‘షా’ ముందున్న తొమ్మిది సవాళ్లేంటీ? ఎలా పరిష్కరించబోతున్నారు?
x

‘షా’ ముందున్న తొమ్మిది సవాళ్లేంటీ? ఎలా పరిష్కరించబోతున్నారు?

దేశంలో వరుసగా మోదీ మూడోసారి ప్రధానిగా, అమిత్ షా రెండో సారి వరుసగా హోమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ బాధ్యత అనుకున్నంత సులువుగా లేదు..


నరేంద్ర మోదీ దేశంలో వరుసగా మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత అందరూ ఊహించిన విధంగానే, మోదీకి కుడిభుజం అయిన అమిత్ షా తిరిగి భారత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కూడా షా అదే పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు, నార్త్ బ్లాక్ ఆఫీస్‌లో అమిత్ షాకి ఇది రెండవసారి.

నిజానికి, షా దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు సృష్టించడానికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంది. షా కంటే ముందు గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి యాదృచ్ఛికంగా ప్రాతినిధ్యం వహించిన పార్టీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఆరు సంవత్సరాల, 64 రోజులు, కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ బల్లభ్ పంత్, ఆరు సంవత్సరాల, 56 రోజులు ఈ రికార్డు ను తమ పేరు మీద లిఖించుకున్నారు.
పదవిలో కొనసాగడం వల్ల కీలకమైన మంత్రిత్వ శాఖ పని వేగానికి అంతరాయం కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు. షా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ..“మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ భద్రతా కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. దేశ భద్రతను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి, కొత్త విధానాలను ప్రవేశ పెట్టి, భారత్ ను తిరిగి నిర్మిస్తుంది” అన్నారు. నక్సలిజం, టెర్రరిజం, తీవ్రవాదాన్ని అణచడానికి దేశం చుట్టు బలమైన కవచ్చాన్ని నిర్మిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అయితే దేశంలో కొన్ని పరిస్థితులను చూస్తుంటే చెప్పడం సులువు కానీ ఆచరించడం మాత్రం చాలా కష్టమని అనిపిస్తోంది. ఒక సంవత్సరం నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రావణ కాష్ఠం రగులుతూనే ఉంది. శాంతియుత పరిస్థితుల కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. లోక్ సభ ఎన్నికల వేళ కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన తాజాగా జరిగిన అల్లర్లతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఓటింగ్ శాతం పెరిగింది కానీ మూడు రోజుల్లో వరుసగా మూడు ఉగ్రవాద సంఘటనలు జరిగాయి.
ఇద్దరు జూనియర్ మంత్రులు - బండి సంజయ్ కుమార్, నిత్యానంద్ రాయ్ - గత మూడు పర్యాయాలు కంటే తగ్గిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చాకచక్యం గల రాజకీయ నాయకుడికి ఎదురయ్యే సవాళ్ల జాబితా ఇక్కడ ఉంది.
1. J&K అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా పునరుద్ధరణ
గత మోదీ ప్రభుత్వం కాశ్మీర్‌లో శాంతి పరిస్థితులు తిరిగి నెలకొంటున్నాయని చెప్పినప్పటికీ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య నిత్యం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
జూన్ 9న ఢిల్లీలో మోదీ 3.0 ప్రమాణ స్వీకారం జరుగుతుండగా, జమ్మూలోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, అది ఒక కొండగట్టులో పడిపోవడంతో, తొమ్మిది మంది మృతి చెందగా, 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందికి తూటాలు తగిలాయి. పాకిస్తాన్ కు చెందిన లష్కర్ ఏ తోయిబా కు చెందిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ దాడికి బాధ్యత వహించింది. అంతకుముందు నెలలో మే 5 ఆర్మీ కాన్వాయ్ పైకి కూడా దాడికి పాల్పడింది. ఈ సందర్భంగా ఒక అధికారి,నలుగురు జవాన్లు గాయపడ్డారు.
రియాసి దాడికి దగ్గరగా కతువా, దోడాలో భద్రతా దళాలు.. ఉగ్రవాదుల మధ్య రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇక్కడ ఒక CRPF జవాన్ మరణించగా, ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టు బెట్టింది. తీవ్రవాద దాడులను అడ్డుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం ఇక్కడ అంతగా ప్రభావం చూపట్లేదు.
ఈ ఉగ్రవాద దాడులు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ఎందుకంటే ఈ నెల 29న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. అలాగే ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది.
