ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల వ్యాఖ్యలపై టీఎంసీ మంత్రి కౌంటర్..
x

ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల వ్యాఖ్యలపై టీఎంసీ మంత్రి కౌంటర్..

‘దుర్ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. ఇతర పార్టీలతో కలిసి టీఎంసీపై బురద చల్లాలని చూస్తోంది.’ - టీఎంసీ మంత్రి పంజా


కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు చేసిన వ్యాఖ్యలను పోలీసులు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో రకరకాలు వీడియోలు వైరల్ కావడంపై TMC సీనియర్ నాయకురాలు, మంత్రి శశి పంజా స్పందించారు.

‘‘మా కూతురి మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయడం ద్వారా పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని భద్రపరచాలని కోరినా.. దహన సంస్కారాలకు బలవంతం చేశారు. మృతదేహాన్ని తమకు అప్పగించేటప్పుడు ఓ సీనియర్ పోలీసు అధికారి లంచం ఇచ్చేందుకు వచ్చాడు.

సుమారు 300-400 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. ఉద్రిక్త పరిస్థితుల్లో కూతురిని దహనం చేయవలసి వచ్చింది. కొంతమంది పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై తన సంతకం కోసం ప్రయత్నించారు.’’ అని బాధితురాలు తల్లిదండ్రులు బుధవారం రాత్రి ఆర్‌జి కర్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు చెప్పారు.

ఆ ఆరోపణలు అవాస్తవం..

తల్లిదండ్రుల కొత్త వీడియోలో చేసిన ఆరోపణలు అబద్ధమని TMC సీనియర్ నాయకురాలు, మంత్రి శశి పంజా పేర్కొన్నారు. “సంఘటన తర్వాత ఒక పోలీసు అధికారి తల్లిదండ్రులకు డబ్బు ఆఫర్ చేసినట్లు నిన్న ఒక వీడియో వైరల్ అయ్యింది. అది అబద్ధమని, తమ కుమార్తెకు న్యాయం జరిగితే చాలని కోరుకుంటున్నట్లు చెప్పిన వీడియో కూడా పబ్లిక్ డొమైన్ లో కనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు.

“బాధితురాలి తల్లిదండ్రులు దుఖంలో ఉన్నారు. వారి బాధను అర్థం చేసుకోగలం. ఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. మేము అందరం బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. తల్లిదండ్రులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని కోరుతున్నా' అని పంజా పేర్కొన్నారు.

బీజేపీ రాజకీయం చేస్తోంది

‘దుర్ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. ఇతర పార్టీలతో కలిసి టీఎంసీపై బురద చల్లాలని చూస్తోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ చారిత్రాత్మక అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది’ అని పంజా

గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నవి "నకిలీ" వీడియోలని, వాటిని BJP IT సెల్ విభాగం పోస్టు చేస్తుందని ఆరోపించారు. బాధితురాలికి అన్యాయం జరిగిందంటూ..పోస్ట్‌మార్టం నివేదికను సోషల్ మీడియాలో ప్రసారం చేయడాన్ని కూడా ఖండించారు. సీబీఐ విచారణను వేగవంతం చేసి దోషులను తేల్చాలని కోరారు. "తృణమూల్ కాంగ్రెస్‌తో సహా ప్రతి ఒక్కరూ న్యాయం కోసం ఎదురుచూస్తున్నపుడు.. రాజకీయాలు చేయడం సరికాదు. మేం కూడా దోషులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాం" అని పంజా పేర్కొన్నారు.

సీబీఐ విచారణలో పురోగతి లేదు

‘‘23 రోజుల క్రితం కోల్‌కతా పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీబీఐకి అందజేశారు. అయినా వారి దర్యాప్తులో ఎలాంటి పురోగతిని లేదు.’’ అని పశ్చిమ బెంగాల్ విద్యా మంత్రి సీనియర్ టిఎంసి నాయకుడు బ్రత్యా బసు అన్నారు. సీబీఐ దగ్గర పారదర్శకత లోపించదని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేశామని బీజేపీ చెబుతోంది. అసలు అవి ఏ సాక్ష్యాలు బయటపెట్టాలి." అని గట్టిగా ప్రశ్నించారు.

వైద్యుల ఆందోళనకు టీఎంసీ మద్దతు

వైద్యుల ఆందోళన సమంజసమని జూనియర్ డాక్టర్లకు పంజా మద్దతు తెలిపారు. అయితే కేసు కొలిక్కి వచ్చాక తిరిగి వారు విధులకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కేసును టీఎంసీ ప్రభుత్వం ఎలా క్లోజ్ చేయాలనుకుందో బాధితురాలి కుటుంబం చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతోందని పశ్చిమ బెంగాల్ బీజేపీ పేర్కొంది. ‘కేసు క్లోజ్ చేయడానికి టీఎంసీ ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేసింది. బాధిత కుటుంబం బయటకు వచ్చి చెప్పడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి’ అని బీజేపీ ఎంపీ సమిక్ భట్టాచార్య పేర్కొన్నారు.

Read More
Next Story