ఇపుడు బెంగళూర్ సన్సేషన్ ఈ  తెలుగమ్మాయి సౌమ్యారెడ్డి
x

ఇపుడు బెంగళూర్ సన్సేషన్ ఈ తెలుగమ్మాయి సౌమ్యారెడ్డి

బెంగళూర్ సౌత్ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన సౌమ్యారెడ్డి ఫెడరల్ తో మాట్లాడారు. ఈ సారి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి రెండు రికార్డులు సృష్టిస్తా అని చెబుతున్నారు.


కర్నాటకలో ఈ సారి మోదీ వేవ్ లేదని, బెంగళూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి అంటున్నారు. ప్రధాని మోదీ తప్పుడు వాగ్దానాలతో ఓటర్లను మోసం చేసి, భ్రమల్లోకి తీసుకెళ్తున్నారని, అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనేది తప్పని అన్నారు. జూన్ 4న అన్నింటికి సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. సౌమ్యారెడ్డి ఫెడరల్ కర్ణాటకకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివిన సౌమ్యారెడ్డి సీనియర్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. 2018 నుంచి 2023 వరకు జయనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ తేడాతో ఓడిపోయింది. అయితే ‘తాను ఎన్నికల్లో దాదాపు విజయం సాధించానని చెప్పిన సౌమ్య.. తిరస్కరణకు గురైన ఓట్ల లెక్కింపు తన ఓటమికి కారణమైందని అన్నారు. ఆ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరిందని, దీనిపై పెద్దగా మాట్లాడలేనని చెప్పారు.
“కానీ, నేను కోర్టులో గెలిచినా, నేను లోక్‌సభ సభ్యత్వాన్ని నిలుపుకుంటాను. నేను లోక్‌సభలో కర్ణాటక సమస్యలను లేవనెత్తాలి. కన్నడిగులకు న్యాయం చేయాలి. కర్నాటకపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫస్ట్ ఛాయిస్ లోక్‌సభ’’ అని చెప్పారు.
బెంగళూరు సౌత్ నియోజకవర్గ ఓటర్లు తనను ఆశీర్వదిస్తే రెండు విధాలుగా రికార్డు సృష్టిస్తానని ఆమె విలేకరులతో అన్నారు. మొదటిది.. తొమ్మిదోసారి ఈ నియోజకవర్గంలో గెలవాలనుకుంటున్న బీజేపీ ఆధిపత్యానికి ముగింపు పలకడం, రెండవది బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా ఎంపీగా అవతరించినట్లు అవుతుందని అన్నారు.
‘‘ఈ నియోజకవర్గంలో గత 73 ఏళ్లలో జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా ఎన్నిక కాలేదు. ఇప్పుడు మార్పు అవసరం. మార్పు మొదలవుతుంది, ”అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెడరల్ కర్ణాటక సౌమ్యను ఆమె లక్కసంద్ర నివాసంలో కలుసుకున్నారు. మమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమాపణ చెప్పి మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఇంటర్వ్యూ నుంచి సారాంశాలు:
బీజేపీకి కంచుకోటగా భావించే బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటి?
నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన జయనగర్ నియోజకవర్గం కూడా ఈ లోక్‌సభ నియోజకవర్గం కిందకే వస్తుంది. ప్రస్తుత ఎంపీ ఇక్కడి ప్రజలను పట్టించుకోకపోవడంతో నేను పోటీలోకి దిగాను. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు, వారి కష్టాలు తీర్చేందుకు ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నాను. ఇప్పుడున్న ఎంపీ రాష్ట్రం కోసం గొంతు ఎత్తలేదు, రాష్ట్ర కష్టాలపై స్పందించలేదు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన పన్నుల వాటాలకు సంబంధించి ఆయన మాట్లాడలేదు. కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టే పనిమాత్రం చేశాడు. అందుకే ఇప్పుడు నియోజకవర్గం అంతా నావైపే చూస్తోంది.
