బీహార్‌లో ఎన్‌డిఏ పాలనను మహా-మంగళరాజ్గా అభివర్ణించిందెవరు?
x

బీహార్‌లో ఎన్‌డిఏ పాలనను "మహా-మంగళరాజ్"గా అభివర్ణించిందెవరు?

“జంగల్ రాజ్”గా ముద్ర వేసిన బీజేపీపై రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ తేజస్వీ యాదవ్ కసి తీర్చుకోబోతున్నారా? ఈ మధ్య ఆయన ఎక్స్ వేదికగా పెడుతున్న పోస్టులే అందుకు నిదర్శనమా?


తేజశ్వి యాదవ్ ఎక్స్ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న నేరాల జాబితాను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. మంగళవారం కూడా మరో పోస్టు చేశారు. నేర స్వభావం, నేరం జరిగిన ప్రదేశాన్ని సూచిస్తూ.. నాలుగైదు రోజుల్లో జరిగిన 40 నేరాల జాబితాను పోస్ట్ చేశారు. గడిచిన ఒకటిన్నర నెలల్లో ఆయన పోస్ట్ చేసిన ఆరో “క్రైమ్ బులెటిన్” ఇది. వీటికి తోడు రాష్ట్రంలో మూడు వారాల్లో 17 వంతెనలు కూలిపోవడం గురించి కూడా ప్రజలకు తెలిసేలా పోస్టులు పెడుతున్నారు.

హత్యలు.. దోపిడీలు..

ఇటీవల జరుగున్న నేరాలు స్థానిక హిందీ దినపత్రికల్లో క్రమం తప్పకుండా అచ్చవుతున్నాయి. వీటిలో హత్యలు, అత్యాచారాలు, బ్యాంకు దోపిడీలు, కిడ్నాప్‌లు ఉన్నాయి. జూలై 13న పాట్నా వివాహ వేడుకలో ఇద్దరు వ్యక్తులు మృతి, జముయిలో హత్యకు గురైన సీపీఐ(ఎంఎల్) నాయకుడి 18 ఏళ్ల మనవడు, ప్రాపర్టీ డీలర్‌ను కాల్చి చంపడం, జూలై 11న వైశాలిలో 17 ఏళ్ల బాలిక కిడ్నాప్, మోతీహరిలోని ప్రైవేట్ బ్యాంకు దోపిడీ ఘటనలున్నాయి.

బీహార్‌లో NDA పాలనను "మహా-మంగళరాజ్" గా పేర్కొన్న తేజస్వీ.. మూడు వారాల్లో 17 వంతెనలు కూలిపోవడాన్ని "అవినీతి, పాలనలోపంగా అభివర్ణించారు. రాష్ట్రంలో 15 ఏళ్ల లాలూ-రబ్రీ పాలనను చెడుగా చిత్రీకరించడానికి “జంగల్ రాజ్” కథనాన్ని లోక్ సభ ఎన్నికల వేళ ఎన్‌డిఎ మళ్లీ తెరమీదకు తెచ్చింది.

RJD చీఫ్, తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ 1990 నుంచి 1997 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా, లాలూ భార్య రబ్రీ దేవి 1997 నుంచి 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. అయితే 19 ఏళ్ల తర్వాత కూడా RJD బీహార్‌లో అధికారం నుంచి దూరమయినా..BJP మిత్రపక్షమైన JD(U) నాయకులు RJD "దుష్పరిపాలన" గురించి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉన్నారు. దీన్ని వారు జంగిల్ రాజ్ (అడవి పాలన)గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా.. బిజెపి నాయకులు నరేంద్ర మోదీ అమిత్ షా, జెడి(యూ) అధినేత నితీష్ కుమార్ ఆ "చీకటి రోజుల" గురించి ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి "జంగల్ రాజ్"ను గుర్తుకు తెచ్చారు.

అప్పట్లో అధికారిక క్రైమ్ డేటా ఆధారంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయనే వాస్తవాన్ని ఖండించడం లేదు. కానీ బీజేపీ, దాని ఎన్డీఏ మిత్రపక్షాలు పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.

తేజస్వి ఇటీవల ధైర్యం చేసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. కూలిన వంతెనల వివరాలను అడిగారు. వాటిని ఎప్పుడు నిర్మించారు. ఎవరి హయాంలో నిర్మించారు. టెండర్లకు ఎంతమంది వచ్చారు. టెండర్ ఎవరు, ఎంతకు దక్కించుకున్నారు. ఎవరు పునాది వేశారు. ఎవరు ప్రారంభించారు అనే వివరాలను తెలియజేయాలని కోరారు.

పెరిగిపోతున్న నేరాలు..

