
‘ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినా.. శాంతి ఓ విరామం మాత్రమే’
"గాజా సమస్యను పరిష్కారం దొరక్కపోతే రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు మళ్లీ, మళ్లీ జరుగుతూనే ఉంటాయి." - ఎస్. శ్రీనివాసన్, చీఫ్ ఎడిటర్, ది ఫెడరల్.
‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ తాజా ఎపిసోడ్లో.. ది ఫెడరల్ చీఫ్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ వెస్ట్ ఆసియాలో పరిణామాలపై విశ్లేషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్(Israel), ఇరాన్(Iran) మధ్య గత కొన్ని వారాలుగా కొనసాగిన యుద్ధానికి తాత్కాలికంగా తెరపడినా.. అయితే శాంతికి శాశ్వత మార్గం దొరకలేదన్నారు.
అసలు వివాదానికి మూలమేంటి?
2023 అక్టోబర్ 7న హమాస్ చేపట్టిన రాకెట్ దాడులు రెండు దేశాల మధ్య ఘర్షణకు ఆజ్యం పోసింది. ఈ దాడులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దెబ్బతీసి భారీగా ప్రాణనష్టం కలిగించాయి. దీనికి ప్రతిగా హమాస్, హిజ్బొల్లాలకు మద్దతిస్తున్న ఇరాన్ లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గాజాపై దాడులను తీవ్రం చేసింది. ఇజ్రాయిల్కు తోడుగా అమెరికా కూడా రంగంలోకి దిగి ఫోర్డోలోని యూరేనియం వృద్ధికరణ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ (Donald Trump) దీన్ని తమ విజయంగా ప్రకటించినప్పటికీ, అమెరికా(America) ఇంటెలిజెన్స్ మాత్రం ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయలేదని అభిప్రాయపడింది. "యుద్ధంలో విజయం సాధించామని ట్రంప్, నెతన్యాహూ, ఖమేనీ చెప్పుకున్నా.. వాస్తవానికి ఇరాన్ అణుశక్తి పూర్తిగా దెబ్బతిన్నదా? అన్న విషయం ఇంకా సందేహంగానే ఉందని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
పాలస్తీనా సమస్యను పరిష్కరించకుండా ఈ ప్రాంతంలో శాంతి సాధ్యం కాదని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. "గాజా సమస్యను పట్టించుకోకపోతే శాంతి సాధ్యం కాదు. రెండు దేశాలకు మధ్య పరిష్కార మార్గం లేకపోతే..ఇలాంటి దాడులు తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటాయి." అని చెప్పారు.
భారత్కు తాత్కాలిక ఉపశమనం..
ఇరాన్ ద్వారా జరిగే చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలున్నప్పటికీ.. చమురు ధరలు పెద్దగా పెరగలేదు. రష్యా వంటి దేశాల నుంచి భారత్ దిగుమతులు పెంచుకోవడం వల్ల కొంత రక్షణ లభించిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు.