుల సర్వేకు సంబంధించినంత వరకూ విషయాలు అందరికీ తెలిసేలా చూసుకోవాలని హై కమాండ్ ముఖ్యమంత్రి, నన్ను ఆదేశించారు’’ అని శివకుమార్ చెప్పారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి మంగళవారం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
అందరికి న్యాయం జరిగేలా చూసుకోండి
2015 లో కుల సర్వేలో అనేకమంది మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక అంశాలను లేవనెత్తిన తరువాత కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఎవరూ విస్మరించబడ్డారని భావన రాని విధంగా సర్వే చేయాలని పేర్కొంది.
గతంలో జరిగిన కుల సర్వేలో తమను జాబితాలో చేర్చలేదని భావించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం కొత్త అవకాశం ఇస్తుందని, రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చించి, ప్రణాళిక వేసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తుందని శివకుమార్ అన్నారు.
2015 కుల సర్వే..
కర్ణాటకలో చివరిసారిగా కుల సర్వే 2015 లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా డేటాను సమర్పించారు.
సమాజంలోని అనేక వర్గాలు సర్వే ఫలితాలను వివాదం చేశాయి. రాష్ట్రంలోని వొక్కలిగ, లింగాయత్ నాయకులు తమ వర్గాలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఉందని అన్నారు.
సామాజిక ఆర్థిక, విద్యా పారామితుల ఆధారంగా కులాల పునర్విభజనను ప్రస్తుత ఐదు వర్గాలకు బదులుగా ఆరు వర్గాలు ఉండాలని, అత్యంత వెనకబడిన వర్గం 1 లోని కులాలకు క్రిమీలేయర్ విధానం నుంచి మినహాయింపును తొలగించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
Next Story