ఇటువంటి పరిస్థితుల మధ్య, సురక్షితమైన అమర్‌నాథ్ యాత్రను చేయడం, అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించడం, ఇతర విషయాలతోపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా బాధ్యతాయుతమైన పనిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంటుంది.
2. మణిపూర్ హింసను..
మణిపూర్ హింసను అరికట్టలేకపోవడం మునుపటి మోదీ ప్రభుత్వంలో పెద్ద వైఫల్యం. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికలలో స్పష్టంగా కనిపించాయి, మణిపూర్ ఎన్‌డిఎకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఓటు వేశారు. మైతేయి ఆధిక్యత ఉన్న ఇన్నర్ మణిపూర్ సీటును బీజేపీ ఓడిపోగా, దాని మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ గిరిజనుల ప్రాబల్యం ఉన్న ఔటర్ మణిపూర్ సీటును కూడా వదిలి పెట్టాల్సి వచ్చింది. ఈ రెండు సీట్లను కాంగ్రెస్ చేతికి చిక్కాయి.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రభుత్వం మణిపూర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాతి, ప్రాదేశిక కలహాలతో దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలని అన్నారు. యువకులను ఉద్దేశపూర్వకంగా చంపడం, మహిళలపై లైంగిక హింస, ఆయుధాలు.. మందుగుండు సామగ్రిని దోచుకోవడం వంటి సంఘటనలు ఇప్పటికి అనేకం ఇక్కడ జరిగాయి. వీటిలో AK-సిరీస్ తుపాకులు, ఆటోమేటిక్ రైఫిల్స్‌తో సహా అనేకం జనం దాడి చేసి దోచుకుపోయారు. వీటి జాడ ఇప్పటికీ గుర్తించబడలేదు.
గత ఏడాది కాలంలో రాష్ట్రాన్ని ఒక్కసారి మోదీ సందర్శించలేదు. హింస చెలరేగిన తరువాత అమిత్ షా రెండు సార్లు మాత్రమే అక్కడ పర్యటించారు. తాజాగా లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం వెళ్లగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది హింస చెలరేగిన తరువాత రాష్ట్ర భద్రతా సలహాదారుగా సీఆర్పీఎఫ్ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్‌ను కేంద్రం నియమించింది. ఇప్పటి వరకు, అకారణంగా చెలరేగిన హింస అక్కడ కాస్త శాంతించినప్పటికీ హత్యలు, ఘర్షణలు, దహనం, దోపిడీలు మాత్రం ఇంకా చెదురుమదురుగా ప్రపంచం దృష్టికి వస్తూనే ఉంది.
తాజా సంఘటనలలో, జూన్ 8 న, జిరిబామ్‌లో రెండు పోలీసు అవుట్‌పోస్టులు, ఒక ఫారెస్ట్ కార్యాలయం, కనీసం 70 ఇళ్లను అల్లరి మూకలు తగలబెట్టారు, దీంతో ఎస్పీని బదిలీ చేశారు. తర్వాత రెండు రోజులకు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ముందస్తు కాన్వాయ్ పై కాంగ్ పోక్పిలో మెరుపుదాడి జరిగింది. ఇక్కడ ఒక సిబ్బంది గాయపడ్డారు.
ఈ దాడుల్లో దాదాపు 60 వేల మంది ప్రజలు స్థాన భ్రంశం చెందారు. 220 మంది మరణించారు. దీనిపై షా తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
3. ఖలిస్థాన్ అనుకూల సిక్కు మిలిటెన్సీ..
విదేశీ గడ్డపై ఖలిస్తానీ వేర్పాటువాదుల అనియంత్రిత క్రియాశీలతతో కెనడాతో భారత్ సంబంధాలు గత సంవత్సరం నుంచి దెబ్బతిన్నాయి. ఇటీవల, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యపై ఒక హేయమైన పోస్టర్ ను అక్కడి ఖలిస్థాన్ తీవ్రవాద మద్దతుదారులు ప్రదర్శించారు. దీనిని ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ పేరుతో అక్కడ ప్రభుత్వం ప్రకటించిన భారత్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో, అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఖలిస్తాన్ సిద్ధాంతకర్త అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఫరీద్‌కోట్‌లో ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం మరో ఆశ్చర్యకరమైన విషయం.
పంజాబ్‌లో రాడికల్ సిక్కు మతం పెరుగుతున్న తీరును షా గమనించాలి దానిని మొగ్గలో తుంచేయాలి.