నితీష్ కుమార్ ఆర్‌జెడిని వదిలి ఎన్‌డిఎలోకి తిరిగి వచ్చినప్పటి నుంచి గత ఆరు నెలలుగా బీహార్‌లో నేరాలు పెరిగాయి. ఇసుక, మద్యం మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన డజనుకుపైగా పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బీహార్‌లో పెరిగిపోతున్న నేరాలపై నితీష్ కుమార్‌తో సహా ఎన్‌డిఎ నాయకులు ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాత్రమే "NDA డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని" లక్ష్యంగా చేసుకున్న తేజస్విని గట్టిగా ప్రతిఘటించారు. ఆయన 1990 నాటి పాలనను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ తరహాలో “పోలీస్ ఎన్‌కౌంటర్ మోడల్”, బుల్‌డోజర్‌లను ఉపయోగించాలని ఇతర బిజెపి నాయకులు బహిరంగంగా డిమాండ్ చేశారు.

అప్పడొకమాట.. ఇప్పుడొకమాట..

నితీష్ ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చి ఆర్‌జెడితో చేతులు కలిపినప్పుడల్లా (2013, 2022లో) బిజెపి నేతల నుంచి “జంగిల్ రాజ్” కథనాన్ని ఎదుర్కొన్నాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలను కూడా ఉటంకిస్తూ బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎక్కువ నేరాలు జరిగాయని పేర్కొన్నారు.

2014లో నితీష్ తన సీనియర్ పార్టీ నాయకుడు జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు లాలూ-రబ్రీ పాలనలో "జంగల్ రాజ్" లేదని బహిరంగంగా ప్రకటించారు. “లాలూ-రబ్రీ పదవీకాలాన్ని 'జంగల్ రాజ్'గా అభివర్ణించడం నిరాధారం. అలాంటిదేమీ లేదు” అని మాంఝీ ఉటంకించారు కూడా. ఇప్పుడు అదే మాంఝీ బిజెపి పక్కన చేరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. దళిత నాయకుడు, హిందుస్తానీ అవామ్ మోర్చా వ్యవస్థాపకుడు అయిన మాంఝీ మరోసారి ‘‘జంగల్ రాజ్‌’’ గురించి మాట్లాడుతున్నారు.

లాలూను ఎందుకు టార్గెట్ చేశారు?

2013లో బీజేపీతో తన 17 ఏళ్ల పొత్తును ముగించుకుని మళ్లీ 2022లో ఆర్జేడీతో జత కట్టినపుడు.. ప్రభుత్వాన్ని నడపడానికి నితీష్‌కు RJD మద్దతు ఇచ్చింది. నితీష్ స్వయంగా 2005లో నేర రహిత రాష్ట్రాన్ని వాగ్దానం చేసి తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన నేర రహిత బీహార్ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. రాజకీయ విశ్లేషకుడు సోరూర్ అహ్మద్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..బీహార్‌లో లాలూ-రబ్రీ పాలనకు ముందు, పాలనలో, పాలన తర్వాత కూడా నేరాలు జరిగాయని చెప్పారు. లాలూను చెడుగా చిత్రీకరించేందుకు BJP/JD(U) "జంగల్ రాజ్" అని ట్యాగ్ చేసింది. "రాష్ట్రంలోని శక్తివంత సామాజిక శక్తులను సవాలు చేసిన మాస్ లీడర్ నేడు భూస్వామ్య మూలాలకు అపఖ్యాతి పాలయ్యారు.’’

సాటిలేని ఘనత

“లాలూ-రబ్రీ పాలనలో తల్లులు తమ పిల్లలను కిడ్నాప్ చేస్తారనే భయంతో తమ ఇళ్ల నుండి బయటకు రానివ్వడం లేదని, సాయంత్రం కూడా ప్రజలు తమ ఇళ్లను వదిలి రాలేకపోతున్నారని, రాత్రులను మర్చిపోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అవన్నీ అతిశయోక్తులు. 'జంగిల్ రాజ్' చిత్రాన్ని రూపొందించడానికి వండిన కథలు తప్ప మరొకటి కాదు.”అని అహమద్ అన్నారు.

“వాస్తవం ఏమిటంటే.. పట్టణాలలో రాత్రిపూట మార్కెట్లు నడుస్తున్నాయి. వివాహాలు జరుగుతున్నాయి. థియేటర్లు పనిచేస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు నడుస్తున్నాయి. అందులో జనాలు ఎక్కుతున్నారు. 'జంగిల్ రాజ్' అని పిలిచే సమయంలోనే మొదటిసారిగా (ఫిబ్రవరి 26, 1996) పాట్నాలో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రాష్ట్రంలో 18 ఏళ్ల సుదీర్ఘ NDA పాలన తర్వాత కూడా ఆ ఘనత ఇంకా అలాగే ఉంది.”అన్నారాయన.

Read More
Next Story