CMC లాంటి ఆసుపత్రిని RSS ఎందుకు ఏర్పాటు చేయలేదు?
x
CMC Hospital, Vellore

CMC లాంటి ఆసుపత్రిని RSS ఎందుకు ఏర్పాటు చేయలేదు?

దేశంలో తొలిసారి ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ పాలనా పగ్గాలు చేపట్టి ఉంటే..వారు CMCని 'మార్పిడివాద' 'గొడ్డు మాంసం తినే' ఆసుపత్రిగా ప్రచారం చేసి మూసివేయించే వారేమో..


Click the Play button to hear this message in audio format

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక హిందూత్వ సంస్థ భారతదేశాన్ని పాలించి CMCని మూసివేసి ఉంటే.. కట్టయ్య చిన్న వయస్సులోనే చనిపోయిఉండేవాడు. మూఢనమ్మకాలకు పోకుండా..ఆధునిక వైద్యంతో తన ప్రాణాలను కాపాడుకున్నాడు.


1948లో జన్మించిన కంచ కట్టయ్య సొంతూరు తెలంగాణ రాష్ట్రం చెన్నారావు పేట్ మండలంలోని పాపయ్య పేట. 11వ తరగతి చదువుతుండగా పెళైంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు గొర్రెల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. 1976లో అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గుండెలోని రెండు కవాటాలు పనిచేయడం లేదని, వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేస్తే తప్ప ఎంతోకాలం బతకడని చెప్పారు. దాని కోసం తమిళనాడు రాష్ట్రం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (CMC)కు వెళ్లాల్సి ఉంటుందని సలహా ఇచ్చారు.

అప్పట్లో ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్‌లో కూడా స్పెషలైజ్డ్ కార్డియాలజిస్ట్ లేరు. కట్టయ్యకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ వరకు చదువుకున్న కంచా ఐలయ్య (ఈ వ్యాస రచయిత) తమ్ముడున్నాడు. తన అన్న ఆపరేషన్‌ కోసం ఆర్థిక సాయం చేయాలని అప్పట్లో నిజాం ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 8వేలు మంజూరైంది. ఆ డబ్బుతో కట్టయ్య తీసుకుని ఆయన కుటుంబసభ్యులు CMCకు బయల్దేరారు. మరోసారి పరీక్షించిన వైద్యులు..గుండెలోని మిట్రల్ వాల్వ్‌ మార్చాల్సి ఉందని, ఆపరేషన్‌కు డబ్బు బాగా ఖర్చవుతుందని చెప్పారు. కుటుంబసభ్యులు రూ. 50 వేలు అప్పుచేసి కట్టయ్యకు డిసెంబర్ 17, 1979లో ఆపరేషన్ చేయించారు. దాంతో మరో 46 ఏళ్ల ఆయుష్షు పోసుకున్న కట్టయ్య.. చివరకు 77 ఏళ్ల వయస్సులో ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.




కట్టయ్య మెడికల్ రికార్డు

అప్పట్లో CMC ఒక్కటే..

హార్ట్ వాల్వ్ మార్పిడి క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలోనే ఎందుకు చేశారు? హిందూత్వ మిషనరీ ఆసుపత్రిలో ఎందుకు చేయలేదు? అన్నదే ఇక్కడ ప్రశ్న. ‘‘పురాతన కాలం నుంచి నేటి వరకు హిందూ మతమే అన్ని శాస్త్రాలకు మూలం. పాశ్చాత్య దేశాల నుంచి ఏమీ నేర్చుకోవలసిన అవసరం లేదన్నది ప్రస్తుత పాలక RSS/BJP శక్తుల వాదన. వారు హిందువులుగా చెప్పుకునే శూద్రులు, దళితులు, ఆదివాసీలు హిందూ సిద్ధాంతాలను అధ్యయనం చేయడానికి, వాటిని సవాలు చేయడానికి అనుమతిం చడంలేదు. వాస్తవానికి వారు హిందూ మత భాష అయిన సంస్కృతాన్ని నేర్చుకోవడానికి మాత్రమే మొగ్గుచూపుతున్నారు.

