![ఎవడీ నైజీరియన్ డ్రగ్ స్మగ్లర్? హైదరాబాద్ లో ఎలా దొరికిపోయాడు? ఎవడీ నైజీరియన్ డ్రగ్ స్మగ్లర్? హైదరాబాద్ లో ఎలా దొరికిపోయాడు?](https://telangana.thefederal.com/h-upload/2024/02/13/430158-screenshot-2024-02-13-105720.webp)
ఎవడీ నైజీరియన్ డ్రగ్ స్మగ్లర్? హైదరాబాద్ లో ఎలా దొరికిపోయాడు?
ఒక్క హైదరాబాద్ లోనే ఎవరైతేనేం ఐదు వందలకు పైగా డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారా!.. మరి తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఉంది ఉన్నట్టు?
ఒక్క హైదరాబాద్ లోనే ఎవరైతేనేం ఐదు వందలకు పైగా డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారా!.. మరి తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఉంది ఉన్నట్టు? వీళ్లు కొరియర్ సర్వీస్ ద్వారా కూడా డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ మహానగరంలో పూటకో చోట భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి.
తాజాగా రాజేంద్రనగర్ లో పెద్ద ముఠాయే పోలీసులకు చిక్కింది. వస్త్ర వ్యాపారం పేరిట ఇండియాకు వచ్చి.. డ్రగ్ పెడ్లర్గా మారిన నైజీరియన్ గ్యాంగులతో పాటు అనేక మంది ఆటకట్టించినా దొడ్డిదోవన మాదక ద్రవ్యాల వ్యాపారం సాగుతోంది. గోవా కేంద్రంగా కొందరు, ముంబై, పూణే కేంద్రంగా ఇంకొందరు డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ముఠాల నుంచి దాదాపు వంద కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ సర్వీసుల ద్వారా దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాలకు, వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయో ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఈ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో హుక్కా పార్లర్లను నిషేధించింది.
నైజీరియా వాళ్లే ఎందుకు డ్రగ్స్ అమ్ముతారు?
దేశవ్యాప్తంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నేరగాడిని టీన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ... ఉత్తర గోవాలోని కండోలింలో నివాసముంటూ ఈ మత్తు దందా కొనసాగిస్తున్నాడు. కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ను గోవా నుంచి హైదరాబాద్కు చేరుస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద డ్రగ్స్తో పట్టుబడ్డ ఇద్దరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. కీలక నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.
ఎవరీ నైజీరియన్ స్టాన్లీ...
2009లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడు స్టాన్లీ.. ప్రారంభంలో క్లాత్ బిజినెస్ చేశాడు. కరోనా సమయంలో నష్టాలు రావడంతో పాస్పోర్టు గడువు తీరినా ఇక్కడే ఉండిపోయారు. దీంతో జైలుకు వెళ్లి వచ్చిన స్టాన్లీ.. డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించే పలువురు నైజీరియన్లతో చేతులు కలిపాడు. తొలుత కొందరు డ్రగ్ పెడ్లర్లకు సహాయంగా ఉంటూ డబ్బులు సంపాదించాడు. ఆ తర్వాత ఇతర నైజీరియర్లు తమ స్వస్థాలకు వెళ్లిపోవడంతో ఈ దందాను తన చేతుల్లోకి తీసుకున్నాడు స్టాన్లీ. విదేశాల నుంచి ఇండియాకు అక్రమంగా మత్తు పదార్థాలు తెప్పించి.. కొరియార్ సర్వీసుల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయాలు జరుపుతున్నాడు.
తొలిసారి ఎప్పుడు చిక్కాడంటే...
2017లో తొలిసారి స్టాన్లీని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత.. తాజాగా హైదరాబాద్లో పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి సుమారు 8 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్టాన్లీ దేశవ్యాప్తంగా 500 మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించిన పోలీసులు... అందులో హైదరాబాద్కు చెందిన వారు కూడా ఉన్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు టీ న్యాబ్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నగరంలోని పబ్బులు, బార్లపై నిరంతర నిఘా పెట్టిన పోలీసులు.. ఎక్కడికక్కడ డ్రగ్స్ విక్రయదారుల ఆట కట్టిస్తున్నారు.
హుక్కా పార్లర్లపై వేటు సాధ్యమేనా?
రాష్ట్రంలో మత్తు పదార్థాలను విక్రయించేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన బాధితుల కోసం విముక్తి కేంద్రాలను (డీఅడిక్షన్ సెంటర్లు) ఏర్పాటు చేయబోతున్నారు. డ్రగ్స్పై కఠినచర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నార్కోటిక్స్ బృందాలు ఏర్పాటు కానున్నాయి. హుక్కా పార్లర్లపై నిషేధం, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించడం సంతోషమే. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే దీనికి అర్థం ఉండదు.
‘‘హుక్కా పార్లర్లు యువత, విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.. అత్యధిక పొగతో ఇతరులకూ ఇబ్బంది ఏర్పడుతోంది. ఒక గంట హుక్కాతో 200 సిగరెట్ల పొగ వస్తుంది. దీనికి అలవాటు పడినవారితో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా పాడవుతోంది. మత్తు పదార్థాలపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం హుక్కా పార్లర్లను నిషేధించాలని బిల్లు తీసుకువచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్ (ఈ)-సిగరెట్లను 2019లో నిషేధించారు. ఇప్పటికీ ఇంకా ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని ఉల్లంఘించేవారికి ఏడాది నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది’’ అని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు. మరి కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు, సిగరెట్ల విక్రయాలపై ఉక్కుపాదం మోపేదెవరు? పాన్ మసాలాల పేరుతో గుట్కాలు, డ్రగ్స్ వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువత బాధితులుగా మారుతున్నారు. వీటన్నింటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.