బిల్కిస్ బానో కేసులో దోషుల పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
x

బిల్కిస్ బానో కేసులో దోషుల పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరుచేసింది. 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. ఈక్రమంలో బానో సుప్రీం తలుపుతట్టారు.


బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులు రాధేశైమ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రెమిషన్‌(శిక్ష తగ్గింపు) వచ్చేవరకు తమకు బెయిల్‌ మంజూరుచేయాలని దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్‌ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్‌ చేస్తారని ప్రశ్నించింది. కాగా దోషుల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా వాదనలు వినిపించారు.

2002లో ఘటన..

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో పెద్దఎత్తున చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని ఈనెల 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.

Read More
Next Story