NCP ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి హత్య బెదిరింపులు
రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ఆగంతకుడు - భద్రతను పెంచిన పోలీసులు
ఎన్సీపీ(NCP) నాయకుడు బాబా సిద్ధిఖీ (Baba Siddique) కుమారుడు జీషాన్ సిద్ధిఖీకి మరోసారి హత్యా బెదిరింపులు వచ్చాయి. ‘‘రూ.10 కోట్లు ఇవ్వకపోతే నీ తండ్రిని చంపినట్లే నిన్ను కూడా హతమారుస్తాం. అడిగినంత డబ్బు చెల్లించకపోతే ప్రతి 6 గంటలకు ఓ సారి ఇలాంటి మెయిల్స్ వస్తూనే నీకు వస్తూనే ఉంటాయి’’ అని ఓ గుర్తు తెలియని వ్యక్తి జీషాన్కు మెయిల్ పంపాడు. గత మూడు రోజులుగా తనకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయని, ఫలితంగా తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జీషాన్ (Zeeshan Siddique) పోలీసులకు చెప్పారు. తనకు వచ్చిన మెయిల్ 'D కంపెనీ' నుంచి వచ్చిందని NCP (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యే సిద్ధిక్ చెప్పారు.
బాబా సిద్ధిఖీ హత్య..
జీషన్కు ఇలాంటి బెదిరింపులు (Death threat) రావడం ఇదే మొదటిసారి కాదు. 2024 అక్టోబర్లో బాంద్రా ఈస్ట్లోని తన కార్యాలయం వెలుపల ముగ్గురు దుండగులు ఆయన తండ్రి బాబా సిద్ధిఖీని హత్య చేసినప్పటి నుంచి జీషన్కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. వచ్చిన మెయిల్స్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ముడిపడి ఉన్నవే ఎక్కువ.
హత్య కేసు దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు..పంజాబ్లో ఆకాశ్దీప్ గిల్ అనే కార్మికుడిని అరెస్టు చేసి గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ సూచనమేరకు హత్య కుట్రలో గిల్ లాజిస్టిక్స్ కోఆర్డినేటర్గా పనిచేశాడని పేర్కొన్నారు.
గతంలో జీషన్కు మెయిల్ పంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. జీషన్ సిద్ధిఖ్ కార్యాలయానికి ఎనిమిది వాట్సాప్ మెసేజ్లను పంపిన నోయిడాకు చెందిన టాటూ ఆర్టిస్ట్ మొహమ్మద్ తయ్యబ్ను అరెస్టు చేశారు. జీషన్, సల్మాన్ ఖాన్కు హాని కలిగించే ప్లాన్ గురించి మాట్లాడుకుంటుండగా తాను విన్నానని తయ్యబ్ పోలీసుల విచారణలో చెప్పాడు.
పత్రికలలో వచ్చిన జీషన్ బెదిరింపుల వార్తలను చూసి బాంద్రా నివాసి ఆజం మొహమ్మద్ ముస్తఫా ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్కు బెదిరింపు సందేశం పంపాడు. రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన అతడిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
భద్రత పెంపు..
బెదిరింపుల దృష్ట్యా జీషాన్కు ముంబై (Mumbai) పోలీసులు భద్రతను పెంచారు. Y' కేటగిరీ భద్రత కల్పించారు. జీషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ నిమిత్ గోయల్ నేతృత్వంలోని అధికారులు తెలిపారు.