
ఘటనా స్థలంలో దొరికిన బ్లాక్ బాక్స్..
విమానాల భద్రతను తనిఖీ చేయాలన్ని కేంద్రం హోం మంత్రి అమిత్ షా..
గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ప్రాంతం నుంచి బ్లాక్ బాక్స్ (Black box)ను కనుగొన్నారు. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) వెల్లడించింది.
ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత విమాన ప్రమాదం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది.
బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం..
బ్లాక్ బాక్స్లో విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్పిట్ ఆడియో వంటి కీలక సమాచారం ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్లు కూడా ఇందులో ఉంటాయి. నాణ్యమైన ఉక్కు, టైటానియంతో తయారుచేసిన ఈ బ్లాక్ బాక్స్లో డేటా సురక్షితంగా ఉంటుంది.
265 మంది మృతి..
సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. 38 ఏళ్ల రమేష్ విశ్వకుమార్ అనే బ్రిటీష్ ఇండియన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అమిత్ షా సమీక్ష సమావేశం..
విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అత్యవసర సమావేశం నిర్వహించారు. ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి (ఎంఓఎస్) మురళీధర్ మొహోల్ కూడా పాల్గొన్నారు. విమానాల భద్రతను కూడా పరిశీలించాలని ఆయన సూచించారు. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందజేస్తామని షా చెప్పారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్స్ రూ. కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది.