హిందూ పత్రిక జర్నలిస్టు ‘మహేశ్ లాంగా’ పై నమోదయిన కేసు ఏంటీ?
x

హిందూ పత్రిక జర్నలిస్టు ‘మహేశ్ లాంగా’ పై నమోదయిన కేసు ఏంటీ?

ప్రభుత్వ నుంచి వచ్చే ఇన్ ఫుట్ సబ్సిడీని నకిలీ సంస్థలు, పత్రాలు సృష్టించి మహేశ్ లాంగా అని టీమ్ కలిసి దోచుకున్నారని గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు.


కోట్లాది రూపాయల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జిఎస్‌టి) కుంభకోణంలో అరెస్టయిన అహ్మదాబాద్‌కు చెందిన ది హిందూ పత్రికా జర్నలిస్టు మహేష్ లాంగా పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదు. మొత్తం కుంభకోణంపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు లేదు.

ఈ అరెస్ట్ పై హిందూ పత్రిక యాజమాన్యం స్పందించింది. మాకు ఈ అంశంతో సంబంధం లేదని వెల్లడించింది. ఈ అరెస్ట్, జీఎస్టీ కుంభకోణంపై చాలా వివరాలు బాహ్య ప్రపంచానికి అందుబాటులో లేనప్పటికీ కొన్ని వివరాలు ఇక్కడ పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాను.
బోగస్ సంస్థల ఆరోపణ
గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనాలను పొందేందుకు లాంగా తన తండ్రి, భార్య పేరుతో బోగస్ సంస్థలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన మహేశ్ లాంగాతో పాటు మరో ముగ్గురు నిందితులకి కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) చేసిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం (అక్టోబర్ 8) అరెస్టు చేసింది. ఒక రోజు తర్వాత, లాంగా మామ, మాజీ IAS అధికారి, గాంధీనగర్‌లోని అతని నివాసంలో అరెస్టు అయ్యారు. దీనితో ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య ఐదుకి పెరిగింది.
పదమూడు సంస్థలు వాటి యజమానుల ద్వారా ఈ రాకెట్ నడిపించి కొట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని విచారణలో వెల్లడైంది. ఐటీసీ అనేది తుది వినియోగ వస్తువులపై విధించే పన్నుపై, ముడి పదార్థాలకు ఇచ్చే సబ్సిడీ. దీనిలోని లోపాలను ఆసరా చేసుకుని మహేశ్ లాంగా టీమ్ మోసానికి పాల్పడ్డారు.
దాడులు..
అహ్మదాబాద్‌లోని సిఐడి-క్రైమ్ బ్రాంచ్‌లోని ఆర్థిక నేరాల విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలు - అహ్మదాబాద్, జునాగఢ్, సూరత్, ఖేడా, భావ్‌నగర్‌లోని 14 స్థావరాలపై దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. మోసపూరిత లావాదేవీల ద్వారా బోగస్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందడం కోసం ప్రభుత్వాన్ని మోసం చేసే ఉద్దేశ్యంతో బోగస్ సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
" తప్పుడు బిల్లింగ్, మోసపూరిత డాక్యుమెంటేషన్ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని మోసపూరితంగా పొందే లక్ష్యంతో భారీ ఎత్తున కుట్ర జరిగిందని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి" అని క్రైమ్ బ్రాంచ్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
లాంగాపై ఆరోపణలు
"ప్రాథమిక విచారణ తర్వాత, 220 కంటే ఎక్కువ బినామీ (నకిలీ) సంస్థలను నకిలీ పత్రాల ఆధారంగా స్థాపించి, నిందితులు నకిలీ బిల్లుల ద్వారా బోగస్ ఐటీసీని పొందినట్లు తేలింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అజిత్ రాజియన్ ది ఫెడరల్‌తో చెప్పారు.
“చాలా గంటల పాటు ప్రశ్నించిన తర్వాత జర్నలిస్టు మహేష్ లాంగాను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలను ఉపయోగించి లాంగా భార్య, తండ్రి పేరుతో బోగస్ సంస్థల్లో కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు కేంద్ర జీఎస్టీ విభాగం గుర్తించింది. అహ్మదాబాద్‌లోని అతని నివాసం నుంచి మేము 20 లక్షల రూపాయల లెక్కలో చూపని నగదు, గణనీయమైన మొత్తంలో బంగారం, అనేక విలువైన భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నాము, ”అన్నారాయన.
ఎఫ్‌ఐఆర్‌లో లాంగా పేరు ..

ఎఫ్‌ఐఆర్‌లో లాంగా పేరు లేకపోయినా, అతని తండ్రి పలు నకిలీ సంస్థలతో సంబంధాలు ఉన్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలలో నిందితుడిగా ఉన్నాడు. అంతే కాకుండా, అతని బంధువు మనోజ్ కుమార్ లాంగా కూడా అహ్మదాబాద్‌కు చెందిన డిఎ ఎంటర్‌ప్రైజ్ యాజమానులలో ఒకరిగా పేరుంది, ఇందులో లాంగా భార్య భాగస్వామిగా ఉంది.
“ విచారణ తర్వాత, లాంగా భార్యకు లేదా అతని బంధువుకి సంస్థ ఎక్కడ ఉంది. అలాగే వారి పేరు మీద అవి నడుస్తున్నాయనే విషయం తెలియదని వెల్లడైంది. ఆ తర్వాత పోలీసులు లాంగాను విచారించగా, మొత్తం సంస్థ కార్యకలాపాలు అతనే నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇప్పటి వరకు, లాంగా భార్య, కజిన్‌ను అరెస్టు చేయలేదు ” అని రాజయన్ ది ఫెడరల్‌తో చెప్పారు.
“ఎఫ్‌ఐఆర్‌లో లాంగా పేరు లేనప్పటికీ, అతను నిందితుడు కాదని అర్థం కాదు. దర్యాప్తులో ఒక కంపెనీలో అతని పాత్ర బయటపడింది, అందుకే అతన్ని అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం కోర్టు ఆర్డర్ ద్వారా 10 రోజుల కస్టడీకి పంపారు, ”అన్నారాయన.
నంబత్ ప్రకటన
వరుస ట్వీట్లలో, ది హిందూ ఎడిటర్ సురేష్ నంబాత్, ఈ కేసు జిఎస్‌టికి, వార్తాపత్రిక కోసం లాంగా వ్రాసిన ఏ నివేదికతో సంబంధం లేదని తెలిపారు.
"మా జర్నలిస్టులలో ఒకరైన మహేష్ లాంగాను సెంట్రల్ జిఎస్‌టి ద్వారా నమోదైన ఫిర్యాదుపై అహ్మదాబాద్ సిటీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది" అని అతను ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశాడు. "కేసు మెరిట్‌ల గురించి మాకు ఎటువంటి వివరాలు లేనప్పటికీ, ఇది ది హిందూలో ప్రచురించబడిన అతని నివేదికలకు సంబంధించినది కాదని మేము అర్థం చేసుకున్నాము." అని వెల్లడించారు.
" అహ్మదాబాద్‌లో ఉన్న గుజరాత్ కరస్పాండెంట్‌గా ది హిందూ కోసం అతని వృత్తిపరమైన పనిని మేము అభినందిస్తున్నామని మేము ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాము" అని నంబత్ ట్వీట్ చేశారు. "ఎక్కడా ఏ జర్నలిస్టును వారి పని కోసం లక్ష్యంగా చేసుకోలేదని మేము ఆశిస్తున్నాము. దర్యాప్తు న్యాయంగా, త్వరగా జరగాలని మేము ఆశిస్తున్నాము." ట్వీట్ లో పేర్కొన్నారు.
మిగతా నిందితులు ఎవరు?
గుజరాత్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేసింది . వారిలో ఐజాజ్, భావ్‌నగర్ నివాసి.. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులను విక్రయించే కంపెనీలో భాగస్వామి. అబ్దుల్‌ ఖాదర్, చెరకు రసం, రెడీమేడ్ బట్టలు, పరుపులను విక్రయించేవాడు, మరొక వ్యక్తి సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త జ్యోతిష్ మగన్ గొండాలియా.
“ ఫిబ్రవరి 1 నుంచి మే 1, 2023 మధ్య ధృవి ఎంటర్‌ప్రైజ్ అనే సంస్థ ద్వారా మోసం జరిగింది, ఇది ఒకే పాన్ నంబర్ నుంచి మరో ఆరు సంస్థలను సృష్టించారు. వాస్తవంగా చేయని లావాదేవీలను చూపించడం ద్వారా ITCని పొందడం వీరి లక్ష్యం. ఈ మోసంలో చిక్కుకున్న ఇతర సంస్థలలో ఓం కన్‌స్ట్రక్షన్, రాజ్ ఇన్‌ఫ్రా, హరేష్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ డిఎ ఎంటర్‌ప్రైజ్ ఉన్నాయి. బోగస్ బిల్లింగ్, ఆర్థిక పత్రాలను తారుమారు చేయడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను సులభతరం చేసినట్లు విశ్వసిస్తున్నందున ఈ సంస్థల ప్రమేయం చాలా ముఖ్యమైనది” అని ఎఫ్‌ఐఆర్ లో వివరించారు.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతర నిందితులు, తలాలా (జునాగఢ్ జిల్లా) నుంచి బిజెపి ఎమ్మెల్యే భగవాన్ బరాద్ కుమారుడు అజయ్ భగవాన్ బరాద్, అతని మేనల్లుడు విజయ్‌కుమార్ కాలాభాయ్ బరాద్. రమేష్ కాలాభాయ్ బరాద్. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం, ఈ ముగ్గురూ స్కామ్‌లో పాల్గొన్న వెరావల్‌కు చెందిన ఆర్యన్ అసోసియేట్స్‌కు యజమానులుగా ఉన్నారు.


Read More
Next Story