
‘అర్బన్ నక్సలిజం’పై మోదీ ఆందోళన..
అర్బన్ నక్సలిజాన్ని పార్టీలు సపోర్టు చేస్తున్నాయా? కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయా? ఏ పార్టీనుద్దేశించి ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు?
అడవుల్లో నక్సలిజం(Naxalism)క్రమేణా తగ్గుముఖం పడుతోందని..అయితే పట్టణాలు, నగరాల్లో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం రిపబ్లిక్ ఛానల్ నిర్వహించిన ప్లీనరీలో ఆయన మాట్లాడారు.
వంద నుంచి 24 జిల్లాలకు..
‘దేశంలో నక్సలిజం అంతిమ దశలో ఉంది. గతంలో 100 జిల్లాలు నక్సల్స్వల్ల ప్రభావితమయ్యేవి. ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య రెండు డజన్లకు తగ్గింది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్లే ఇది సాధ్యమైంది. ఒకవైపు అడవుల నుంచి నక్సలిజాన్ని క్రమంగా నిర్మూలిస్తుంటే.. మరోవైపు అర్బన్ నక్సలిజం(Urban Naxals) నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. ఇది కొత్త సవాళ్లు విసురుతోంది. గతంలో అర్బన్ నక్సల్స్ను వ్యతిరేకించిన ఒక పార్టీ.. ప్రస్తుతం వారిని వెనకేసుకొస్తోంది. అటువంటి పార్టీల నీడన వారు సురక్షితంగా ఉన్నారు. ఈ పార్టీల్లో అర్బన్ నక్సల్స్ గొంతులే వినిపిస్తున్నాయి. దీనిని బట్టి వారి మూలాలు ఎంతగా పాతుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు’ అంటూ కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అర్బన్ నక్సల్స్ వల్ల భారత అభివృద్ధి, వారసత్వానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. గత పదేళ్లలో భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, త్వరలో మూడో స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.