వాస్తవానికి హిందుత్వ శక్తుల నిర్వాహకులు తమ గత బలహీనతను అంగీకరించరు. తమ బలహీనతను బలంగా చూపించాలనుకుంటున్నారు. మూఢనమ్మకాలను శాస్త్రంగా చూపించాలనుకుంటున్నారు. ఇక్కడే భారతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ముఖ్యంగా వైద్య సంస్థలు ప్రమాదంలో పడ్డాయి. వారు మతం, మూఢనమ్మకాలను ప్రోత్సహించే సంస్కృత పుస్తకాలను చదవమని భారతీయ యువతను బలవంతం చేస్తున్నారు.


ప్రబలంగా మూఢనమ్మకాలు..

వైద్యం ఒక శాస్త్రం. దానికి ఆధారం ఆసుపత్రి. మధ్యయుగంలో భారతదేశానికి వచ్చిన ఇస్లాం మతం..అల్లాహ్ అన్ని వ్యాధులను నయం చేస్తాడనే మూఢ నమ్మకాలను సృష్టించింది. అయితే CMC లాంటి ఆసుపత్రిని సృష్టించలేదు. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువే. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే దేవుళ్లకు మొరపెట్టుకుంటారు. త్వరగా కోలుకోవాలని వేడుకుంటారు. ఇది సాధారణంగా కనిపించేదే. కట్టయ్యను వెల్లూరుకు తీసుకెళ్తున్నపుడు తిరుపతిలో ఆగాల్సి వచ్చింది. అప్పుడు కట్టయ్య సోదరుడు దేవుడి దర్శనానికి వెళ్తావా? కట్టయ్యను అడిగాడు. అందుకు కట్టయ్య ..“నాకు ఆపరేషన్ చేసే సర్జన్ మంచివాడైతే నేను బతుకుతాను. వైద్యుడు మంచివాడై నాకు సరైన మందులు రాసి ఇస్తే ఎక్కువ కాలం జీవిస్తా. దేవుళ్ల దర్శనంతో కాదు” అని బదులిచ్చాడు కట్టయ్య. కట్టయ్య తన పాఠశాల విద్య ముగిసే సమయానికి మూఢ నమ్మకాలకు దూరంగా ఉండేవారు. తన తల్లి, తండ్రి మరణం తర్వాత కూడా తన ఇంట్లో మూఢనమ్మకాలను ప్రోత్సహించలేదు.


నెహ్రూ సైన్స్ vs ఆర్ఎస్ఎస్ యాంటీ సైన్స్..

భారతదేశం మూఢనమ్మకాల దేశం. క్రైస్తవ మిషనరీ ఆసుపత్రులు, పాఠశాలలను ప్రోత్సహించడం నెహ్రూ శాస్త్రీయ స్ఫూర్తికి నిదర్శనం. నెహ్రూ జాతీయవాదం CMC లాంటి క్రైస్తవ ఆసుపత్రులను, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లాంటి అధునాతన సంస్థలను అనుమతించింది. అయితే విద్యావంతులైన పురుషులు, మహిళలు కూడా ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మహాసభ, బజరంగ్ దళ్ లాంటి సంస్థల ప్రచారంతో..శాస్త్రీయ స్ఫూర్తికి వ్యతిరేకంగా మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు. నాగ్‌పూర్‌లో లేదా మరెక్కడా CMCతో పోటీపడే ఒక్క ఆసుపత్రిని కూడా RSS ఏర్పాటు చేయలేదు.

CMCని క్రైస్తవ మిషనరీ సంస్థ ఏర్పాటు చేస్తే.. హిందుత్వ సంస్థలు కుంభమేళాలు, కాశీ యాత్రలు, దుర్గా పూజలను నిర్వహించాయి. కానీ ఆధునిక వైద్యంపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు.

నిజానికి ఆధునిక వైద్యాన్ని బ్రిటీష్ వలస వైద్యంగా, పురాతన స్వదేశీ ఆయుర్వేదానికి వ్యతిరేకంగా చూశారు. ‘ఇంగ్లీష్ వైద్యం’ అని దుర్భాషలాడే ఆయుర్వేద వైద్యులు.. సైన్స్, వలసవాదం మధ్య తేడాను ఎప్పుడూ గుర్తించలేదు. తెలంగాణలో కూడా గంగానదిలో మునిగితే వ్యాధులు నయమవుతాయని చెబితే ప్రజలు నమ్మాల్సి వచ్చింది.