4. మావోయిస్టు హింసను
షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ప్రశంసనీయమైన పని చేసిన ప్రాంతం ఇది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో హింస 70 శాతం తగ్గిందని ఆయన మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంటుండగా, రెడ్ కారిడార్‌లోని కొన్ని నియోజకవర్గాలు చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వార్తల్లో నిలిచాయి.
అయితే, తీవ్ర వామపక్ష తిరుగుబాటుదారులతో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్లు ప్రతి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇంతకుముందు హామీ ఇచ్చినట్లుగా వచ్చే మూడేళ్లలో షా మావోయిస్ట్ భీభత్సాన్ని తుడిచిపెట్టగలరా? అనేది చూడాల్సి ఉంది.
5. కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడం
జూలై 1 నుంచి, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్యా అధినియం 2023 వరుసగా ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. .
బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన చట్టాన్ని ఆధునీకరించడం, నవీకరించడం లక్ష్యంగా గత సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న చర్య అయితే, సజావుగా పరివర్తన చెందేలా చూడాల్సిన బాధ్యత హోం మంత్రిత్వ శాఖపై ఉంది. మోదీ 2.0 ప్రభుత్వం న్యాయవ్యవస్థ, పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తోంది. మోదీ 3.0 ప్రారంభం కావడంతో ఈ శిక్షణ కొనసాగుతోంది. అయితే ఇది పూర్తి కాలేదు. ఇప్పటిదాకా శిక్షణ పొందిన సిబ్బంది చాలా పరిమిత సంఖ్యలో ఉన్నారు. దీనిని అమలు చేయడం ఇప్పటికీ సవాల్ గా ఉందని చెప్పవచ్చు.
6. జనాభా గణన, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు
దశాబ్దానికి ఒకసారి జరిగే జనాభా గణన 2011లో జరిగిన తరువాత ఇప్పటిదాకా జరగలేదు. కరోనాతో అప్పట్లో ఆలస్యం కాగా.. ఇప్పుడు మరోసారి గణన చేయాల్సిన అవసరం ఉంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కొత్త జనాభా గణనను చేపట్టవచ్చని మార్చిలో నివేదించగా, ఈ ఏడాది ప్రారంభంలో మధ్యంతర బడ్జెట్‌లో జనాభా గణన సర్వేలు, గణాంకాలకు రూ.1277.80 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం జనాభా లెక్కలు, జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) అప్‌డేట్ కసరత్తు ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. పౌరులు స్వీయ-గణనను అనుమతించే మొదటి డిజిటల్ జనాభా గణన కూడా ఇదే.
మహిళా రిజర్వేషన్ చట్టం లేదా నారీ శక్తి వందన్ అధినియం కూడా దశాబ్దాల జనాభా గణన తర్వాత మాత్రమే అమలు చేయబడుతుంది. అనేక రాజకీయ పార్టీలు కూడా కుల గణనను డిమాండ్ చేశాయి. వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సి ఉంది.
7. యూనిఫాం సివిల్ కోడ్‌
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలోగా యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చేలా చూస్తామని ఎన్నికలకు ముందు షా స్వయంగా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ, బిజెపికి మెజారిటీ రానందున, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ బలమైన ముస్లిం ఓటర్లను కలిగి ఉన్నందున ఇప్పుడు ఈ విషయం కొంచెం సవాలుగా మారిందని చెప్పవచ్చు. కాబట్టి, ఇది ఎలా అమలు చేస్తుందో చూడాలి.
8. సైబర్ నేరాల పెరుగుదల
సైబర్ నేరాల పెరుగుదల ప్రభావం ఎన్నికల సమయంలో కూడా రాజకీయ పార్టీలపై పడింది, డీప్‌ఫేక్‌లు సాధారణ వ్యవహారంగా మారాయి. పౌరుల డేటాను రక్షించడం, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించడం, దేశంలోని సైబర్ మౌలిక సదుపాయాలను సురక్షితంగా ఉంచడం హోం మంత్రిత్వ శాఖకు నిజంగా కొత్త సవాళ్లుగా చెప్పవచ్చు.
9. నాగా శాంతి చర్చలను ముగించడం
కొంత విరామం తర్వాత, కేంద్రం గత సంవత్సరం నాగా శాంతి చర్చలను తిరిగి ప్రారంభించింది, కానీ అది అసంపూర్తిగా ఉంది. ఎన్నికలకు ముందు ఆపివేసిన చోటు నుంచి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చర్చలు మళ్లీ కొనసాగుతాయని భావిస్తున్నారు.
Read More
Next Story