యడియూరప్పపై కేసు పెట్టిన మహిళ మృతి
x

యడియూరప్పపై కేసు పెట్టిన మహిళ మృతి

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై కేసు పెట్టిన మైనర్ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు పోస్టుమార్టం చేయించు నున్నారు.


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పపై కేసు పెట్టిన మైనర్ బాలిక తల్లి (45) ఆదివారం రాత్రి బెంగళూరులోని ఆసుపత్రిలో చనిపోయారు.

శ్వాసకోశ సమస్యలతో హుళిమావు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయిందని, పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో యడియూరప్ప (81)పై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళ, ఆమె కూతురు ఒక మోసం కేసుకు సంబంధించి సహాయం కోరేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తె లైంగిక వేధింపులకు గురైందని పోలీసులకు చెప్పడంతో యడ్యూరప్పపై పిల్లల రక్షణ చట్టం, 2012 (పోక్సో) సెక్షన్ 8, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354A కింద కేసు కట్టారు.

కాగా హోంమంత్రి జి.పరమేశ్వర ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. బాలిక తల్లి అందించిన వీడియోలోని వాయిస్‌తో పోల్చడానికి యడ్యూరప్ప వాయిస్ నమూనాను CID సేకరించింది. మరోవైపు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ మహిళ కోరారు.

సీఐడీ చట్టాన్ని ఉల్లంఘిచి, యడియూరప్పకు కాపాడుతోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆయనను అరెస్టు చేయకపోగా.. గతంలో జరిగిన కేసులకు సంబంధించిన ఆధారాలను సీఐడీ నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సీఐడీని అభ్యర్థించింది.

Read More
Next Story