అంతేకాకుండా పార్టీ నాపై నమ్మకం ఉంచింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌కు చెందినవారే. ఇది నా పోరాటం మాత్రమే కాదు, మా పోరాటం అంటూ నా కోసం పని చేస్తున్నారు. నేను గెలిచి నియోజకవర్గ ప్రజలకు, కర్ణాటక ప్రజలకు న్యాయం చేస్తానని నమ్ముతున్నాను.
కాంగ్రెస్ హామీలు ఈ ఎన్నికల్లో మీరు ఆశించినంత ప్రభావం చూపుతాయని భావిస్తున్నారా?
కచ్చితంగా ప్రభావం చూపుతాయి. బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో గార్మెంట్ పరిశ్రమల్లో పని చేసే అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారి జీతం పదివేలు మాత్రమే. అందులో బస్ పాస్ కోసం ₹1,500 చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బును పొదుపు చేసి పిల్లల చదువుల కోసం వినియోగిస్తున్నారు. ఆడపిల్లలు స్వయం సమృద్ధిగా ఉండకూడదా? వారు డబ్బు కోసం మరొకరి దగ్గర చేయి చాచాల? మహిళా సాధికారత అనేది కేవలం ఒకప్పటి మాటలు మాత్రమే. కానీ నేడు అది వాస్తవం.
ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ హామీలన్నీ మహిళలకు సాధికారత కల్పిస్తున్నవే. మహిళలు స్వయం సమృద్ధి సాధించడం బీజేపీకి ఇష్టం లేదు. ఆడపిల్లలు నన్ను పార్లమెంట్‌లో తమ న్యాయవాదిగా చూస్తారని నేను నమ్ముతున్నాను. నేను అలా చేయగలనని నమ్మకం నాకు కూడా కలిగింది.
మీరు ఎంపీ అయితే బెంగళూరు దక్షిణ నియోజకవర్గం ఓటర్లు మీ నుంచి ఏం ఆశించవచ్చు?
నేను ఎంపీని అయితే బెంగళూరు నగరం కోసం కలిసి పని చేస్తాను. నాకు పర్యావరణ స్పృహ ఉంది. ట్రాఫిక్ రద్దీ పౌరుల ఆరోగ్యంపై ప్రభావం గురించి ఎవరూ మాట్లాడరు. కాబట్టి, ఈ రద్దీని తగ్గించడానికి రవాణా ను సులభతరం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించి గ్రీన్‌ మ్యాప్‌ సిద్ధం చేశాను. బెంగళూరు ఉద్యానవన నగరమని నిరూపిస్తాను, హరిత బెంగళూరు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాను.
బెంగళూరులో తాగునీటి సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తాను. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. దాని కోసం నేను పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తడానికి, కర్ణాటకకు న్యాయమైన వాటాను అడగడానికి వెనుకాడను.
సాధారణంగా, ఎన్నికైన ఎంపీలు అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఇది మీ ప్రత్యర్థికి వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారా?
కోవిడ్ సమయంలో ఈ నియోజకవర్గ ఎంపీ ప్రవర్తించిన తీరు, ఆయన విడుదల చేసిన రిపోర్ట్ కార్డ్‌లో వారు చెప్పిన అబద్ధాల గురించి ప్రజలకు తెలుసు. గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ సొసైటీ కేసులో సీబీఐకి అప్పగించాలని కోరాం. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీబీఐకి అప్పగించారు. మూడు నెలలు గడిచినా సీబీఐ నుంచి ఎలాంటి చర్యలు లేవు.
కేంద్ర ప్రభుత్వం ఎవరికి రక్షణ కల్పిస్తోంది? ఎంపీలు ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నారు? డిపాజిటర్లు డబ్బులు పోగొట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కణ్వ సౌహార్ద కోఆపరేటివ్ సొసైటీ, శ్రీ వసిష్ఠ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్ల కథ కూడా ఉంది. విచారణ లేదు. దీంతో చాలా మంది డిపాజిటర్లు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటివన్నీ ప్రజలు క్షమిస్తారనే నమ్మకం లేదు.
Read More
Next Story