
2003 బీహార్ ఓటర్ల జాబితా సమర్పించండి..
ఎలక్షన్ కమిషన్ను కోరిన సుప్రీంకోర్టు..
బీహార్(Bihar)లో ఎన్నికల కమిషన్(EC) చేపట్టిన ఓటరు జాబితా సవరణ(SIR)పై ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియపై స్టే విధించాలని కొంతమంది ఎంపీలు సుప్రీంకోర్టు(Supreme court)లో పిటీషన్లు కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుపుతోన్న జస్టిస్ సూర్యకాంత్, జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం..2003లో బీహార్లో ఓటరు జాబితా సవరణ చేపట్టినపుడు ఏ పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారో చెప్పాలని భారత ఎన్నికల సంఘం గురువారం (ఆగస్టు 14) కోరింది.
SIRకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన ఒక వర్గం తరపు న్యాయవాది నిజాం పాషా కోర్టులో వాదిస్తూ.. "2003లో బీహార్లో ఈసీ ఓటరు జాబితా సవరణ చేసింది. ఆ తరువాత ఓటర్ కార్డు (EPIC)లను జారీ చేసింది. తాజాగా ఎస్ఐఆర్ చేపట్టింది. దీంతో అప్పట్లో జారీ చేసిన కొన్ని ఓటరు కార్డులు చెల్లకుండా పోయాయి. ఇంటెన్సివ్, SIR నమోదు ప్రక్రియ ఒకేలా ఉంటే..అంతకు ముందు జారీ చేసిన ఎపిక్ కార్డులను ఎలా విస్మరిస్తారు. పైగా ఓటరు నమోదు ఫారం పూరించిన తరువాత ఈసీ ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. అందువల్ల బూత్ స్థాయి అధికారులకు అప్పర్ హ్యాండ్ అవుతుంది,’’ అని వాదించారు.
మరో పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది షోబయ్ ఆలం.. ఈసీ నోటిఫికేషన్లో కనిపించిన 'సమ్మరీ', 'ఇంటెన్సివ్' పదాల గురించి మాట్లాడారు. "ఇది (ఎస్ఐఆర్) ఓటరు నమోదు ప్రక్రియ మాత్రమే. అనర్హత ప్రక్రియ కాదు. ఇది స్వాగతించాల్సినది. దీనిని స్వాగతించని ప్రక్రియగా మార్చకూడదు" అన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బీహార్లో చేపట్టిన 'ఎస్ఐఆర్' ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.