ఏపీ, బీహార్‌లకు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించబోతున్న కేంద్రం!
x

ఏపీ, బీహార్‌లకు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించబోతున్న కేంద్రం!

బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఒదిషా, జమ్మూ కశ్మీర్‌‌లకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.


ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం, జేడీయూ తమ రాష్ట్రాలైన ఏపీ, బీహార్‌లకు ప్రత్యేక హోదా కల్పించాలని ఒత్తిడి చేయటానికి సిద్ధమయ్యాయి.

జేడీయూ సీనియర్ నాయకుడు, బీహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి నిన్న మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వాలని అన్నారు. చారిత్రక, భౌగోళిక కారణాలరీత్యా బీహార్‌లో సహజ వనరుల కొరత ఉందని, తీరప్రాంతంగానీ, గనులుగానీ లేవని చౌదరి గుర్తు చేశారు. ఇన్ని పరిమితులు ఉన్నా, నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. బీహార్‌లోని ప్రాజెక్టులకు బడ్జెట్‌లో 30 వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఎన్‌డీఏలోని మరో కీలకపక్షమైన తెలుగుదేశం కూడా ఎంతోకాలంగా ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తోంది. 2014లో జరిగిన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికపరంగా, అభివృద్ధిపరంగా సవాళ్ళను ఎదుర్కొంటోంది. ప్రత్యేకహోదా వస్తే పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయని ఏపీ వాదిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 16న కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక అవసరాల గురించి చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటోందని, ఒక పెద్ద మొత్తాన్ని ఈ బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి కేటాయించాలని కోరారు.

అన్యాయమైన విభజన

2014లో అన్యాయంగా జరిగిన విభజన వలన, గత ప్రభుత్వపు దారుణమైన పరిపాలన వలన ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిని ఉందని చంద్రబాబు అమిత్ షాకు వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక సాయం అడుగుతున్న బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఒదిషా, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌ వంటి ఆరు రాష్ట్రాలకు వచ్చే బడ్జెట్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

నీతి ఆయోగ్ నిబంధనల కింద ఈ రాష్ట్రాలకు వేటికీ ప్రత్యేక హోదా ఇవ్వటానికి వీలవదని, అభివృద్ధికి ఊతమివ్వటానికి వీటికి స్పెషల్ ప్యాకేజ్ సాధ్యమవుతుందని అంటున్నారు.

ప్రత్యేక హోదా ఎందుకు?

ఐదవ ఆర్థిక సంఘం సిఫార్సులమేరకు 1969లో ప్రవేశపెట్టబడిన ఈ ప్రత్యేక హోదా అనేది భౌగోళిక, ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సాయం మరికొన్ని ప్రయోజనాలను కల్పించటానికి ఉద్దేశించినది.

నాటి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు, సామాజిక శాస్త్రవేత్త ధనంజయ్ రామచంద్ర గాడ్గిల్ రూపొందించిన ఈ ప్రత్యేక హోదా అనేది పర్వత ప్రాంతాలు, తక్కువ జనసాంద్రత, అధిక గిరిజన జనాభా, వ్యూహాత్మక ప్రదేశాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనకబాటుతనం, ఆచరణీయం కాని రాబడులు వంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకోసం ఉద్దేశించబడినది.

Read More
Next Story