అదే తొలి వాల్వ్..

మళ్లీ కట్టయ్య విషయానికొస్తే.. కట్టయ్యకు CMCలో డాక్టర్ స్టాన్లీ జాన్ శస్త్రచికిత్స చేసి అప్పుడే అమెరికా వైద్య మార్కెట్లోకి వచ్చిన స్టార్ ఎడ్వర్డ్ స్టీల్ వాల్వ్‌ అమర్చారు. అదే ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ నిర్మిత వాల్వ్.

ఇక్కడ CMC గురించి కూడా కొంత చెప్పుకోవాలి. అమెరికన్ మిషనరీ మహిళ డాక్టర్ ఇడా సోఫియా స్కడర్ .. నర్సింగ్, ప్రసవ సేవల కోసం CMCని స్థాపించారు. క్రమేణా విదేశీ నిధులు, దాతల విరాళాలలో బాగా అభివృద్ధి చెందింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల సమీకరణకు అనుమతి ఇవ్వడం ద్వారా మరింతగా అభివృద్ధి చెందింది.


బీజేపీ అధికారంలో ఉండి ఉంటే..

భారతదేశంలో తొలి పాలక శక్తిగా ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీని ఊహించుకోండి. వారు సీఎంసీని 'మార్పిడివాద' 'గొడ్డు మాంసం తినే' ఆసుపత్రిగా ప్రచారం చేసి దాన్ని మూసివేసి ఉండవచ్చు. గొడ్డు మాంసం అనే మాట గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సీఎంసీ క్యాంటీన్‌లో రోగులకు అప్పట్లో పోషకాహారంగా సబ్సిడీ ధరకు గొడ్డు మాంసం పెట్టేవారు. కట్టయ్య లాంటి రోగులకు కూడా వైద్యులు గొడ్డు మాంసాన్ని సిఫార్సు చేశారు. అయితే బలవంతంగా తినిపించలేదు.

సైన్స్, మూఢనమ్మకాలు(superstition) రెండూ విరుద్ధ అస్తిత్వాలు. ఆర్‌ఎస్‌ఎస్ మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తుంది. దానిపై చర్చకు సైన్స్, మతానికి సైద్ధాంతిక సామర్థ్యం లేదు. భారతదేశంలో మూఢనమ్మక వ్యతిరేక చట్టాలు అవసరం. మూఢనమ్మకాలకు పోయి గుండె సంబంధిత వ్యాధిగ్రస్థులు, ఇతరత్రా వ్యాధులతో చాలా మంది మరణించారు.


కుల నిర్మాణం..

RSS సిద్ధాంతకర్తల పూర్వీకులు ఏర్పాటుచేసిన ప్రధాన సంస్థల్లో కులం ఒకటి. కుల వ్యవస్థ ఇప్పుడు చాలా మంది భారతీయుల మనస్సుల్లో మూఢ నమ్మకాలను బీజం వేసింది. కులం ఒక మతపర సంస్థ కాదు. అది స్వయంగా ఒక మూఢనమ్మకం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత RSS (అది తనను తాను సామాజిక సంస్థగా పిలుచుకుంటున్నప్పటికీ) అధికారంలోకి వచ్చి CMCని మూసివేసి ఉంటే.. కట్టయ్య 46 ఏళ్ల క్రితమే చనిపోయి ఉండేవాడు.

ప్రపంచంలో వైద్య శాస్త్రం ఎంతో పురోగతి సాధిస్తోందని, కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని మనకు తెలుసు. కానీ భారతదేశం ఆ రంగంలో వెనుకబడి ఉంది. ఈ విషయంలో RSS/BJP అనుసరిస్తున్న శాస్త్ర వ్యతిరేకత, యాంటీ ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్ మనల్ని మరింత వెనుకబాటుకు గురిచేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు శాస్త్రీయ స్ఫూర్తి గురించి ఎలాంటి చర్చ లేదు.

(రచయిత దివంగత కంచ కట్టయ్య సోదరుడు). ఇందులోని అభిప్రాయాలు పూర్తిగా కంచ ఐలయ్య వ్యక్తిగతం. ఫెడరల్‌ తెలంగాణలో వాటికి సంబంధం లేదు.



Read More
Next Story